Best Web Hosting Provider In India 2024

తీవ్రంగా ఖండించిన వైయస్ఆర్సీపీ నేతలు
అమరావతి: ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) ని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అరెస్టు నోటీసులో 27వ తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్ నంబర్లో ఓబులపల్లి పీఎస్ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్ చేస్తున్నారు. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమని వైయస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. పోలీసు మురళి అక్రమ అరెస్టును వైయస్ఆర్సీపీ(YSRCParty) నేతలు తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో అరాచక పాలన: ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి
రాష్ట్రంలో ఆరాచక పాలన తప్ప ప్రజాపరిపాలన లేదు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులను రోజుకు ఒకరిని అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయడం అక్రమం. ఏ కేసులో అయనను అరెస్ట్ చేశారో కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. కాని ఏమాత్రం వివరాలు చెప్పకుండా అదుపులోకి తీసుకోవడం దుర్మార్గం. చంద్రబాబు రానున్నకాలం లో మీకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మరచిపోవద్దు.
పోసాని అరెస్టు దారుణం: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
పోసాని కృష్ణమురళి అరెస్టు దారుణం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక అక్రమ కేసులతో వేధిస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను సమయానికి నెరవేర్చారు. సూపర్ సిక్స్ ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు డబ్బాలు కొట్టారు. పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినకుండా అరెస్ట్ చేశారు. నిన్న అరెస్ట్ చేసి నోటీస్ లో ఈ రోజు డేట్ వేశారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. అరెస్టులతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చాలి ..డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి . ఎవరినీ వదలను అందరినీ అరెస్ట్ చేయిస్తానంటూ లోకేష్ బరితెగించి మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
రెడ్బుక్ పాలన నడుస్తోంది: ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్బుక్ పాలన నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు దిగుతూనే ఉంది. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దారుణం. ఏపీలో రెడ్బుక్ పాలన నడుస్తోందనడానికి పోసాని అరెస్టు మరొక ఉదాహరణ. పోసాని కృష్ణ మురళికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వ అరాచక పాలన ఎక్కువ రోజులు కొనసాగదు.
పోసాని అరెస్ట్ పవన్ కళ్యాణ్ ఆలోచనే: మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్
పోసాని మురళికృష్ణ అరెస్టు వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్, లోకేష్ ఇద్దరి దగ్గర రెడ్బుక్స్ ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టులేక అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏపీ ఇమేజ్ డ్యామేజి అవుతుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు. భవిష్యత్ లో ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వం కేసులు పెడితే..ఎదురించి నిలబడతాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షా ఏం చేస్తున్నారు?
అన్నీ గుర్తు పెట్టుకుంటాం: మచిలీపట్నం ఇన్చార్జ్ పేర్ని కిట్టు
ఏపీలో అరెస్టుల పర్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గుర్తుచేస్తోంది. ఇలాంటి ఘటనలను ఇంతకుముందెన్నడూ ఎక్కడా జరగలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేస్తున్నారు. మరి మీరు పెట్టిన పోస్టుల సంగతేంటి?
ఇప్పుడు జరుగుతున్న అరెస్టులకు పర్యవసానం కచ్చితంగా అనుభవిస్తారు. రూల్స్ దాటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న అధికారులను గుర్తు పెట్టుకుంటాం.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది. విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది. అందుకే పోసానిని అరెస్టు చేశారు. ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు. పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు.
పోసాని అరెస్టు రాజ్యాంగ విరుద్ధం: మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్
పోసాని కృష్ణమురళిని అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఇవి కక్షపూరిత చర్యలే. పోసాని అనారోగ్యంతో ఉన్నప్పటికీ పోలీసులు రాత్రి వేళ తరలించడం అన్యాయం. కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో భవిష్యత్తులో అదే గతి వారికీ పడుతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అన్యాయం. భేషరతుగా పోసాని కృష్ణమురళిని విడుదల చేయాలి.