ఎడారిలో పచ్చని పొదరిల్లు! రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూకు వెళ్లొద్దాం రండి

Best Web Hosting Provider In India 2024

ఎడారిలో పచ్చని పొదరిల్లు! రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ మౌంట్ అబూకు వెళ్లొద్దాం రండి

Ramya Sri Marka HT Telugu

రాజస్థాన్ అంటే ఎడారి దృశ్యాలే గుర్తుకొస్తున్నాయా? అయితే మీకో సర్ప్రైజ్! అక్కడ ఒక పచ్చని హిల్ స్టేషన్ ఉంది. అదే మౌంట్ అబూ. వేడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారికి, ప్రకృతి ప్రేమికులకి ఇదొక అద్భుతమైన ప్రదేశం.

మౌంట్ అబూ పక్కనున్న సరస్సు (shutterstock)

ఎడారి అనగానే ఇసుక నేలలే కనిపిస్తున్నాయా? అయితే మీ ఊహకు భిన్నంగా, రాజస్థాన్‌లో ఒక అద్భుతమైన ప్రదేశం మీకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవైపు ఎడారి ప్రత్యేకమైన అందం, మరోవైపు పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అదే రాజస్థాన్‌లోని ఏకైక హిల్ స్టేషన్ – మౌంట్ అబూ. ఈ అందమైన ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఎడారి, పచ్చదనం ఒకే చోట కలగలిసిన ఈ అద్భుత ప్రపంచానికి వెళ్లాలని ఎగ్జైటింగ్‌గా ఉన్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

మౌంట్ అబూ ఎలా చేరుకోవాలి

మౌంట్ అబూ ఢిల్లీ నుండి దాదాపు 750 కిలోమీటర్ల దూరంలో ఉండే పచ్చని ప్రాంతం. అక్కడికి చేరుకోవడానికి ఢిల్లీ నుంచి దాదాపు 12-13 గంటలు పడుతుంది. మీరు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే, ఇది మంచి అనుభవం ఎదురవుతుంది. మౌంట్ అబూకు వెళ్లడానికి అనేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాలనుకునే వారు కాచిగూడ నుంచి, సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు సార్లు రైలు సర్వీసు ఉంటుంది. విమానంలో వెళ్లాలంటే మీరు ఉదయ్‌పూర్‌కు వెళ్లాలి. అక్కడి నుండి స్థానిక టాక్సీలో మౌంట్ అబూకి చేరుకోవచ్చు. రాజస్థాన్‌లోని ఈ చిన్న హిల్ స్టేషన్‌తో దాదాపు అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంటుంది. వాస్తవానికి పిల్లలతో వెళ్లడానికి కూడా ఇదొక మంచి గమ్యస్థానం.

ఒకప్పుడు చౌహాన్ రాజ్యానికి చెందిన ప్రాంతమిది. అప్పట్లో రాజపుత్ర రాజులకు వేసవి విడిదిగా ఉండేదట. ఇక్కడ ఉండే అచల్‌గఢ్ కోట శిథిలాలు గత వైభవాన్ని తెలియజేస్తాయి. ఇక్కడి ఆహారం, సంస్కృతి రాజస్థాని, గుజరాతీ, జైన సంప్రదాయాల కలయికగా ఉంటుంది.

మౌంట్ అబూలో సందర్శించదగిన ప్రదేశాలు

మౌంట్ అబూలో సందర్శించడానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అలాగే కొండలు, పచ్చదనం, కాస్త దూరంలో ఎడారి అందాలు కూడా చూడవచ్చు.

పిల్లలకు చరిత్ర తెలుసుకునే అవకాశం

పిల్లలతో రాజస్థాన్ పర్యటనను ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే, వారు భారతదేశ చరిత్ర గొప్పదనం, రాజపుత్రుల గురించి తెలుసుకుంటారు. గొప్ప కోటలను చూడటం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. మౌంట్ అబూలో ఉన్న అచల్‌గఢ్ కోట కూడా చారిత్రాత్మకమైనది.

దిల్వారా ఆలయం

కోటలాగే జైన మతస్థుల ఆరాధన ప్రదేశమైన దిల్వారా ఆలయం కూడా చారిత్రాత్మకమైనది. 11 – 13 శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ పాలరాతి ఆలయం జైనులకు ప్రసిద్ధ ఆలయం. దీంతో పాటుగా అర్బుదా దేవి ఆలయం, అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం వంటి అనేక హిందూ దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

నక్కీ సరస్సు

కొండలతో చుట్టుముట్టబడిన నక్కీ సరస్సు అందమైన దృశ్యాలను అందిస్తుంది. ఇక్కడ బోటింగ్ చేయవచ్చు. పిల్లలతో పడవ ప్రయాణం చేయడానికి కూడా ఉత్తమమైనది.

సూర్యాస్తమయం ప్రదేశం

సూర్యాస్తమయం ప్రదేశం కొండలలో అత్యంత అందమైన ప్రదేశం. మౌంట్ అబూ వన్యప్రాణుల అభయారణ్యంలో వివిధ రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి.

ఎత్తైన ప్రదేశం

మౌంట్ ఆబులో ఎత్తైన ప్రదేశం గురు శిఖర్. ఇక్కడ నుండి ఆలయాలతో పాటు అందమైన దృశ్యాలను చూడవచ్చు. గురు శిఖర్ నుండి చుట్టుపక్కల దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడ నుండి మీరు కొండలు, సరస్సు, సూర్యాస్తమయాన్ని ఒకేసారి చూడవచ్చు.

నగర జీవితానికి దూరంగా, మౌంట్ అబూ ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. బ్రహ్మ కుమారీస్ విశ్వవిద్యాలయం ఇక్కడ ఆధ్యాత్మికతను ప్రేరేపిస్తుంది. మౌంట్ అబూ చరిత్ర, పురాణాలు, మతం, ప్రకృతి అందం, ప్రశాంతమైన వాతావరణం కలగలిసిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024