Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
తాడేపల్లి: శాసన మండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ నీళ్లు నములుతున్నారని, ఇక మా పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే తట్టుకోలేమనే భయం పట్టుకుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వైయస్ జగన్ సభలో మాట్లాడితే సమాధానం చెప్పే దమ్ము లేక వైయస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని ఆక్షేపించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో కూటమి నేతల మాటలు విని ప్రజాస్వామ్యవాదులు తల దించుకుంటున్నారన్నారు. శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుంటే అధికార పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. శాసనసభలో నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయని, అందులో మూడు పార్టీలు అధికారపక్షంగా కొనసాగుతున్నాయని, మిగిలిన వైయస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని మేం కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే కార్లు, జీతాలు, భత్యాలు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. హోదా గురించి మేము ఆరాట పడటం లేదని, కేవలం ప్రజా సమస్యలపై మాట్లాడటానికి అవకాశం కల్పించమని అడుగుతున్నామన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు 40 శాతం మంది వైయస్ఆర్సీపీకి ఓటు వేశారని, చట్టం ప్రకారమే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించమని అడుగుతున్నామని తెలిపారు. 1977లోనే పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారమే మేము ప్రతిపక్షంగా గుర్తించమని పోరాడుతున్నామన్నారు. మా 11 మంది సభ్యులను చూస్తే ప్రభుత్వానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్షంలో కూర్చుంటామంటే మాకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వత్వ తప్పులను ఎత్తి చూపటానికి ఒక ప్రతిపక్షం ఉండాలని మాత్రమే మేము కోరుకుంటున్నామని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్కొన్నారు.