రాజ్యాంగమే సర్వోన్నతమైనది.. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలి : సీజేఐ జస్టిస్ గవాయ్

Best Web Hosting Provider In India 2024


రాజ్యాంగమే సర్వోన్నతమైనది.. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలి : సీజేఐ జస్టిస్ గవాయ్

Anand Sai HT Telugu

రాజ్యాంగమే సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థలన్నీ కలిసి పని చేయాలని వ్యాఖ్యానించారు.

సీజేఐ జస్టిస్ గవాయ్ (PTI)

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ రాజ్యాంగం ప్రాముఖ్యతపై మాట్లాడారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ కంటే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని చెప్పారు. మూలస్తంభాలు కలిసి పనిచేయాలని ఉద్ఘాటించారు. 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గోవా ఆధ్వర్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం, రాష్ట్ర న్యాయవాదుల సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశం బలపడటమే కాకుండా సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందని సీజేఐ పేర్కొన్నారు.

న్యాయవ్యవస్థ గానీ, కార్యనిర్వాహక వ్యవస్థ, పార్లమెంట్ గానీ సర్వోన్నతమైనవి కావని భారత రాజ్యాంగమే సర్వోన్నతమైనదని అన్నారు. మూడు అవయవాలు రాజ్యాంగం ప్రకారమే పనిచేయాల్సి ఉందన్నారు. దేశ మౌలిక నిర్మాణం బలంగా ఉందని, రాజ్యాంగంలోని మూడు స్తంభాలు ఒకటేనని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అన్ని అవయవాలు ఒకదానికొకటి తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ వెలువరించిన 50 ముఖ్యమైన తీర్పుల ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

మహారాష్ట్ర పర్యటనలో తనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు కమిషనర్ గైర్హాజరు కావడంపై జస్టిస్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘నేను అక్కడికి వెళ్లినప్పుడు చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై పోలీస్ కమిషనర్ అక్కడ లేరు. ఒకవేళ వారు రావడానికి ఇష్టపడకపోతే, మొదటిసారి ఇక్కడకు వచ్చినప్పుడు (ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత) అలా చేయడం సముచితమేనా అని వారు ఆలోచించి ఉండాల్సింది.’ అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించే అంశమని అన్నారు. ప్రోటోకాల్ పాటించాలని తాను పట్టుబట్టడం లేదని సీజేఐ చెప్పారు.

‘ఒక సంస్థ లేదా సంస్థ అధిపతి మొదటిసారి ఒక రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు, ప్రత్యేకించి అతను అదే రాష్ట్రానికి చెందినప్పుడు, అతనితో వ్యవహరించిన విధానం సరైనదా కాదా అని స్వయంగా ఆలోచించాలి.’ అని జస్టిస్ గవాయ్ అన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link