ఎనీటైమ్ మందు.. తిరుపతిలో ఉదయం 6 గంటలలోపే తెరుచుకుంటున్న వైన్స్.. ఇలా తయారయ్యారేంట్రా బాబూ!

Best Web Hosting Provider In India 2024

ఎనీటైమ్ మందు.. తిరుపతిలో ఉదయం 6 గంటలలోపే తెరుచుకుంటున్న వైన్స్.. ఇలా తయారయ్యారేంట్రా బాబూ!

Basani Shiva Kumar HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu

ఏటీఎం అంటే.. మనం ఎనీటైమ్ మనీ అనుకుంటాం. కానీ.. తిరుపతిలో మాత్రం ఎనీటైమ్ మందు. అవును.. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల వెళ్లడానికి తిరుపతి వస్తారు. రైళ్లు, బస్సుల్లో వివిధ సమయాల్లో ఈ నగరానికి చేరుకుంటారు. భక్తులు రాగానే.. ముందు వారికి వినపడే మాట ఏటీఎం. దీని సంగతి ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఉదయం 6 గంటల లోపే తెరిచిన వైన్స్

నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతి నగరం.. మద్యం మత్తులో జోగుతోంది. తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేశారు. వైసీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి.. ఉదయం 6 గంటల లోపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

అడుగుపెట్టగానే..

భక్తులు తిరుపతిలో అడుగుపెట్టగానే మద్యం బాటిల్లు ప్రత్యక్షమవుతున్నాయి. గుడులు, బడులు తెరవకముందే, వైన్ షాపులు తెరుస్తున్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుంచి బడికి వెళ్లాలి అంటే.. కనీసం రెండు మూడు మద్యం దుకాణాలు దాటాల్సిన పరిస్థితి ఉందని నగరవాసులు చెబుతున్నారు. మద్యం దుకాణాలు తలనొప్పిగా మారిందని అంటున్నారు. కొందరు జేబులు నింపుకోవడానికి విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేశారని.. తిరుపతి వాసులు చెబుతున్నారు.

ఏం జరిగింది..

ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో.. తిరుపతి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలోకి వచ్చారు. అప్పటికే ఆ ప్రాంతంలో స్టార్ వైన్స్ ఓపెన్ చేశారు. కొందరు మద్యం సేవిస్తూ కనిపించారు. దీన్ని గమనించిన అభినయ్.. వైన్స్ నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వైన్స్ ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలని ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు తెరవాల్సి షాపును.. ఇప్పుడే ఎందుకు ఓపెన్ చేశారని నిలదీశారు. భూమన అభినయ్ రెడ్డి ప్రశ్నలకు వైన్స్ నిర్వాహకులు సమాధానం చెప్పలేదు. నీళ్లు నమిలారు.

నిబంధనలు ఏంటి..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఉదయం 10 గంటలకు వైన్స్ తెరవాలి. రాత్రి 10 గంటలకు మూసేయాలి. కానీ.. తిరుపతిలో చాలాచోట్ల వైన్ షాపులు 24 గంటలూ తెరిచే ఉంటున్నాయి. అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అన్నా ఏటీఎం ఉంది రండి..

తిరుపతి నగరానికి ట్రైన్లు, బస్సుల్లో.. వివిధ సమయాల్లో భక్తులు వస్తుంటారు. రాత్రి 10 దాటిన తర్వాత వచ్చిన భక్తుల దగ్గరకు కొందరు వస్తున్నారు. ‘అన్నా ఏటీఎం తెరిచే ఉంది రండి’ అంటూ పిలుస్తున్నారు. గతంలో రూమ్‌లు, వాహనాలు కావాలా అడిగేవారని.. ఇప్పుడు మందు ఉంది రమ్మని పిలుస్తున్నారని.. భక్తులు చెబుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందోననే చర్చ జరుగుతోంది. ఇటీవల కొందరు మద్యం సేవించి కొండపైకి వెళ్లిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

TirupatiLiquorTirumalaTrending ApAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024