ఏపీ సీఎంఓ ప్రక్షాళనపై జోరుగా ప్రచారం… పరస్పరం సహ‍కరించుకుంటున్న అధికారుల భవితవ్యంపై చర్చ..

Best Web Hosting Provider In India 2024

ఏపీ సీఎంఓ ప్రక్షాళనపై జోరుగా ప్రచారం… పరస్పరం సహ‍కరించుకుంటున్న అధికారుల భవితవ్యంపై చర్చ..

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరికొద్ది రోజుల్లో ఏడాది కావొస్తుంది. ఏడాది పాలనలో ప్రభుత్వ పనితీరుపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్‌ అధికారుల తీరుపై విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి.పాలనా వ్యవహారాలకు కేంద్ర స్థానమైన సీఎంఓలో కూడా త్వరలో బదిలీలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్‌ 4తో ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆలిండియా సర్వీస్ అధికారుల పనితీరుపై శాఖల వారీగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో సీఎంఓలో కొందరు పనితీరు లేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో శాఖల వారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలతో పాటు సీఎంఓ ప్రక్షాళన కూడా జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సీఎంఓలో మార్పులపై ఊహాగానాలు..

ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ఒకరిద్దరు అధికారులకు తప్ప మిగిలిన వారికి స్థాన చలనం తప్పదని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం పేషీలో ఇద్దరు అధికారుల హవా నడుస్తోంది. వారిలో ఒకరు వైసీపీ ప్రభుత్వ హయంలో ఢిల్లీలో పనిచేశారు. మరొకరు వైసీపీ బాధిత అధికారిగా ప్రచారం పొందారు.

ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రితో కలిసి చదువుకున్న ఐఏఎస్‌ అధికారితో పాటు, మరో ముఖ్యమైన అధికారి తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

పనితీరుపై ప్రశ్నలు…

సీఎంలో ఉన్న అధికారుల్లో ఒకరు గతంలో ఢిల్లీలో పనిచేశారు. ఢిల్లీ అధికార వర్గాల్లో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆ కోటాలోనే ఆయనకు సీఎంఓలో ప్రాధాన్యత దక్కింది. అయితే ఏడాది కాలంలో రాష్ట్రానికి ఆయన ద్వారా కలిగిన ప్రయోజనం ఏమిటనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. మరో ముఖ్యమైన అధికారికి హిందీపై పెద్దగా పట్టు లేకపోవడం మైనస్‌గా మారింది. దీంతో యువ అధికారితో ఆయనకు దోస్తీ కుదిరింది.ప్రస్తుతం ఒకరికొకరు అండగా ఉన్న ఇద్దరు అధికారులకు మొదట్లో పొసిగేది కాదని ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇద్దరు కలిసి పోయినట్టు తెలుస్తోంది.

అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి

సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి వ్యవహార శైలిపై అధికార పార్టీ నేతల్లో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నాయకుడికి ఆయన తీరుపై పలుమార్లు ఫిర్యాదులు చేశారు.

ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నకీలకమైన మంత్రి తరపున వచ్చే ఆదేశాలను, సూచనలు ఆ అధికారి మొదట్లో ఖాతరు చేసేవారు కాదు. ఈ పరిణామంపై ఆ నాయకుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలియడంతో కొద్ది నెలలుగా ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు సీఎంఓలో కొందరు అధికారులు తమను పట్టించుకోవడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలియడంతో మంత్రితో సన్నిహితంగా ఉండే అధికారి మధ్యవర్తిత్వంతో యువ నాయకుడికి వివరణ ఇచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించే విషయంలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో ఇప్పుడు బదిలీలపై ఉత్కంఠ నెలకొంది.

సానుభూతి అస్త్రంతో దగ్గరై..!

ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ ప్రభుత్వ హయంలో తనను వేధింపులకు గురి చేశారని, పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా వేధించారని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలకు చెప్పుకున్నారు. దీంతో ఆయనకు ముఖ్యమైన స్థానంలో పోస్టింగ్ లభించింది. ఇప్పుడు బదిలీ ప్రచారం జరుగుతుండటంతో మళ్లీ దానిని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వంలో బాధిత అధికారిగా ఆయనకు సానుభూతి లభించింది. ప్రస్తుతం అధికారుల బదిలీ, స్థానచలనాలు తప్పవని తెలియడంతో మళ్లీ వైసీపీ బాధితులమనే అస్త్రాన్ని తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయంలో పోస్టింగ్‌ దక్కక పోవడానికి అనుమతి లేకుండా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్ళడంతో జగన్‌ ప్రభుత్వంలో సీఎంఓ ఆయన స్థానంలో మరొకరిని నియమించారని, దానికే ఆయన పొలిటికల్ కలరింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఐఏఎస్‌లకు వృత్తిపరమైన శిక్షణలో భాగంగా సెలవులు మంజూరు చేస్తే దానిని పొడిగించడంతో మరొకరికి ఆ బాధ్యతలు ఇచ్చారని సచివాలయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

అధికారుల పనితీరుపై చర్చ…

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాగలిగిన అధికారుల అవసరం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న వారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఢిల్లీ స్థాయిలో పనులు చక్కబెట్టే అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం ఆర్థిక శాఖకు సారథ్యం వహిస్తున్న పీయూష్‌ కుమార్‌కు మరో ఏడాదిన్నరలో ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆయన ఎక్కువ కాలం రాష్ట్ర సర్వీసుల్లో కొనసాగే అవకాశాలు లేవు. యగల నేర్పు ఉన్న అధికారుల కొరత తీవ్రంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రధానంగా ఢిల్లీలో పనులు జరగాలంటే ఉత్తరాది అధికారులకు పనులు జరిగినంత సులువుగా తెలుగు అధికారుల హవా నడవదని ప్రధానంగా భాష సమస్యను అధిగమించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శుల్ని మెప్పించగలిగిన అధికారుల లోటు ఉందని ఐఏఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఏపీ అధికారుల వెనుకబడ్డారనే ప్రచారం..

ఢిల్లీలో పనులు చక్కబెట్టగలిగి, రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తెప్పించడంలో ఏపీ క్యాడర్‌ అధికారులు వెనుకబడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన అధికారికి, మరో అధికారి సంప్రదింపుల విషయంలో, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంలో సాయం చేస్తున్నా అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. కీలకమైన పోస్టింగ్‌లో ఉన్న మరో యువ అధికారి పనితీరుపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది కాలంలో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నా ఆయన ప్రభావాన్ని చూపలేకపోయారని చెబుతున్నారు.

కీలక నాయకుడిదే తుది నిర్ణయం..

పోస్టింగ్‌ విషయంలో ప్రభుత్వ అధినేతను ప్రసన్నం చేసుకున్న వారికే ప్రాధాన్యత లభిస్తుండటంతో త్వరలో జరిగే ప్రక్షాళనలో తమ స్థానాలను పదిలం చేసుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎంఓలో ఉన్న అధికారుల్లో ఒక్కరిద్దరిని మాత్రమే ఖచ్చితంగా కొనసాగిస్తారని మిగిలిన వారి స్థానాల్లో మార్పు తప్పదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొందరి పనితీరుపై పత్రికల్లో పతాక స్థాయిలో కథనాలు రావడంతో ఐఏఎస్‌ బదిలీల్లో ఏమి జరుగనుందనే ఆసక్తి నెలకొంది.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం

టాపిక్

Ias OfficersAp BureaucratsGovernment Of Andhra PradeshTeluguTelugu NewsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024