

Best Web Hosting Provider In India 2024

TG Indira Mahila Shakti Mission : ఇక ఒకే గొడుగు కిందకి ‘మహిళా సంఘాలు’ – కొత్త పాలసీ అమలు దిశగా కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పట్టాలెక్కనుంది. మహిళా దినోత్సవరం సందర్భంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రం లోని కోటి మంది మహిళలను సంఘటితం చేయనున్నారు.

కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్-2025 పేరుతో కొత్త పాలసీ తీసుకొచ్చింది. అందులో భాగంగా మహిళా సంఘాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలు సెర్ఫ్ ఆధ్వర్యంలో, పట్టణాల్లో మెప్మా పరిధిలో మహిళా సంఘాలు కార్యకలాపాలు చేపడుతున్నాయి. వీటన్నింటిని ఒకే వేదికపైకి తీసుకురావాలని ఇటీవలే మంత్రివర్గం నిర్ణయించింది. వీటి బాధ్యతలను నగరం, పట్టణాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏలోని సెర్ఫ్ చూస్తున్నాయి. రెండు శాఖలను విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించగా… ఇక మీదట ఇందిరా మహిళా శక్తి మిషన్ పేరుతో రెండు శాఖల అధికారులు, ఉద్యోగులు పని చేసే అవకాశముంది.
కొత్త పేరు పెడుతారా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూ లన సంస్థ(మెప్మా) పర్యవేక్షణలో 13 పురపాలికలు, 2 నగరపాలికలు ఉండగా 19,240 స్వశక్తి సంఘాలు, 45 మంది ఉద్యోగులు, 701 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) ఉన్నారు. ఆ సంఘాలకు రుణాలతోపాటు ఉపాధికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాయి. జిల్లా స్థాయిలో మెప్మాకు పీడీ, పురపాలికల్లో కమిషనర్ పర్యవేక్షణలో ఉద్యోగులు పని చేస్తున్నారు. సెర్ఫ్, మెప్మాలను విలీనం చేయడంతోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి పరిధిలోకి మెప్మా కలిపి కొత్త శాఖగా పేరు పెడుతారని చెబుతున్నారు.
యథావిధిగా కార్యకలాపాలు..
పురపాలక, గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటిలాగే కార్యకలాపాలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఒకే శాఖ పరిధిలో ఉద్యోగులంతా పని చేసేలా విధివిధానాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలు, ఓటర్ల జాబితాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన, ఇతర సంక్షేమ పథకాలతోపాటు మహిళా సంఘాల పనితీరును యథావిధిగా ఉండనున్నట్లుగా తెలుస్తుంది. విలీనం కానున్న సెర్ఫ్, మెప్మా సంస్థలు కాకుండా ఒకే చోట ఒకే అధికారి పర్యవేక్షణలో ఉద్యోగులంతా పని చేయనున్నట్లు మెప్మా ఉద్యోగులు అంటున్నారు. మొత్తానికి విలీన అంశాన్ని ఉద్యోగులు స్వాగతిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మహిళలకు బీమాతో ధీమా:
మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ప్రమాదవశాత్తు సభ్యురాలు మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షల బీమా పరిహారం చెల్లిస్తారు. అలాగే సభ్యురాలికి బ్యాంకులో ఉన్న రూ.2 లక్షల లోపు రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే సభ్యురాలి కుటుంబానికి రూ.12 లక్షల సాయం అందుతుంది.
ప్రమాదంలో గాయపడి వంద శాతం వైకల్యం కలిగితే రూ.10 లక్షలు, యాభై శాతం వైకల్యం బారిన పడితే రూ.5 లక్షలు మంజూరవుతుంది. ఇక సాధారణ మరణం పొందిన సభ్యురాలి కుటుంబానికి రూ.2 లక్షల లోపు బ్యాంకు రుణాన్ని మాత్రమే ప్రభుత్వం భరిస్తుంది కాని బీమా వర్తించదు. ఇప్పటివరకు సభ్యురాలు మృతి చెందితే కొన్ని చోట్ల బాధిత కుటుంబాలు బకాయిలు చెల్లిస్తున్నాయి. మరికొన్ని చోట్ల చేతులెత్తేయడంతో సహచర సభ్యులే చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టాక బ్యాంకు రుణం చెల్లింపు, బీమా పరిహారం మంజూరుతో బాధిత కుటుంబాలకు భరోసా దక్కనుంది.
రిపోర్టింగ్: కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్