Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 10: ఇక ఆట మరోలా ఉంటుంది: కార్తీక్.. వాళ్లను కూడా చంపేస్తారన్న దాసు.. స్పృహలోకి దీప
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 10: దీపే అసలైన వారసురాలు అనే నిజం ఇప్పట్లో ఎవరికీ చెప్పవద్దని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నను కట్టడి చేస్తానని చెబుతాడు. ఇక నుంచి ఆట ఇంకోలా ఉంటుందని చెబుతాడు. దీప స్పృహలోకి వస్తుంది. ఎస్ఐ ప్రశ్నిస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 సీరియల్ నేటి (మే 10, 2025) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. దీపే అసలైన వారసురాలు అని చెప్పేస్తానని, నేను బతికి ఉంటే ప్రమాదమని జ్యోత్స్న నన్ను చంపాలనుకుందని కార్తీక్తో దాసు అంటాడు. తనను తలపై కొట్టిందని చెబుతాడు. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నేను తన కన్న తండ్రినని తెలిసి చంపాలనుకుందుంటే అసలైన వారసురాలిని వదిలిపెడుతుందా అని దాసు చెబుతాడు. దీంతో కార్తీక్ కంగారు పడతాడు. దీపే అసలైన వారసురాలు అని జ్యోత్స్న నిశ్చితార్థం రోజు చెప్పాలనుకున్నా ఎవరు చెప్పనివ్వలేదని దాసు అంటాడు. ఆతర్వాత ఏమైందో గుర్తు లేదని చెబుతాడు.
నమ్మలేకపోతున్నా..
“నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నా.. దీప పెద్ద మామయ్య కూతురు ఏంటి.. జ్యోత్స్న నీ కూతురు ఏంటి?” అని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలుసు కదా అని అడుగుతాడు. లేదు.. దీపే అసలైన వారసురాలు అనే విషయం నాకు, జ్యోత్స్నకు మాత్రమే తెలుసంటాడు దాసు.
దశరథ్కు బుల్లెట్ తగిలేందుకు కూడా..
దీపే అసలైన వారసురాలు అని తెలిస్తే మా అమ్మకు, జ్యోత్స్నకు నష్టమే, కాబట్టి వాళ్లు దీపను చంపే ప్రయత్నం చేయవచ్చు అల్లుడు అని కార్తీక్తో దాసు అంటాడు. లేకపోతే మా అమ్మకు తెలియకుండా జ్యోత్స్న ఒక్కటే ఈ పని చేసి ఉండొచ్చని అంచనా వేస్తాడు. ఎందుకంటే జ్యోత్స్నను మా అమ్మ అలా తయారు చేసిందని, మనుషుల ప్రాణాలు తనకు లెక్కలేదని అంటాడు. కన్న తండ్రినైన నన్నే చంపాలనుకుంది.. నా అనుమానం ఏంటంటే దశరథ్ అన్నయ్యకు బుల్లెట్ తగిలేందుకు కూడా నా కూతురే (జ్యోత్స్న) కారణం అయి ఉండాలని దాసు చెబుతాడు. దీపను చంపాలనుకున్నది నా కూతురే అయి ఉండాలని అనుమానిస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా మామూలుగా ఉండే ఎవరికి ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియదని అంటాడు.
నిజం చెప్పేస్తానన్న దాసు.. వదన్న కార్తీక్
ఎవరికీ ఏమీ కాకుండా ఉండాలంటే నిజం చెప్పేయాలని, తన తల్లికి, జ్యోత్స్నకు గట్టిగా బుద్ది చెప్పాలని దాసు అంటాడు. దీపే నీ అసలైన కూతురు అని దశరథ్కు చెప్పేస్తానని చెప్పేస్తానని చెబుతాడు. వెళదాం పదా అని అంటాడు. చెప్పగానే వాళ్లు నమ్ముతారని అనుకుంటున్నావా. ఈ మధ్యే నా మీద వారికి నమ్మకం పోయింది. నీపై ముందు నుంచి లేదు. నువ్వు చెప్పగానే జ్యోత్స్న ఒప్పుకుంటుందా. పారిజాతం అమ్మమ్మ నిజాలు చెబుతుందా” అని కార్తీక్ అంటాడు. నేను ఒప్పిస్తానని అరుస్తాడు దాసు.
నాకు కూడా మతిస్థిమితం లేదనుకుంటారు
ఆ ఇంటి వారసురాలి విషయాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత చెబితే నమ్ముతారా.. ఆధారాలు అడుగుతారని కార్తీక్ అంటాడు. నమ్మిస్తానని దాసు అంటాడు. ఎలా నిరూపిస్తావని కార్తీక్ అడుగుతాడు. నిజం చెప్పకపోతే కూతురు అని కూడా చూడనని దాసు ఆవేశంగా అంటాడు. అసలు నిన్ను గుమ్మంలోకే రానివ్వనని కార్తీక్ వారిస్తాడు. జరిగింది విన్న నాకే ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది, ఇన్నాళ్లు ఈ విషయాన్ని పారిజాతం అమ్మమ్మ మ్యానేజ్ చేసిందంటే ఎప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారు అని కార్తీక్ అంటాడు.
మాములాగానే దీప అంటే వాళ్లకు పడదు.. అలాంటిది దీపే అసలైన వారసురాలు అంటే నీకు మతిస్థిమితం లేదని అందరూ నమ్ముతున్నారు.. ఇప్పుడు నాకు కూడా మతిస్థిమితం లేదని అనుకుంటారని కార్తీక్ అంటాడు.
ఆ ముగ్గురిని కూడా చంపేస్తారు
నిజాలు చెప్పకపోతే హత్యాయత్నాలు ఇంతటితో ఆగవని దాసు అంటాడు. “ఆస్తి కోసం దశరథ్ అన్నయ్యను, సుమిత్ర వదినను, శివన్నారాయణను కూడా చంపేస్తారు” అని జ్యోత్స్న, పారిజాతం గురించి దాసు అంటాడు. దీప విషయం వేరే వాళ్లకు తెలిసి భయపడితేనే అలా జరగుతుందని, ఈ నిజం ఇంకా బయట ఎవరికి తెలుసు అని కార్తీక్ అడుగుతాడు. ఇక ఎవరికీ తెలియదని అంటాడు దాసు.
జ్యోత్స్నకు ఏదో ఆలోచన ఉంది
గతం గుర్తు లేదు కాబట్టి జ్యోత్స్న నీ జోలికి రాదు.. దీపను జ్యోత్స్న కాపాడింది కాబట్టి వేరే ఏదో ఆలోచన ఉన్నట్టుందని కార్తీక్ అనుమానిస్తాడు. దీపను జైలుకు పంపించేందుకు దశరథ్ను జ్యోత్స్న షూట్ చేయించి ఉంటే.. ఆ షూట్ చేసిన వ్యక్తి ఎవరై ఉంటారని అంటాడు. తండ్రిని షూట్ చేయమని ఎవరితో చెప్పలేదు, ఆ వ్యక్తి కూడా జ్యోత్స్న గతం తెలిసిన వారు అయి ఉంటారని కార్తీక్ ఆలోచిస్తాడు.
డేంజర్లో తాత కుటుంబం
నువ్వు చెప్పే దాని ప్రకారం చూస్తే తాత కుటుంబం డేంజర్లో ఉందని కార్తీక్ అంటాడు. తన గురించి నిజం బయటపడకుండా ఏమైనా చేసే పారిజాతం.. మనుషులను చంపేందుకు కూడా వెనుకాడని జ్యోత్స్న ఇద్దరూ ప్రమాదమని చెబుతాడు. దశరథ్ మామయ్య పారిజాతం సొంత కొడుకు కాడు.. సుమిత్ర అత్తయ్య జ్యోత్స్నకు సొంత తల్లి కాదు.. ఎవరు ఎలా పోతే వాళ్లకు ఏంటి.. అందుకే వాళ్లు డేంజర్లో ఉన్నావని కార్తీక్ అంటాడు.
అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావ్
వాళ్లే కాదు నువ్వు కూడా డేంజర్లో ఉన్నావని కార్తీక్తో దాసు అంటాడు. జ్యోత్స్న ఇచ్చిన అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావని అడుగుతాడు. సంతకం పెట్టకపోతే దీప బతికి ఉండేకాదని కార్తీక్ అంటాడు. జ్యోత్స్నను లాగిపెట్టి కొట్టాల్సిందని దాసు కోపంగా అంటాడు. నీకంటే రెట్టింపు కోపం నాకు ఉందని, కానీ దీపను చావు అంచున నిలబెట్టి బేరాలు ఆడిందని, నేను ఏం చేయాలని కార్తీక్ అంటాడు.
మంచి పనే చేశాననిపిస్తోంది
కాలం ఎప్పుడైనా మంచి అవకాశం ఇస్తుందని, అప్పుడు బాధపెట్టినా ఏదో ఛాన్స్ ఇస్తుందని అంటాడు. ఇప్పటి వరకు సంతకం చెప్పినందుకు కాస్త బాధపడ్డానని.. అయితే మంచి పని చేశానని ఇప్పుడు అనిపిస్తోందని కార్తీక్ అంటాడు. ఎలా అల్లుడు అని దాసు ప్రశ్నిస్తాడు. సంతకం పెట్టి ఇరుక్కుంది నేను కాదు మామయ్య.. జ్యోత్స్న అని కార్తీక్ అంటాడు. ఏ షరతులు రాసుకుంటుందో తెలియదు.. కానీ ఏది రాసినా మంచికే అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఎప్పుడూ మన కళ్ల ముందే ఉంటుంది.. ఎలాంటిదో తెలిసింది కాబట్టి అందరినీ కాపాడుకోవచ్చు అంటాడు.
డీఎన్ఏ టెస్టు కూడా నమ్మరు
నిజం చెప్పేస్తే అయిపోతుంది కదా అని దాసు అంటాడు. కార్తీక్ వద్దంటాడు. సుమిత్ర అత్తయ్య, నీ మీద, దశరథ్, దీప, శౌర్య మీద అటాక్ జరిగిందని.. నిన్ను కొట్టింది జ్యోత్స్న.. మిగిలిన వాటి సంగతేంటి అని కార్తీక్ అంటాడు. ఇవన్నీ పారిజాతం అమ్మమ్మకు తెలిసే జరుగుతున్నాయా.. జ్యోత్స్న సొంతంగా చేస్తోందా.. ఇవి మనం తెలుసుకోవాలని కార్తీక్ అంటాడు. సాక్ష్యాలు ఉన్నాయ్.. ఆధారాలు కావాలని చెబుతాడు. డీఎన్ఏ టెస్టు చేయించినా.. దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు అని నమ్మరని కార్తీక్ అంటాడు. వాళ్లకు ఆ విషయం నచ్చదని, రిపోర్టుల ద్వారా నిజం నిరూపించేందుకు ప్రయత్నించినా ఎంతకు కొన్నావని శివన్నారాయణ అనుమానిస్తాడని కార్తీక్ అంటాడు.
గతం గుర్తురానట్టే ఉండాలి
మరి ఇప్పుడేం చేద్దాం అల్లుడు అని దాసు అడుగుతాడు. వాళ్లు ఇంత కాలం నటించారు.. ఇప్పుడు మనం నటిద్దామని కార్తీక్ అంటాడు. నువ్వు గతం గుర్తు రానట్టే ఉండు అని దాసుతో అంటాడు. వాళ్ల ప్రతీ కదలికను గుర్తిద్దామని, దీప మీద ఆ ఇంటి మనుషులకు ఉన్న కోపాన్ని తగ్గించాలని చెబుతాడు. నువ్వు చెప్పింది విని నాకే షాకింగ్గా ఉందని, వాళ్లు ఎలా నమ్ముతారని అంటాడు. ఇది మన మధ్యే ఉండాలని, ఎప్పుడు బయటపెట్టాలో చెబుతానని అంటాడు. సరే అంటాడు దాసు. నా కూతురు చెడ్డదైనా నాకు ఇష్టమని దాసు చెబుతాడు.
ఇప్పటి నుంచి ఆట మరోలా..
“ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలో.. అలాంటి న్యాయం చేద్దాం. ఈ కథను ముగించే కార్యక్రమం ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో నేను చెబుతా.నువ్వు నాకు నిజం చెప్పడం మన మంచికే” అని కార్తీక్ అంటాడు. ఇప్పటి వరకు ఆట ఒకలా ఉంది.. ఇప్పటి నుంచి మరోలా ఉంటుందని కార్తీక్ అంటాడు. నువ్వే చూస్తావ్ కదా అని చెబుతాడు.
శౌర్యకు అబద్ధం చెప్పిన అనసూయ
మా అమ్మ, నాన్న ఎక్కడ అని శౌర్య అంటుంది. పూజ, గుడి అని నన్ను ఇంట్లో వదిలేసి వెళ్లారని అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక కాంచన, అనసూయ ఒకరిని ఒకరు చూసుకుంటారు. పనిపై ఊరెళ్లారని కాంచన అంటే.. శౌర్య నమ్మదు. తాను నిజం చెబుతానని అనసూయ అంటుంది. దీప ఆసుపత్రిలో ఉన్నట్టు అనసూయ చెప్పేస్తుందేమోనని కాంచన కంగారు పడుతుంది. కార్తీక్ స్నేహితుడి భార్యకు ఆరోగ్యం బాగోలేదని, వాళ్లతో పాటు మీ అమ్మానాన్న తోడుగా వెళ్లారని అనసూయ అబద్ధ చెబుతుంది.
స్పృహలోకి వచ్చిన దీప
దీప స్పృహలోకి వచ్చేందుకు టైమ్ పడుతుందేమోనని ఎస్ఐతో కార్తీక్ అంటాడు. అయితే, దీప స్పృహలోకి వచ్చిందని ఇంతలోనే కార్తీక్కు చెబుతుంది నర్స్. ముందు మీరు మాట్లాడండి, తర్వాత కేసు గురించి నేను మాట్లాడతానని ఎస్ఐ అంటాడు. దీపను బాధగా చూస్తాడు కార్తీక్. సుమిత్ర, దశరథ్ల అసలైన కూతురు దీపే అని దాసు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. దీప అని పిలుస్తాడు. దీప కళ్లు తెరుస్తుంది.
నువ్వు నా మరదలివంట
దీప కళ్లు తెరిచాక తనలో తాను మాట్లాడుకుంటాడు కార్తీక్. “ఇప్పుడే కొన్ని నిజాలు తెలిశాయి.. నువ్వు దశరథ్, సుమిత్ర కూతురివంట.. నా మదరదలివంట.. ఇవన్నీ తెలియకుండానే నిన్ను కాపాడడానికి నేను అగ్రిమెంట్పై సంతకాలు పెట్టాను” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న ఏం చెప్పినా చేస్తాననేలా అగ్రిమెంట్పై సంతకం పెట్టిన విషయాన్ని తలుచుకుంటాడు. మంచంపై ఉన్న దీపను తదేకంగా చూస్తాడు.
కల కాదు.. నిజమే
ఇది కల కాదు దీపా.. నిజమే, నువ్వు కళ్లు తెలిచావని కార్తీక్ అంటాడు. నువ్వు క్షేమంగా ఉంటావని చెబుతాడు. శౌర్య అని దీప అంటే.. ఇంటి దగ్గరే ఉందని, తనకు ఈ విషయం తెలియదని అంటాడు. ఇప్పుడు నీకు నొప్పి తెలుస్తుందా అని కార్తీక్ అడుగుతాడు. లేదని దీప అంటే.. మత్తు ఇంజెక్షన్ వల్ల అనుకుంటా అని అంటాడు. బాగా రెస్ట్ తీసుకోవాలని దీపతో డాక్టర్ చెబుతుంది.
చంపే అవసరం ఎవరికి ఉంటుంది!
దీపతో మాట్లాడాలని ఎస్ఐను పిలుస్తాడు కార్తీక్. మిమ్మల్ని పొడిచిన వ్యక్తి ఆడా..మగా అని దీపను ఎస్ఐ పశ్నిస్తాడు. మగే అని దీప చెబుతుంది. అతడిని చూశారా అని ఎస్ఐ అడిగితే.. ముఖానికి ముసుగు వేసుకున్నాడని దీప బదులిస్తుంది. మీకు ఎవరిపై అయినా అనుమానం ఉందా అని ఎస్ఐ అడుగుతాడు. లేదండి అని దీప చెబుతుంది. ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా గొడవ పడ్డారా అని ఎస్ఐ అడిగితే దీప ఆలోచిస్తుంది. జ్యోత్స్న కాకుండా ఎవరైనా ఉన్నారా అని కార్తీక్ అంటాడు. బెయిల్పై బయటికి వచ్చిన మనిషిని చంపే అవసరం ఎవరికి ఉందని ఎస్ఐ అంటాడు. దీప మళ్లీ మత్తుగా కళ్లు మూస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 10) ఎపిసోడ్ ముగిసింది.