Best Web Hosting Provider In India 2024

తిరుపతి: తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటానని, ఏ నష్టం జరగదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుందని, మీ ఇంటికి వలంటీర్, సచివాలయ సిబ్బంది వచ్చి మంచి చేస్తారని తెలిపారు. ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసిందని, మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే అన్నారు. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారని తెలిపారు. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తిరుపతి జిల్లాల్లో పర్యటించారు. మిఛాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెంలో స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బాధితులతో సమావేశమై వారి కష్టాలు, నష్టాలను తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని సీఎం వైయస్ జగన్ హామీ ఇచ్చారు.
సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే..
- ఈ ప్రాంతంలో నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షాలు జిల్లాలో మొత్తం యావరేజ్తో పోల్చితే ఈ నాలుగు రోజుల్లోనే వర్షాలు కురిశాయి. 40 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలతో మనందరికీ వచ్చిన కష్టం, నష్టం వర్ణణాతీతం. ఈ రెండు కూడా ఎవరూ చెప్పలేనంతగా ఉన్నాయి.
- దాదాపుగా ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులు పెట్టాం. దాదాపుగా 8300 మందిని ఈ క్యాంపులకు తరలించాము. దాదాపుగా 60 వేల మంది పై చిలుకు ప్రజలకు రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఉంది. అవి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఎవరికీ ఎక్కడా ఏ నష్టం జరిగినా కూడా ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏ ఒక్కరికీ కూడా నష్టం జరుగదు. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. మనందరి మధ్య వలంటీర్, సచివాలయ వ్యవస్థ ఉంది. దీనితో పాటు ప్రతి ఇంటికీ కూడా రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీ ఇళ్లలోకి వచ్చిన నీటిని తొలగించడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఏదైనా నష్టం జరిగితే ఈ రూ.2,500లతో కొద్దోగొప్పో ఉపసమనం జరుగుతుంది. మరో నాలుగు రోజుల్లో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తారు.
- పంట నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకుంటాను. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. పంటలు వేసి నష్టపోయిన అందరికీ కూడా 80 శాతం సబ్సిడీతో విత్తనాలు కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తారు.
- కరెంటు సరఫరా పునరుద్ధరణ పనులు చాలా వేగంగా చేశారు.కరెంటు ఇప్పటికే రీ స్టోర్ అయ్యింది. ఎక్కడైనా కరెంటు అందకపోతే సచివాలయాల సిబ్బంది నుంచి డిటైల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. మరో మూడు రోజుల్లో ఇవన్నీ సెట్ అవుతాయి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.
- స్వర్ణముఖిలో జరిగిన నష్టాన్ని కూడా పరిశీలించాను. ఇటువంటి పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారం కోసం హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.30 కోట్లతో చేపట్టేందుకు నిధులు కూడా మంజూరు చేస్తున్నాను.
- జిల్లాలో జరిగిన నష్టాలను నేను చూశాను. కొన్ని చోట్ల వాటర్ ట్యాంకులు, రోడ్లు దెబ్బతిన్నాయి. టెంపరరీగా వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు వెంటనే శ్రీకారం చుడుతున్నాం. రూ.32 కోట్లతో యుద్ధప్రాతిపాదికన పనులు మొదలుపెడుతున్నాం.
- అందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీది అన్నది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ కూడా మంచే జరుగుతుంది తప్ప చెడు జరుగదు. ఏ ఒక్కరికీ కూడా రావాల్సింది రాని పరిస్థితి ఉంటే జగనన్నకు చెబుదాం 1902 నంబర్కు ఫోన్ చేయండి. నా ఆఫీస్కే ఫోన్ వస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో పూర్తిగా అందరికీ మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది. మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.