Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 1 ఎపిసోడ్: తాతయ్యకు అడ్డుపడిన కావ్య- యామిని ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్- రుద్రాణికి నిజం తెలియకుండా ప్లాన్!
బ్రహ్మముడి మే 1 ఎపిసోడ్లో రాజ్ను కల్యాణ్ చూస్తాడు. ఆ విషయం ఇంట్లో చెబుతాడు. రాజ్ దగ్గరికి వెళ్లకుండా సీతారామయ్యను అడ్డుకుంటుంది కావ్య. రాజ్ బతికి ఉన్నాడన్న విషయం రుద్రాణికి తెలియొద్దని ఇంటిల్లిపాది ప్లాన్ చేసుకుంటారు. ధాన్యలక్ష్మీకి వార్నింగ్ కూడా ఇస్తారు. యామిని ఇంట్లోంచి రాజ్ వెళ్లిపోతాడు.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజ్ గతం మర్చిపోయినా కూడా తనకోసం ఎలా పరితపించాడో యామినికి చెబుతుంది కావ్య. రాజ్ తన పుట్టింట్లో అడుగుపెట్టాడు. నువ్ అల్లిన కట్టు కథ కథలా మిగిలిపోయింది. ఆయన మనసు ఎప్పుడో మారిపోయింది. ఇక ఆయనకు గతం గుర్తురావడమే అని కావ్య అంటుంది.
ముహుర్తం కూడా పెట్టేశాం
అది నేను జరగనివ్వను. త్వరలోనే మా పెళ్లి జరగబొతుంది. పెళ్లి పత్రికలు ప్రింట్ అయిపోయాయి. ముహుర్తం కూడా పెట్టేశాం. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా మా పెళ్లికి రాజ్ కూడా ఒప్పుకున్నాడు. ముహుర్తం గురించి అడిగితే నా ఇష్టమే తన ఇష్టం అన్నాడు. నీ కల కలగానే మిగిలిపోతుంది. నీ మెడలో ఉన్న తాళి తెగిపోతుంది అని యామిని అంటుంది.
సరే, నువ్ అనుకున్నదే నిజమనుకుందాం. నీతో పెళ్లికి ఒప్పుకున్నాడే అనుకుందాం. మరి నీతో ఉండాల్సిన మనిషి నాతో రెస్టారెంట్లో కాఫీ తాగడానికి ఎందుకు వచ్చారు. నీతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన వ్యక్తి నాకు చీర ఎందుకు తీసుకొచ్చారు. నాకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని నాకు మాట ఎందుకు ఇస్తారు అని కావ్య అంటుంది.
అంటే, నువ్ అడిగితే నాతో పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడనుకుంటున్నావా అని యామిని అంటుంది. అలా అయితే ఎప్పుడో చేసేదాన్ని. నాకు అది ఇష్టం లేదు. ఆయన మనసులో ఇంకా నేనే ఉన్నాను. అదే ఆయన గతం గుర్తుచేస్తుంది. తిరిగి నా దగ్గరికి వచ్చేలా చేస్తుంది అని కావ్య అంటుంది. అలా జరగదు. రాజ్ నా మెడలో మూడు ముళ్లు వేయడం జరుగుతుంది. నీ ముందే భార్యాభర్తల కాపురం చేస్తుంటే అది నువ్ చూసి తట్టుకోలేక కుళ్లి కుళ్లి ఏడవడం జరుగుతుంది అని యామిని అంటుంది.
శత్రువులా మారావ్
దాంతో కావ్య నవ్వుతుంది. నవ్వుకో.. బాగా నవ్వుకో.. ఇదే నువ్ బాగా నవ్వే ఆఖరి క్షణం. రాజ్తో నాకు పెళ్లి అయ్యాక నవ్వు ఉండదు. నాకు నీ మీద కోపం లేదు. నా రాజ్ను నాకు దూరం చేయాలని నువ్ ప్లాన్ చేయాలని మొదలుపెట్టావో ఆ క్షణం నుంచే నాకు శత్రువుగా మారిపోయావ్ అని యామిని అంటే.. నాకు మాత్రం నువ్ జోకర్లా మారిపోయావ్ అనిపిస్తుంది అని కావ్య అంటుంది.
జోకర్ ఎవరు అవుతారో, రాజ్కు పెళ్లాం ఎవరవుతారో త్వరలోనే నీకూ తెలుస్తుంది అని యామిని అంటుంది. చూద్దాం అని కావ్య అంటే.. చూసుకుందాం అని యామిని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. మరోవైపు కల్యాణ్ బైక్పై వస్తుంటే ఎదురుగా కారు వస్తుంది. కారు తప్పించబోయే కల్యాణ్ పక్కకు పడిపోతాడు. కారులోనుంచి రాజ్ ఏంటీ తమ్ముడు చూసుకోవాలి కదా. బ్రేక్ వేయకపోతే యాక్సిడెంట్ అయ్యేది అని అంటాడు.
రాజ్ను చూడని కల్యాణ్ సారీ బ్రో తప్పు నాదే చూసుకోలేదు అని అంటాడు. ఇట్స్ ఓకే. టేక్ కేర్ అని రాజ్ అంటాడు. థ్యాంక్యూ బ్రో అని రాజ్ను కల్యాణ్ చూస్తాడు. అన్నయ్య అంటూ పిలుస్తాడు. కానీ, రాజ్ వెళ్లిపోతాడు. అన్నయ్య అంటూ కల్యాణ్ పరుగెత్తుతాడు. తర్వాత బైక్ మీద ఫాలో అవుతాడు. ఇంతలో ట్రాఫిక్ కానిస్టెబుల్ ఆపుతాడు. అన్ని చూస్తున్నాను రాంగ్ రూట్లో వచ్చి కారు యాక్సిడెంట్ చేయబోయావ్ అని అంటాడు.
జైలులో ఉంటావ్
మా అన్నయ్య వెళ్లిపోతున్నాడు తప్పుకోండి అని కల్యాణ్ అంటాడు. ఇవన్నీ చాలా చూశాం. డాక్యుమెంట్స్ అన్ని చూపించు అని కానిస్టెబుల్ అంటాడు. అయినా కల్యాణ్ బైక్ స్టార్ట్ చేస్తాడు. డాక్యుమెంట్స్ అడిగిన బైక్ స్టార్ట్ చేసి పారిపోయావ్ అని చెబితే నీ బైక్ పోలీస్ స్టేషన్లో ఉంటే నువ్ జైలులో ఉంటావ్ అని ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటాడు. చనిపోయాడనుకున్న మా అన్నయ్య తిరిగి కనిపించాడు. కానీ, మీవల్ల వెళ్లిపోయాడు అని కల్యాణ్ అంటాడు.
అన్నయ్యే కదా మళ్లీ వస్తాడు. పేపర్స్ చూపించు అని అతను అంటే.. వెంటనే కల్యాణ్ డాక్యుమెంట్స్ ఇస్తాడు. అవి చూసి ఈ బైక్ టూటౌన్ ఎస్సై అపూర్వ గారిదా. ఈ విషయం ముందే చెబితే వదిలేసేవాడిని కదా అని కానిస్టేబుల్ అంటాడు. అవన్నీ ఇప్పుడెందుకులే మా అన్నయ్య వెళ్లిపోయాక అని కల్యాణ్ అంటాడు. దాంతో కానిస్టేబుల్ సారీ చెబుతాడు.
అన్నయ్య వెళ్లిపోయాడు కానీ బతికే ఉన్నాడు. ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పాలి అనుకున్న కల్యాణ్ కాసేపటికి అన్నయ్య నన్ను చూశాడుగా ఎందుకు ఆగలేదు. పరాయి వాడిలా వెళ్లిపోయాడు. అది తెలుసుకోవాలి అని కల్యాణ్ అనుకుంటాడు. తర్వాత ఇంట్లోకి వచ్చి అందరిని పిలిచి జరిగింది సంతోషంగా చెబుతాడు. కావ్య వదినా చెబుతుంటే మనం నమ్మలేదు కదా. రాజ్ అన్నయ్య బతికే ఉన్నాడు తాతయ్య అని కల్యాణ్ చెబుతాడు.
ఒట్టేసిన కల్యాణ్
అన్నయ్య బతికే ఉన్నాడు. నేను నా కళ్లతో చూశాను అని కల్యాణ్ చెబుతాడు. చూస్తే ఇంటికి తీసుకురాలేదే అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో కావ్య వస్తుంది. అన్నయ్యను నేను చూశాను అని కల్యాణ్ అంటాడు. దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీ నమ్మరు. అయ్యో అన్నయ్యను చూశాను నీ మీద ఒట్టు అని ధాన్యలక్ష్మీ మీద ఒట్టేస్తాడు కల్యాణ్.
లేనివాళ్ల గురించి ఒట్టేస్తే నేను ఒప్పుకోను అని ధాన్యలక్ష్మీ అంటాడు. ఆ దేవుడు మీద ఒట్టు అని కల్యాణ్ చెబుతాడు. అన్నయ్య ఎందుకో నన్ను గుర్తుపట్టలేదు. నన్ను చూసి కూడా ఎవరో తెలియనట్లు వెళ్లిపోయాడు. అదే నాకు అర్థం కావట్లేదు అని కల్యాణ్ అంటాడు. అంటే, రాజ్ గతం మర్చిపోయాడా అని స్వప్న అంటుంది. లేదా ఇంట్లో జరిగే గొడవల నుంచి తప్పించుకోడానికి గతం మర్చిపోయినట్లు నటిస్తున్నాడా అని ధాన్యలక్ష్మీ అంటుంది.
దాంతో అపర్ణ వారిస్తుంది. నోర్మూయ్. నా కొడుకు అలాంటివాడు కాదంటుంది. కల్యాణ్ చెప్పేది నిజమే. రాజ్ బతికే ఉన్నాడు. నేను కూడా చూశాను. కానీ వాడు నన్నే గుర్తు పట్టలేదు అని నిజం చెబుతుంది అపర్ణ. అసలు ఏమైందో చెప్పమని ఇందిరాదేవి అంటే.. రాజ్ గతం మర్చిపోవడం గురించి, గుడిలో కలిసింది అంతా చెబుతుంది అపర్ణ. ఇంత జరుగుతుంటే ఈ విషయం మాకెందుకు చెప్పలేదని ఇందిరాదేవి అంటుంది.
అడ్డుపడిన కావ్య
ఎందుకు మౌనంగా ఉన్నావ్ అని సుభాష్ను నిలదీస్తుంది ఇందిరాదేవి. నాకెందుకు చెప్పలేదు. చెప్పాలనిపించలేదా అని ప్రకాశం అంటాడు. మిమ్మల్ని పరాయి వాళ్లను చేశారా అక్క అని అపర్ణని, నీకేమైందే అని అప్పుని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇప్పుడు మనం వెళ్లి రాజ్ను తీసుకొద్దాం అని సీతారామయ్య అంటాడు. ఇప్పుడు కరెక్ట్ కాదు అని సీతారామయ్యను అడ్డుకుంటుంది కావ్య.
మాట్లాడకుండా ఎలా ఉండమంటావ్ అని ఇందిరాదేవి అంటుంది. ఇప్పుడు ఆయన ఒక నకిలి కుటుంబం మధ్య ఉన్నాడు. ఆయనకు గతం గుర్తు లేదు. మైండ్కు ప్రెషర్ ఇవ్వొద్దని డాక్టర్ చెప్పాడు. ఇప్పుడు ఆయన్ను కలిసి మాట్లాడితే ఏది నిజమో తేల్చుకోలేక ఎక్కువ ఆలోచిస్తారు. అది ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఆయన పరిస్థితి తెలిసే ఎవరికి తెలియకుండా దాస్తూ వచ్చాను అని కావ్య అంటుంది.
కానీ, ఇలా ఎన్ని రోజులు అని సుభాష్ అంటాడు. నేను మీ దగ్గర నెల రోజులు టైమ్ అడిగింది అందుకే. ఆయన్ను మాములు మనిషిని చేసి తీసుకొస్తాను. ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడాలి అని కావ్య అంటుంది. అది మనం అనుకుంటే సరిపోతుంది. ఆ రుద్రాణి, రాహుల్ చెవిలో పడకుండా చూసుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది. వాళ్లకు తెలిస్తే కచ్చితంగా ఏదో గొడవ చేస్తారు అని స్వప్న అంటుంది.
ధాన్యలక్ష్మీకి వార్నింగ్
ధాన్యలక్ష్మీ నువ్ కూడా ఏదైనా నోరు జారావో. కావ్య చేస్తుంది వృథా అవుతుంది అని ఇందిరాదేవి అంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రుద్రాణికి తెలియకూడదు అని ప్రకాశం అంటే.. మాకెందుకు తెలియకూడదు అని రుద్రాణి, రాహుల్ ఎంట్రీ ఇస్తారు. దాంతో ఇంటిల్లిపాది షాక్ అవుతారు. ఏదో నాకు చెప్పకూడదంటూ ధాన్యలక్ష్మీకి వార్నింగ్ ఇస్తున్నట్లున్నారు. వీళ్లు గూడుపుటాని చేసి నా పతనానికి దారులు తవ్వుతున్నట్లు ఉన్నారు అని రుద్రాణి అంటుంది.
ఏం సీక్రెట్ చెబుతున్నారు చెప్పు అని ధాన్యలక్ష్మీని అడిగితే.. ఏముంది రాజ్ ఎలాగు లేడుగా నీ కొడుకుని కంపెనీ బాధ్యతలు తీసుకోమంటుంటే వాడికి ఇష్టం లేనిది నేను చెప్పను చెబుతున్నాను అని అబద్ధం చెబుతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత కాఫీ కావాలని సుభాష్, ప్రకాశం టాపిక్ డైవర్ట్ చేస్తారు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటారు.
మనం రాకముందే ఇక్కడ చాలా పెద్ద సీనే జరిగింది. కానీ, మనకు వీళ్లు చెప్పట్లేదు అని రుద్రాణి, రాహుల్ డౌట్ పడతారు. దుగ్గిరాల నిలయం ఆనంద నిలయం అయినట్లు అందరి మొహాల్లో ఆనందం కనిపిస్తోందిరా. అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. మరోవైపు కావ్య గురించి ఆలోచిస్తాడు రాజ్. ఇంతలో యామిని వచ్చి మన పెళ్లి పత్రికలు అని బ్యాగ్ చూపిస్తుంది.
రోజంతా గడిపి
కట్ చేస్తే రాజ్ లగేజ్ పట్టుకుని ఉంటాడు. ఏంటీ బ్యాగ్ అని యామిని అడుగుతుంది. మా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీ ఫంక్షన్ ఉంది. దానికి వెళ్తున్నాను అని యామిని ఇంట్లోంచి రాజ్ వెళ్లిపోతాడు. కావ్యకు కాల్ చేసి ఇప్పుడు రిసార్ట్కు తీసుకెళ్లి రోజంతా గడిపి నీ గతం గుర్తు చేద్దామనుకుంటున్నావా. నీ ప్లాన్ను అడ్డుకుని రాజ్ను నాతో తెచ్చుకుంటాను అని ఛాలెంజ్ చేస్తుంది యామిని.
ఎదురుచూస్తుంటాను అని కావ్య అంటుంది. తర్వాత నా ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోడానికి వెళ్తున్న అని రుద్రాణితో చెబుతుంది కావ్య. దాంతో అది ఎక్కడికి వెళ్తుందో కనుక్కోమని రాహుల్కు చెబుతుంది రుద్రాణి. రాజ్, కావ్య కలిసి కారులో వెళ్తుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.