





Best Web Hosting Provider In India 2024

మతం మారితే ఎస్సీ హోదా వర్తించదు.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేసిన ఏపీ హైకోర్టు
మతం మారిన వారికి షెడ్యూల్ కులాల గుర్తింపు వర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. కులం పేరుతో దూషించిన వారిపై నమోదు చేసిన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. గుంటూరు జిల్లా చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై ఈ తీర్పు వెలువరించింది.
కులం పేరుతో పాస్టర్ను దూషించిన కేసులో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫిర్యాదుదారుడు స్వయంగా క్రైస్తవ మతంలోకి మారినట్టు స్పష్టం చేసినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదని, మతం మారిన రోజే.. ఎస్సీ హోదా కోల్పోతారని హైకోర్టు స్పష్టం చేసింది.
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలం కొత్తపాలం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదుపై ఆదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డి సహా ఆరుగురిపై చందోలు పోలీసులు 2021 జనవరి 26న ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై రామిరెడ్డి, ఇతర నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో పిటిషనర్ల తరఫున న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని ఆచరించే వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందని, ఇతర మతాలను స్వీకరించిన వారికి ఎస్సీ హోదా వర్తించదని హైకోర్టులో పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడు పాస్టర్గా పనిచేస్తున్నట్టు తన ఫిర్యాదులోనే పేర్కొన్నారని వివరించారు. పిర్యాదుదారుడు పదేళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని ఈ విషయాన్ని అతను ఫిర్యాదులోనే పేర్కొన్నాడని క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని వివరించారు.
షెడ్యూల్డ్ కులాల ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతా లను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారని, కులవ్యవస్థ క్రైస్తవ మతంలో ఉండదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని పేర్కొన్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయాలని ధర్మసనాన్ని కోరారు.
పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదిదారుడు ఎస్సీ అని తహసీల్దార్ ద్రువపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేడని నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పు వెలువరించారు.
ఎస్సీలు క్రైస్తవంలోకి మారిన తక్షణమే ఆ హోదా కోల్పోతారని, వారు ఎస్పీ,ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద రక్షణ పొందలేరని హైకోర్టు స్పష్టం చేసింది. క్రైస్తవ మతానికి కుల వ్యవస్ధ దూరమని తీర్పులో పేర్కొంది. చర్చిలో పాస్టర్గా సేవలు అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై పోలీసులు ఎస్సీఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టింది.
ఫిర్యాదుదారుడు తాను క్రైస్తవ మతంలోకి మారి గత పదేళ్లుగా తాను పాస్టర్గా సేవలు అందిస్తున్నట్లు స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేసింది. అధికారులు కుల ధ్రువీకరణపత్రం ఇచ్చారనే కారణం చూపి మతం మారిన ఫిర్యాదుదారు ఆ చట్టం కింద రక్షణ పొందలేరని తెలిపింది. ఫిర్యాదుదారు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో వారిపై ఉన్న కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఇటీవల తీర్పు ఇచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్