





Best Web Hosting Provider In India 2024

మిస్ వరల్డ్ అందగత్తెలతో తెలంగాణ గ్రామీణ అందాలకు ప్రచారం, ఏ ప్రాంతాలకు ఈ సుందరీమణులు వస్తారంటే..
తెలంగాణాలో పర్యాటక ప్రదేశాలు ఎక్కువే ఉన్నాయి. కానీ అందరూ వచ్చేది మాత్రం హైదరాబాద్ నగరానికే. తెలంగాణ రాష్ట్ర పల్లె ప్రాంతాలకు పర్యాటకులను పెంచాలన్న ఉద్దేశంలో మిస్ వరల్డ్ సుందరీమణుల చేత ప్రచారం చేయించనుంది తెలంగాణా ప్రభుత్వం.
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదికైంది. ఈ కార్యక్రమం వల్ల ప్రపంచ దృష్టిని తెలంగాణ రాష్ట్రం ఆకర్షించనుంది. ఇదే అవకాశంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణా గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ గ్రామీణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవంను ప్రపంచానికి పరిచయం చేసేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్ను అద్భుత అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేందు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది.
మిస్ వరల్డ్ ఈవెంట్ కు 120 దేశాలకు చెందిన అందగత్తెలు పోటీపడబోతున్నారు. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అందుకే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖంగా ప్రమోట్ చేసేందుక ,విదేశీ పర్యాటకులను ఆకర్షించుకునేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
మిస్ వరల్డ్ పోటీలలో భాగంగా వరంగల్ , హన్మకొండ , ములుగు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను షోకేజ్ కు చేసేందుకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు సందర్శించనున్నారు.
మే 12న
మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈనెల 12న ఆధ్యాత్మిక టూరిజానికి చిహ్నంగా ఉన్న నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని, బౌద్ధ థీమ్ పార్కును మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్నారు.
మే 14న
ఈ నెల 14 న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్ లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్ ను సందర్శిస్తారు. ఇదే రోజు వరంగల్ జిల్లాలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన పేరిణి నృత్యం ను తిలకిస్తారు.
మే 15న
ఈ నెల15న మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని చూస్తారు.
మే 16న
ఈ నెల 16న మహబూబ్ నగర్ జిల్లాలోనిలోని పిల్లలమర్రి వృక్షాన్ని సందర్శిస్తారు.
మే 21న
మే నెల 21న శిల్పారామంలో తెలంగాణ కళాకారులచే నిర్వహించే ఆర్ట్స్ , క్రాఫ్ట్స్ వర్క్ షాప్కు హాజరవుతారు.
మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శించనున్న గ్రామీణ పర్యాటక ప్రదేశాల ప్రత్యేకతలు ఇవే
బుద్ధవనం
తెలంగాణలోని నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ధవనం , బౌద్ధ థీమ్ పార్క్.. బౌద్ధ సంస్కృతికి ప్రధాన ఆకర్షణ. ఇది బుద్ధుని విగ్రహాలు, స్తూపాలు, ధ్యాన మండపాలతో కూడిన ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆధ్యాత్మిక శాంతి, జ్ఞానోదయం కోసం ప్రయత్నిస్తున్నవారికి ఇది ఒక ఆదర్శ స్థలం. బౌద్ధమతం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ స్థలాన్ని తప్పక సందర్శించాలి.
వేయి స్థంభాల గుడి
హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్న వేయి స్థంభాల గుడి, కాకతీయ రాజవంశం శిల్పకళా వైభవానికి నిదర్శనం. రుద్రదేవ మహారాజు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ గుడి శివుడు, విష్ణువు, సూర్యదేవుడికి అంకితమైంది. ప్రత్యేకమైన త్రికూటాకార నిర్మాణంతో, నక్షత్ర ఆకారపు వేదికపై నిలిచి ఉంది. గర్భగుడి చుట్టూ 1000కు పైగా సున్నితంగా చెక్కబడిన స్థంభాలు ఉన్నాయి. ప్రధాన ఆకర్షణ ఏకశిలా నంది విగ్రహం.
వరంగల్ కోట
కాకతీయ రాజవంశం వాస్తుశిల్ప వైభవానికి అద్భుతమైన నిదర్శనమే వరంగల్ కోట. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోట కాకతీయుల రాజధానిగా పనిచేసింది. స్వయంభూ దేవాలయంలోని శివలింగం భక్తులకు పవిత్ర తీర్థస్థలం. కోటలోని ధాన్యాగారాలు, సరుకు గిడ్డంగులు ఆ కాలపు సంపదను తెలియజేస్తున్నాయి. తెలంగాణ సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఈ కోట చిహ్నం.
రామప్ప గుడి
ములుగు జిల్లా పాలంపేట వద్ద ఉన్న రామప్ప గుడి కాకతీయ సామ్రాజ్యం వాస్తు శిల్ప సంపదకు ప్రతీక. ఇది 13వ శతాబ్దంలో గణపతి దేవ మహారాజు పాలనలో నిర్మించారు. ఈ శివాలయానికి ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు, సుందరమైన నృత్య ముద్రలు, పురాణ కథలను చిత్రించే శిల్పాకృతులు అద్భుతంగా ఉంటాయి. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించిన ఈ దేవాలయం చుట్టూ సహజ సుందరమైన చెరువు, హరిత వనాలు ఉన్నాయి.
పోచంపల్లి చీరలు
పోచంపల్లి (పుట్టపాక) ప్రాంతంలో నేతన్న మేధస్సుతో తయారయ్యే పోచంపల్లి ఇక్కత్ చీరలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 200 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నేతకళలో నూలు లేదా పట్టు దారాలను డైలో ముందుగా రంగు వేసి, సంక్లిష్టమైన జ్యామితీయ నమూనాలతో నేస్తారు. ఇకత్ టెక్నిక్లో రంగు వేసిన దారాలు సరిగ్గా మ్యాచ్ అయ్యేలా నేతగాళ్లు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తారు. ప్రతి చీర తయారీకి 10-20 రోజులు వరకు సమయం పడుతుంది. 2005లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన ఈ చీరలు సిటీ ఆఫ్ క్రాఫ్ట్ గా గుర్తింపు పొందాయి.
పిల్లల మర్రి వృక్షం
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న పిల్లల మర్రి వృక్షం ఒక అద్భుతం. ఫికస్ బెంగాలెన్సిస్ జాతికి చెందిన ఈ ప్రాచీన వృక్షం సుమారు 700 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. 3 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ వృక్షం వేర్లు భూమిపైకి వేలాడుతూ, సహజ స్తంభాల్లా నిలుస్తాయి. స్థానికులకు ఇది సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సహజ వేదికగా పనిచేస్తుంది. పక్షులు, కీటకాలు, చిన్న జంతువుల ఆవాసానికి ఆశ్రయం ఇచ్చి జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది.
యాదగిరిగుట్ట దేవాలయం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది పంచముఖ నరసింహ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గుట్ట పైకి 120 మెట్లు ఎక్కి చేరుకునే ఈ దేవస్థానం చరిత్ర చాళుక్యుల కాలానికి చెందినది. 2016లో ప్రభుత్వం దీన్ని రాజస్థాన్ మార్బుల్, బంగారు పూతలతో అలకరించారు. ప్రధాన గర్భగుడిలో స్వయంభూ శిలారూపంలో నరసింహుడు, లక్ష్మీదేవి కనిపిస్తారు.
– స్పెషల్ కమిషనర్, రాష్ట్ర సమాచార , పౌర సంబంధాల శాఖ
టాపిక్