




Best Web Hosting Provider In India 2024

AP Assembly : రామన్నా.. పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి.. అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం
AP Assembly : ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అయితే శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలని.. మంత్రి నిమ్మలకు లోకేష్ సూచించారు.

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కేవలం పనిపైనే కాకుండా.. కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని మంత్రి లోకేష్ సలహా ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తావించారు. రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కోరారు. దీంతో శాసనసభలో నవ్వుల పువ్వులు విరిశాయి.
సస్పెండ్ చేయాలా..
విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ.. లోకేష్ చమత్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామానాయుడు ఎదురుపడినపుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేశారు. ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని మరో చేతిలో కాగితాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటే.. ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు.
విశ్రాంతి తీసుకుంటా..
లోకేష్కు బదులిస్తూ.. నిన్నటి మీద ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానని రామానాయుడు సమాధానమిచ్చారు. మాట వినకుంటే తన యాపిల్ వాచ్ని మీ చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ చెప్పారు. ఈరోజు సభ అయ్యాక మీ మాట ప్రకారమే విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు చెప్పారు. దీంతో అందరూ నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.
ప్రభుత్వంపై షర్మిల విమర్శలు..
‘ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్నా.. దాటాక బోడి మల్లన్నలా ఉంది కూటమి ప్రభుత్వ తీరు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ..ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి, ఓట్లు వేయించుకొని, ఇప్పుడు కండీషన్ అప్లై అనడం దారుణం. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసం. అమలు చేయాలన్న చిత్తశుద్ది లేక చెప్పే సాకులు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి’ అని షర్మిల ట్వీట్ చేశారు.
మోసం చేశారు..
‘ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహార యాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టే ఈ ప్రభుత్వం.. రేపు అమల్లోకి తెచ్చే సరికి నియోజక వర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో’ అని షర్మిల సెటైర్లు పేల్చారు.
తెలంగాణ, కర్ణాటకలో..
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమే. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా అంతా ఉచితమే. ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎంతదూరమైనా జీరో టికెట్. ఇలాంటి మంచి పథకాన్ని, అతి తక్కువ ఖర్చుతో మహిళలకు మేలు జరిగే హామీని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా మనసు రావడం లేదు. నెలకు రూ.350 కోట్లు మహిళల కోసం ఆర్టీసికి ఇవ్వడానికి ధైర్యం చాలడం లేదు’ అని షర్మిల విమర్శించారు.
లాభనష్టాలు చూడాలా..
‘మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభ నష్టాలు చూడాలా.. ఇదేనా కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న మహిళా సాధికారిత.. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని, రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణం సౌకర్యం ఉండాలని.. రాష్ట్రంలోని మహిళల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’ అని షర్మిస స్పష్టం చేశారు.
టాపిక్