గుడ్ న్యూస్.. థియేటర్ల బంద్ లేనట్లే.. దిగి వచ్చిన ఎగ్జిబిటర్లు

Best Web Hosting Provider In India 2024

గుడ్ న్యూస్.. థియేటర్ల బంద్ లేనట్లే.. దిగి వచ్చిన ఎగ్జిబిటర్లు

Hari Prasad S HT Telugu

తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 1 నుంచి చేయాలనుకున్న థియేటర్ల బంద్ నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టింది. థియేటర్లను తెరిచి ఉంచే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని నిర్ణయించింది.

గుడ్ న్యూస్.. థియేటర్ల బంద్ లేనట్లే.. దిగి వచ్చిన ఎగ్జిబిటర్లు

థియేటర్లు మూతపడటం లేదు. జూన్ 1 తర్వాత కూడా థియేటర్లు తెరిచే ఉండనున్నాయి. తమ సమ్మె నిర్ణయాన్ని తెలుగు ఎగ్జిబిటర్ల సంఘం ప్రస్తుతానికి వాయిదా వేసింది. బుధవారం (మే 21) ఉదయం నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ లో జరిగిన చర్చలు ఫలించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 తర్వాత కూడా థియేటర్లలో సినిమాలు ఆడనున్నాయి.

ఫలించిన చర్చలు

తెలుగు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ జూన్ 1 నుంచి థియేటర్లను బంద్ చేయాలని గతంలో నిర్ణయించింది. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బుధవారం (మే 21) ఉదయం 11 గంటల నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చర్చలు జరిగాయి. దీనికి తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.

సాయంత్రం 4 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ల మధ్య మరోసారి చర్చలు జరిగాయి. అయితే ఇటు డిస్ట్రిబ్యూటర్లు, అటు ప్రొడ్యూసర్లలో చాలా మంది థియేటర్ల బంద్ వద్దన్న నిర్ణయానికి వచ్చారు. థియేటర్లను తెరిచి ఉంచే సమస్యలపై పోరాడాలని నిర్ణయించారు.

గతంలో పని చేయని సమ్మెలు

గతంలోనూ క్యూబ్ సమస్యలపై కొన్ని రోజుల పాటు థియేటర్లను మూసేశారు. అంతేకాదు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ల సమస్యపై షూటింగులు నిలిపేశారు. కానీ ఈ రెండింటి వల్ల పెద్దగా ఫలితం రాకపోవడంతో ఇప్పుడు థియేటర్ల సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేశారు. థియేటర్లు రన్ చేస్తూనే సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

ఇప్పటికే పైరసీ, ఐపీఎల్, ఓటీటీ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. మే 30 నుంచి వరుస సినిమాలు ఉండటంతో మరింత ఇబ్బంది అవుతుంది. వాటిలో థగ్ లైఫ్, హరి హర వీరమల్లులాంటి పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. అందువల్ల థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు చెప్పారు. దీంతో వాళ్లు దిగి వచ్చారు.

ఆదాయ పంపిణీ విషయంలో చాలా రోజులుగా ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రెంటల్ విధానంలో ఎగ్జిబిటర్లు సినిమాలను ప్రదర్శిస్తున్నారు. అయితే రెవెన్యూ షేరింగ్ మోడల్ తీసుకురావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024