Best Web Hosting Provider In India 2024

డీఎస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
జూన్ 6వ తేదీ నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యా శాఖల ఉన్నతాధికారులతో.. ఉండవల్లి నివాసంలో లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
డీఎస్సీ పరీక్షలు నిర్వహించే కేంద్రాలతోపాటు.. టీసీఎస్, ఆయాన్ సెంటర్లలో కంప్యూటర్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని.. మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు. డీఎస్సీ కాల్ సెంటర్లలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. టెట్ పరీక్షల్లో అర్హతలే డీఎస్సీలో కూడా ఉంటాయన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తిమేరకు సర్టిఫికెట్ల అప్ లోడింగ్ కు ఆప్షన్ సౌకర్యం కల్పించామని చెప్పారు. వెరిఫికేషన్ నాటికి సర్టిఫికెట్లు సమర్పిస్తే.. సరిపోతుందన్నారు.
మెరుగైన ఫలితాలు సాధించాలి..
ఇటీవల విడుదల చేసిన పదోతరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి లోకేష్ సమీక్షించారు. ‘ఇక నుంచి అకడమిక్స్ పై దృష్టిసారించాలి. వచ్చేఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేయాలి. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని.. వన్ క్లాస్ వన్ టీచర్ ప్రాతిపదికన జీఓ 117కి ప్రత్నామ్నాయం రూపొందించాం. పదోతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన ఉత్తమ విద్యార్థులను.. షైనింగ్ స్టార్స్ పేరిట సన్మానానించాలి. టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ కు లోబడి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి. విద్యాశాఖలోని అన్నిరకాల సిబ్బంది బదిలీలను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలి’ అని లోకేష్ ఆదేశించారు.
విదేశీ విద్య.. మళ్లీ ప్రారంభం..
‘గత ప్రభుత్వం అటకెక్కించిన అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు, లెక్చరర్ల కొరత, పనితీరు మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. డిగ్రీ కాలేజిల్లో త్రీమేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల్లో మెరుగైన విధానం అమలుకు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్యూఎస్ 100లో 2 ఏపీ విశ్వవిద్యాలయాలు ఉండేలా ప్రమాణాల మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. విద్యార్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా విద్యనభ్యసించేందుకు వీలుగా.. ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును ప్రతి క్వార్టర్ కు విడుదల చేస్తాం’ అని లోకేష్ చెప్పారు.
కలలకు రెక్కలు..
‘ఉన్నత విద్యనభ్యసించే వారికోసం.. కలలకు రెక్కలు పథకాన్ని ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 205 ప్రభుత్వ గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి.. నిరుద్యోగ యువత, ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలి’ అని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల బదిలీలకు మంత్రి లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.