





Best Web Hosting Provider In India 2024

బీజేపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. వారందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే జనాభా లెక్కలతో పాటే ఈ కులగణన చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే.. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తోంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేశామని గుర్తు చేశారు. చట్టం కన్నా ముందు ఎంపెరికల్ డేటా ప్రామాణికమైన సమాచారాన్ని సేకరించి.. సబ్ కమిటీ వేసినట్టు వివరించారు. ఆ తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకొని.. శాసనసభ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.
గవర్నర్కు ధన్యవాదాలు..
‘బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అనుమతి కొరకు కేంద్రానికి పంపే సందర్భంలో.. గవర్నర్ న్యాయపరమైన అంశాలను పరిశీలించి రాష్ట్రపతికి పంపడం జరిగింది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ బీసీ నాయకులం గవర్నర్ను కలిసి ధన్యవాదాలు చెప్పాం. తెలంగాణలో తీసుకున్న కులగణన మోడల్ అద్భుతంగా ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 2025 జన గణనలో.. కులగణన చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం’ అని మంత్రి పొన్నం వివరించారు.
ఆత్మవిమర్శ చేసుకోవాలి..
‘దీనిపై విమర్శిస్తున్నవారు.. ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వ్యతిరేకించిన వారు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఆలోచనను కేంద్రం మార్గదర్శకత్వంగా తీసుకుంటే జీర్ణించుకోలేక విమర్శిస్తున్నారు. దేశ వ్యాప్తంగా బలహీన వర్గాల సంక్షేమానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. గవర్నర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్టాన్ని అమలు చేయడానికి ఆమోదించాలి. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’ అని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
చర్చనీయాంశంగా బీసీ బిల్లు..
కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే బీసీల కోసం చేపట్టిన రిజర్వేషన్ల బిల్లు మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ బిల్లుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ.. శాసనసభలో బిల్లులు ఆమోదించింది.
సవాలుగా మారే అవకాశం..
రాష్ట్రంలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్నందున.. ఈ రిజర్వేషన్లు సామాజిక న్యాయం చేకూరుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో.. ఈ బిల్లు అమలు సవాలుగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలుపుకుంటే మొత్తం రిజర్వేషన్ శాతం 67కు చేరుకుంటుంది.
రాష్ట్రపతి ఆమోదం కోసం..
ఈ బిల్లును ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని.. రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొందరు న్యాయ నిపుణులు ఈ బిల్లు న్యాయస్థానంలో నిలబడటం కష్టమని అభిప్రాయపడుతున్నారు. సరైన గణాంకాలు లేకుండా, హడావుడిగా బిల్లు రూపొందించారని విమర్శిస్తున్నారు. ఈ బిల్లును పరిశీలించిన గవర్నర్.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.
సంబంధిత కథనం
టాపిక్