Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ – సరికొత్తగా ‘వాట్సాప్ ఫీడ్బ్యాక్’ విధానం, ఇలా చేసేయండి…!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త సేవలను ప్రవేశపెట్టింది. భక్తులు వారి అభిప్రాయాలను తెలిపేలా వాట్సాప్ ఫీడ్ బ్యాక్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెల్లడించింది.
భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కొత్తగా ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియజేయవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. కేవలం సందేశం మాత్రమే కాకుండా వీడియోను కూడా పంపే అవకాశాన్ని కల్పించింది.
ఫీడ్బ్యాక్ విధానం – ముఖ్య వివరాలు
- తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది.
- ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చు.
- సేవా ప్రమాణాన్ని తెలిపేలా ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగాలేదు గా రేట్ చేయాల్సి ఉంటుంది.
- భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు.
- అభిప్రాయం సమర్పించిన వెంటనే, “మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు” అనే ధృవీకరణ సందేశం వస్తుంది.
- భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుంది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. మే 4వ తేదీన స్థానిక దర్శన కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా ఈ టోకెన్లను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.
తిరుపతి స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలో టోకెన్లు అందజేస్తారు. ఇక తిరుమల స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఇస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుండి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ తెలిపింది.
ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.