



Best Web Hosting Provider In India 2024
మహిళపై గ్యాంగ్ రేప్, ఆమె ముఖంపై మూత్ర విసర్జన: బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు
కర్నాటకలోని గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బెంగళూరుకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై సంచలన ఆరోపణలతో కేసు నమోదైంది. తన కార్యాలయంలో తన అనుచరులతో అత్యాచారం చేయించాడని, చివరకు తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది.
40 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెకు వైరస్ ఎక్కించి, ముఖంపై మూత్ర విసర్జన చేసిన ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ మంత్రి మునిరత్నపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఆర్ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ లో పలు సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి.
ఏడాది క్రితం ఘటన
ఫిర్యాదుదారు అయిన ఆ మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన దాదాపు ఏడాది క్రితం 2023 జూన్ 11న మత్తికెరె జేపీ పార్క్ సమీపంలోని మునిరత్న నియోజకవర్గ కార్యాలయంలో చోటు చేసుకుంది. బిజెపి కార్యకర్తగా ఉన్న తనను మునిరత్న, అతని ముగ్గురు సహాయకులు వసంత, చెన్నకేశవ, కమల్ లైంగికంగా వేధించారని ఆ మహిళ పేర్కొంది. తాను ఎదుర్కొంటున్న క్రిమినల్ కేసులను ఎత్తివేయిస్తామని చెప్పి వసంత, కమల్ లు టయోటా ఇన్నోవా కారులో ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక తనను శారీరకంగా హింసించారని, బట్టలు విప్పించారని, ప్రతిఘటిస్తే తన కుమారుడిని చంపేస్తామని బెదిరించారని ఆమె చెప్పారు.
ముఖంపై మూత్ర విసర్జన
ఆ తరువాత, ఎమ్మెల్యే మునిరత్న తన అనుచరులు వసంత, చెన్నకేశవలను తనపై అత్యాచారం చేయాలని ప్రేరేపించాడని, వారు అత్యాచారం చేస్తుంటే అక్కడే ఉండి చూశాడని బాధితురాలు ఆరోపించింది. అనంతరం మునిరత్న తన ముఖంపై మూత్ర విసర్జన చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కాసేపటికి, గుర్తుతెలియని వ్యక్తి మునిరత్నకు వైట్ బాక్స్ ఇచ్చాడని, అందులో నుంచి సిరంజి తీసుకుని గుర్తుతెలియని పదార్థాన్ని తనకు ఇంజెక్ట్ చేశాడని ఆమె వెల్లడించింది. ఈ విషయం బయటకు చెబితే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.
ఆ మహిళపై గతంలో కేసులు
ఫిర్యాదుదారు అయిన ఆ మహిళపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవి మునిరత్న ప్రోద్బలంతో పీణ్య, ఆర్ఎంసీ యార్డు పోలీస్ స్టేషన్లలో నమోదైన తప్పుడు కేసులని ఆ మహిళ చెబుతోంది. ఆ మహిళను గతంలో అరెస్టు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అదే మునిరత్న అనుచరులు మరోసారి తనను సంప్రదించారని, రాజకీయంగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.
వైరస్ తో అనారోగ్యం
కాలక్రమేణా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో వైరస్ ఉనికిని వైద్యులు ధృవీకరించారని ఆమె చెప్పారు. ఇది ఎమ్మెల్యే మునిరత్న ఇచ్చిన అంతుచిక్కని ఇంజెక్షన్ కారణంగానే అని ఆమె భావిస్తున్నారు. ఈ నెల 19న ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు.
ఎమ్మెల్యేపై కేసు
మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న పై పలు తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మునిరత్న రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత బీజేపీ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేశారు. తాజా ఆరోపణలపై ఆయన ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link