జమ్మూ టార్గెట్‌గా పాకిస్థాన్ దాడులు.. తిప్పికొడుతున్న భారత్

Best Web Hosting Provider In India 2024


జమ్మూ టార్గెట్‌గా పాకిస్థాన్ దాడులు.. తిప్పికొడుతున్న భారత్

Anand Sai HT Telugu

పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా గురువారం రాత్రిపూట జమ్మూ లక్ష్యంగా దాడులు చేసింది. వీటిని భారత్ తిప్పికొట్టింది.

ప్రతీకాత్మక చిత్రం

గురువారం రాత్రి జమ్మూ నగర విమానాశ్రయం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. వెంటనే భారత్ దీటుగా స్పందించింది. పాకిస్థాన్ చేస్తున్న దాడులను తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్‌ రెండో రోజు కూడా కొనసాగుతోంది.

జమ్మూ ప్రాంతాన్ని పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుని మందుగుండు సామగ్రితో దాడి చేసింది పాక్. దీనికి భారత వైమానిక రక్షణ దళాలు దీటుగా స్పందించడతో జమ్మూలో ఉద్రిక్తతలు పెరిగాయి. కిష్త్వార్ జిల్లాలో పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు అయింది. ఆ ప్రాంతం అంతటా సైరన్‌లు మోగుతున్నాయి. జమ్మూ ప్రస్తుతం సైరెన్లు, రక్షణ దళాలతో ఆందోళన నడుమ ఉంది.

బ్లాక్అవుట్

పాకిస్థాన్ తన దాడిలో జమ్మూ నగర విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉండటంతో జమ్మూ ప్రాంతంలో పూర్తిగా బ్లాక్‌అవుట్‌ను విధించారు. ఆ ప్రాంతమంతా సైరన్‌లు మోగాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కూడా పూర్తిగా బ్లాక్‌అవుట్ అమలు చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూడా సైరన్ మోగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలను పాకిస్థాన్ టార్గెట్ చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.

గురువారం రాత్రి భారత్ ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థతో ఈ దాడులను గగనతలంలోనే అడ్డుకుంటోంది. భారత భూభాగం వైపు కదులుతున్న వాటిని ఈ వ్యవస్థలు విజయవంతంగా అడ్డగించి ఆపేశాయని ఏఎన్ఐ పేర్కొంది.

హైఅలర్ట్

అఖ్నూర్, కిష్త్వార్, సాంబా సెక్టార్‌లో అధికారులు పూర్తిగా విద్యుత్ నిలిపివేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్స్ మోగుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరించింది. అయితే జమ్మూతోపాటుగా పఠాన్‌కోట్, ఉధమ్‌పుర్‌లలో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సాంబా జిల్లాలోనూపాక్ రేంజర్లు కాల్పులు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలు ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చిని నిఘావర్గాలు అంచనా వేశాయి. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన దాడిలో 26 మంది పౌరులు మరణించిన తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది భారత్. ఆ తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link