Best Web Hosting Provider In India 2024

ఆయన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్
ప్రజా సంక్షేమం, పాలన గాలికొదిలిన చంద్రబాబు
‘చంద్రన్న పగ–దగా’ ఇదే కూటమి ప్రభుత్వ తీరు
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం
అధికారమే చంద్రబాబు రాజకీయ సిద్దాంతం
అందుకోసం ఎప్పటికప్పుడు ప్లేటు ఫిరాయింపు
నాడు ‘మోదీ హఠావో.. దేశ్ కో బచావో’ నినాదం
నేడు మోదీని నెత్తిన మోస్తూ అదే పనిగా పొగడ్తలు
గుర్తు చేసిన కురసాల కన్నబాబు
కేజ్రీవాల్ ఓటమికి చంద్రబాబు కొత్త బాష్యం
ఉచితాలను వ్యతిరేకించినందుకే ఆయన ఓడాటట!
పరోక్షంగా సూపర్సిక్స్ సాధ్యం కాదని తేల్చిన బాబు
అందుకు ప్రజల మైండ్ సెట్ చేసేలా మాటలు
ఇదే చంద్రబాబు నైతికత లేని రాజకీయం
ప్రెస్మీట్లో ఎండగట్టిన కురసాల కన్నబాబు
కాకినాడ: రాజకీయాల్లో తన ప్రయోజనాలకు అనుగుణంగా రంగులు మార్చే నాయకుడు ఒక్క చంద్రబాబేనని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు నైజం చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు. రాజకీయాల్లో అధికారం తప్ప ఎటువంటి సిద్దాంతాలు లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తన స్వార్థం కోసం ఏ క్షణం ఎలా కావాలంటే అలా మాట్లాడగలిగే నైజం చంద్రబాబు సొంతమని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో అమలువుతున్న చంద్రన్న పగ–దగా మాత్రమేనని అన్నారు.
ప్రెస్మీట్లో కురసాల కన్నబాబు ఇంకా ఆయన ఏమన్నారంటే..:
ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు ఓటములు చూసినవే. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. ఆయన గతాన్ని చాలా సులువుగా మార్చిపోతున్నారా? గతం గుర్తుండదా అనే సందేహం కలుగుతోంది. కేజ్రీవాల్ ఓటమిపై చంద్రబాబు మాట్లాడుతూ నరేంద్రమోదీని పొడగ్తలతో ముంచెత్తారు. సరైన సమయంలో.. సరైన నాయకత్వం ఈ దేశానికి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమైందంటూ ఆశాకానికి ఎత్తేశారు.
2019 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇదే రాష్ట్రంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం చేశారు. కేజ్రీవాల్ అంత గొప్ప నాయకుడు లేరని చంద్రబాబు ప్రకటిస్తే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఒక దిక్సూజీ అంటూ కేజ్రీవాల్ తనవంతు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాలుక మడతేసి నరేంద్రమోదీ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అంటూ భజన ప్రారంభించారు. కేజ్రీవాల్ ను 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి తీసుకువచ్చి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకున్నాడు. ఈ సందర్భంగా ’బాబుతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది’ అని కేజ్రీవాల్ విశాఖపట్నం ర్యాలీలో పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని కేజ్రీవాల్ ఆరోపిస్తే దానికి మద్దతు పలికింది కూడా ఇదే చంద్రబాబు. తనకు అనుక్షణం మద్దతు ఇచ్చే ఎల్లో మీడీయా అండతో ఏదైనా చెప్పగలను, ప్రజలను ఈ ఎల్లో మీడియా సాయంతో మభ్యపెట్టగలను అని నమ్మకంతో ఉన్నారు. తాను చాలా రాజనీతిజ్ఞడిని అని చెప్పుకునే చంద్రబాబు ఆనాడు నరేంద్రమోదీపై అతి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే నరేంద్రమోదీని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడుతున్నారు.
నరేంద్రమోదీని గురించి చంద్రబాబు గతంలో ఏమన్నారంటే..:
2018–19లో చంద్రబాబు మాట్లాడుతూ ఈ దేశానికే నరేంద్రమోదీ సరైన నాయకుడు కాదని ప్రకటించారు. ఈ దేశంలో నరేంద్రమోదీకి సవాల్ విసిరిన మొట్టమొదటి నాయకుడిని తానేనని కూడా చాటుకున్నారు. నరేంద్రమోడీ నియంత.. అటువంటి నియంతను తలదన్నేలా తాను మాట్లాడుతున్నా అని అన్నారు. మోదీ దగాకోరు, అధ్వానికే పంగనామాలు పెట్టారని, ఆయనకు భయం అంటే ఏమిటో తెలుస్తుంది ఇదే చంద్రబాబు బహిరంగ విమర్శలు చేశారు. అంతేకాదు ఓటమిని చవిచూసేందుకు గుండెదిటువు చేసుకోవాలంటూ నరేంద్రమోదీకి చంద్రబాబు బహిరంగ లేఖ కూడా రాశారు.
2018లో పశ్చిమ గోదావరిజిల్లాలో చంద్రబాబు మాట్లాడుతూ అవినీతి కుడితిలో పడి నరేంద్రమోదీ గిలగిలలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి మోదీ చేసినంత ద్రోహం ఎవరూ చేయలేదు అని కూడా అన్నారు. ఏపీపై నరేంద్రమోదీ పగపట్టారు, ప్రధాని ఒక అసమర్థుడు, తాను ఒక్క పిలుపునిస్తే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర వాహనాలు కదలవని కూడా చంద్రబాబు హెచ్చరించారు. మీ ఆటలు చెల్లవు, ఢిల్లీ నడివీధుల్లో సవాల్ విసురుతున్నాను, ఈ దేశానికి మోదీ వల్ల ఒరిగింది ఏమీ లేదని, తనతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు.
దేశంలోని దోపిడీదారులు నరేంద్రమోదీని చూసుకుని దేశాన్ని వదలి వెళ్ళిపోతున్నారని విమర్శించారు. నరేంద్రమోదీని నమ్మి మోసపోయాం, ఆయన వల్ల పైసా లాభం లేదు, కేంద్రానిది పద్దతిలేని పాలన అని కూడా తీవ్రంగా విమర్శించారు. అన్నింటికి మించి ’మోదీ హఠావో… దేశ్ కో బచావో’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత అయిదేళ్ళ కిందట నరేంద్రమోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు, ఆరోపణలు ఇవి.
ఉచితాలను ప్రజలే వద్దంటున్నారంటూ కొత్త వాదన:
సంక్షేమం ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించడం లేదు, సంపద సృష్టించకుండా సంక్షేమ పథకాలు ఇవ్వడం సాధ్యం కాదు అంటూ నిన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. సంక్షేమం అనేదానికి ప్రాధాన్యత లేదు, స్థిరత్వం కావాలంటే సంపదసష్టి ద్వారా వచ్చిన ఆదాయాన్నే ప్రజలకు ఇవ్వాలన్నట్లుగా చెప్పారు. ఏపీ, ఢిల్లీ రాష్ట్రాల్లో ఉచితాలు ఇవ్వడం అనేది విఫలమైందని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవన్నీ విఫల ప్రయోగాలు అయితే ప్రజలకు సూపర్ సిక్స్ తో పాటు 103 హామీలను చంద్రబాబు ఎలా ఇచ్చారు? అంటే ఎన్నికల్లో ప్రజల ఓట్లు కావాలి కాబట్టి ఈ సంక్షేమ పథకాను, ఉచితాలను ప్రకటించారా? ఇప్పుడు వాటిని అమలు చేయనూ, ఇవ్వన్నీ ఉపయోగం లేనివి అంటున్నారా? రాష్ట్ర ప్రగతిని పెంచడమే నాకు ముఖ్యం అని చెప్పారు. తనపైన ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తాను అనుకున్నదే చేస్తానని చెబుతున్నారు.
సంక్షేమ పథకాలు నా ప్రాధాన్యత కాదు అని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? ఈ రాష్ట్రంలో తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం తన ప్రాధాన్యత కాదు అని చంద్రబాబు చాలా స్పష్టంగా ప్రకటించారు. ప్రజల మైండ్ ను హామీల అమలు ఉండదనేందుకు అనుగుణంగా సెట్ చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు విశ్వసనీయత?
రాష్ట్రంలో అధ్వాన్న పాలనకు ర్యాంకులే నిదర్శనం:
ఇటీవల చంద్రబాబు మంత్రులకు పనితీరు ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. చంద్రబాబుకు ఆరు, లోకేష్ కు ఎనిమిది, పవన్ కళ్యాణ్ కు పదో ర్యాంకు ఇచ్చారు. పెద్ద శాఖలకు నిత్యం వందలాది ఫైళ్లు వస్తుంటాయి. కొన్ని చిన్నశాఖలకు తక్కువ ఫైళ్ళు వస్తుంటాయి. విద్య, ఆర్థికం, వ్యవసాయం, పంచాయతీరాజ్ వంటి శాఖలకు ఎక్కువ ఫైళ్లు వస్తుంటాయి. సీనియర్లు, కీలకంగా పనిచేస్తున్న వారు ఈ ర్యాంకుల్లో కింద కనిపిస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ కు 24వ ర్యాంకు ఇచ్చారు. ఈ శాఖకు వచ్చే ఫైల్స్ క్లియర్ కావడం లేదు అంటే మీ పాలనలో ఆర్థిక పరిస్థితి సజావుగా లేదు, వచ్చిన ఫైల్స్ కూడా సకాలంలో క్లియర్ చేయలేకపోతున్నారని అంగీకరించినట్లే.
ర్యాంకుల పేరుతో కూటమి నేతల మధ్య విభేదాలు çసృష్టించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. మొత్తంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ర్యాంకు ఏమిటా అని చూస్తే కనీసం పాస్ మార్కులు కూడా రాలేదు. ఈ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ నేతలు, నాయకులపై పగ తీర్చుకోవడం, రెండోది ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం చేస్తున్నారు. అంటే చంద్రన్న పగ… చంద్రన్న దగా మాత్రమే ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి మూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చామని చెప్పారు. మీరు రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. మొత్తంగా నాలుగు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి.
రాష్ట్రంలో శాంతిభద్రలు క్షీణించాయి. గంజాయి విచ్చలవిడి అమ్మకాలు పెరిగిపోయాయి. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దిశా చట్టాన్ని ఎత్తేశారు. సోషల్ మీడియాపైన పెద్ద ఎత్తున తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలను బాగా చూసుకుంటాను, ఇకపై వైయస్ జగన్ 2.0ని చూస్తారు అని చెప్పారు. దానిపై చంద్రబాబు స్పందిస్తూ వైయస్ జగన్ చెప్పింది విన్న ప్రజలు భయభ్రాంతులకు గురై ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు అంటూ మాట్లాడారు. వైయస్ జగన్ గారు మళ్లీ అధికారంలోకి వస్తాము అన్న మాటలకే చంద్రబాబు కంగారు పడుతున్నారు. వైయస్ జగన్ ఒక శక్తి, మూడు పార్టీలు కలిసి వచ్చి కట్టుకథలు, తప్పుడు ప్రచారాలు చేయడం వల్లే అధికారంకు దూరమయ్యారు. ప్రజలకు మేలు చేసే విషయంలో ఆయన ఏనాడు వెనుకంజ వేయలేదు.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
2014–19లో ప్రత్యేక హోదా కోసం వైయస్ జగన్ గారు పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదా కోసం అనేక సార్లు కేంద్రంపై వత్తిడి తెచ్చాం. ఏనాడు మేం ఎన్డీఏలో భాగంగా లేము. రెండుసార్లు భాగంగా ఉన్న చంద్రబాబు హోదా కోసం దానికి ఏ మాత్రం బాధ్యతతో వ్యవహరించ లేదు. 2018లో 22 మంది మత్స్యకారులను పాకిస్తాన్ జైళ్ళలో ఉంచారని శ్రీకాకుళంలో మత్సకారులు పాదయాత్ర సందర్భంగా వైయస్ జగన్ గారికి మొరపెట్టుకున్నారు.
అధికారంలోకి వచ్చిన తరువాత విదేశాంగ శాఖపై ఒత్తిడి తెచ్చి పాకిస్థాన్ జైళ్ళ నుంచి విడిపించి, వారిని ఆ దేశం నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్ గారిది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల రూపాయలు ఇచ్చారు. దీనిపై ఈ రోజు ఒక సినిమా కూడా తీశారు. అమెరికా నుంచి భారతీయులను సంకెళ్ళతో తీసుకు వస్తున్న వైనంపై ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబును ప్రశ్నించాలని కన్నబాబు సూచించారు.