




Best Web Hosting Provider In India 2024

ఏపీ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలం..రేపు డీఈఓ కార్యాలయాల ముట్టడి
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల వర్గీకరణ, ఉపాధ్యాయుల బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో బుధవారం ఉమ్మడి జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. మరోవైపు మంగళవారం కూడా ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొనసాగనున్నాయి.
ఏపీలో పాఠశాలల వర్గీకరణపై ఉపాధ్యాయ సంఘాల ఆందోళన కొనసాగుతోంది. ప్రభుత్వ తీరుపై ఉపాధ్యాయ సంఘాలు అభయంతరం వ్యక్తం్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 9 క్యాటగిరీలుగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
పాఠశాలల హేతుబద్దీకరణ, ఉపాధ్యాయుల క్రమబద్దీకరణపై ప్రభుత్వ ప్రతిపాదనల్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలతో విద్యా వ్యవస్థ బలహీనం అవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి చెందిన తొమ్మిది ఉపా ధ్యాయ గుర్తింపు సంఘాల నేతలతో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోద యోగ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది.
సోమవారం ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు ఫలించక పోవడంతో మంగళవారం ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగు తుందని ఐక్యవేదిక నేతలు ప్రకటించారు. విద్యారంగంలో ప్రతిపాదిత సంస్కరణలలను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు.
ఉపాధ్యాయులు, పాఠశాలలకు సంబంధించిన 19 డిమాండ్లను విద్యాశాఖ ముందు ఉంచితే కొన్ని అంశాలపై మాత్రమే సానుకూల స్పందన వచ్చిందని.. కీలక అంశమైన ఇంగ్లిష్ భాషకు సమానంగా తెలుగు, ఇతర మైనర్ మీడియంలను కొనసాగించి సిబ్బందిని కొనసాగించాలన్న డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు వివరించారు. ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తిని అమలుచేయాలని.. 45 మంది విద్యార్థులు దాటాక రెండో సెక్షన్ ఏర్పాటు చేయడంపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్జీటీల నియామకంపై….
మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించడం సరికాదని ఎస్జీటీలను నియమించాలని, ఫౌండేషన్ స్కూళ్లల్లో 1:20 నిష్పత్తిలో ఉపాధ్యాయుల కేటాయింపునకు చర్చల్లో ఆమోదం లభించిందని తెలిపారు.
స్టడీ లీవ్లో ఉండి రెండు నెలల్లో సర్వీసులో చేరే ఉపాధ్యాయుల పోస్టులను బదిలీల్లో ఖాళీగా చూపమని చెప్పడం.. 1,400 మంది ఎస్జీటీలకు మాత్రమే పదోన్నతులిచ్చి హెచ్ఎంలుగా నియమిస్తామనడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలిపాయి.
ఉపాధ్యాయ బదిలీల చట్టం ఇప్పటికే రావడంతో అందులో మార్పులు సాధ్యంకాదని అధికారులు తేల్చి చెప్పడంతో ఉపాధ్యాయులు ఈనెల 21న డీఈఓ కార్యాలయల ముట్టడిస్తామని ప్రకటించారు. ఉపాధ్యాయ బదిలీలు, పాఠశాలలు పునర్వ్యవస్థీకరణపై ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి.
ఉదయం సుమారు 11 గంటలకు మొదలైన చర్చలు రాత్రి 7.30 వరకు కొనసాగాయి. డిమాండ్లలో కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించగా.. మరికొన్నింటిపై స్పష్టత రాలేదని ఐక్యవేదిక ప్రకటనలో తెలిపింది.
పోస్టుల హేతుబద్దీకరణపై ఆందోళన
పాఠశాల విద్యలో పోస్టుల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా వాటిలో కొన్నింటిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉపాధ్యా య సంఘాల యకులు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండడంతో అధికారులు వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. మంగళవారం మరోసారి భేటీ కానున్నాయి.
ఉన్నత పాఠశాలల్లో 45 మందికి ఒక సెక్షన్ ఏర్పాటు చేయాలని, ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయ పోస్టులన్నీ ఎస్జీటీలకే కేటాయించాలని సంఘాల నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 45మంది విద్యార్థుల పరిమితిపై ఆలోచిస్తామని అధికారులు హామీ ఇవ్వగా ఉపాధ్యాయులు మాత్రం ఈ ఏడాది నుంచి 45 మందికి ఒక సెక్షన్ ఇవ్వాలంటున్నాయి.
ఇంగ్లీష్ మీడియంపై పీటముడి
ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో కొత్తగా 6,088 ప్రధానోపాధ్యాయ పోస్టులు రానున్నాయి. వీటిల్లో 1,400 వరకు పోస్టులను ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మొత్తం పోస్టులను ఎస్జీటీలతోనే భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంగ్లీష్ మీడియంకు సమాంతరంగా తెలుగు మీడియం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు మీడియం రద్దు చేసి, 1 నుంచి 6 తరగతుల వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవే శపెట్టారు. ఆ తర్వాత ఒక్కో తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఇప్పుడు పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నారు.
దీనిని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. తెలుగు మీడియం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడాల్సి వస్తుంది.రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన కూటమి ప్రభుత్వంలో ఉంది.
సంబంధిత కథనం
టాపిక్