





Best Web Hosting Provider In India 2024

నాడు విస్మరించి.. నేడు విజయవాడ-గుంటూరు రాగం ఆలపించడం వెనుక జగన్ ఆలోచన ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనల్లో మార్పు వచ్చిందా.. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవడానికి సిద్ధమయ్యారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ రాజధానికి అవసరమైన నిర్మాణాల విషయంలో చేసిన కామెంట్ల వెనుక వ్యూహమేమిటనే చర్చ మొదలైంది.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజధాని నిర్మాణంపై చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలు, ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి దక్కంచుకోవాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల టెండర్లపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. రాజధాని నిర్మాణ పనుల అంచనాలు భారీగా పెంచడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని జగన్ ఆరోపించారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి వాటి ద్వారా ముందే ముడుపులు వసూలు చేస్తున్నారని, జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేయడం వెనుక అసలు కారణం ఇదేనని ఆరోపిస్తున్నారు.
అమరావతిలో 50వేల ఎకరాల్లో రాజధాని పనులకు రూ.77వేల కోట్లు ఖర్చు చేస్తూ మరో 50వేల ఎకరాలను సేకరించాలనే ప్రతిపాదనల్ని కూడా జగన్ తప్పు పడుతున్నారు. వేల కోట్లను ఒకే ప్రాంతంలో ఖర్చు చేయడాన్ని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని భవనాల నిర్మాణం చేపట్టాలని జగన్ డిమాండ్ చేశారు.
నాడు విస్మరించి… నేడు ప్రేమ ఒలకబోస్తూ..
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే 2019లో ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధించారు. దాదాపు 9నెలల పాటు ఇసుక తవ్వకాలపై ఆంక్షలు కొనసాగాయి.వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అమరావతి నిర్మాణం లేకపోవడంతో ఆ పనులు కూడా ఆపేశారు. ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై నిషేధం విధించడంతో ఏపీలో ఒక్కసారిగా నిర్మాణ రంగం కుదేలైంది. ప్రాధానంగా కృష్ణా తీరంలో ఉండే విజయవాడ, గుంటూరు నగరాల్లో రియల్ ఎస్టేట్ ఆరేళ్ల తర్వాత కూడా ఇంకా కోలుకోలేదు.
2019 డిసెంబర్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్ అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేశారు. పరిపాలనా రాజధానిని విశాఖపట్నం తరలించనున్నట్టు ప్రకటించారు. న్యాయ రాజధాని కర్నూలు, శాసన రాజధాని అమరావతిలో కొనసాగిస్తామని చెప్పారు. దీనిని రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, విపక్షాలు వ్యతిరేకించాయి. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు ఇదే డ్రామా కొనసాగింది.
విశాఖ వెళ్లాలనుకుని…
విశాఖపట్నం రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాలని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. విశాఖ రాజధాని ప్రకటన ఎందుకు చేశారో, ఎందుకు వెళ్లలేకపోయారనే దానిపై కూడా స్పష్టత లేదు. మొదట్లో కోవిడ్ కారణంగా జాప్యం జరిగిందని ప్రచారం జరిగినా ఆ తర్వాత పొలిటికల్ డ్రామాతో కాలం గడిచిపోయింది. ఇటు అమరావతి నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసి అటు విశాఖపట్నం వెళ్లలేక 2024 ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
500ఎకరాల్లో భవనాలు కట్టేయాలి…
రాజధానికి అవసరమైన భవనాలను 500 ఎకరాల్లో కట్టేయాలని జగన్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. విజయవాడ-గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్శిటీ సమీపంలో 500 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే రెండు నగరాల్లో కలిసిపోతాయని ప్రభుత్వంపై పెద్దగా భారం ఉండదని సూచించారు. రాజధాని నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న జగన్.. తాను అధికారంలో అదే 500 ఎకరాల్లో విజయవాడ-గుంటూరు మధ్య శాశ్వత భవనాలను నిర్మించే ప్రయత్నాలు ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కంచుకోటలాంటి స్థానంలో వ్యతిరేకత..
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లిలో 2019 ఎన్నికల్లో వైసీపీకి గట్టి పట్టు ఉండేది. 2024 ఎన్నికల నాటికి అది తారుమారైంది. విజయవాడ నగరంలో తగినన్ని భూములు లేకపోవడంతో గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు నగరం విస్తరించాల్సి ఉన్నా వైసీపీ ప్రభుత్వ విధానాలతో అది నిలిచిపోయింది. రియల్ ఎస్టేట్ నిర్మాణాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
2019కు ముందు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో మొదలు పెట్టిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ముందుకు సాగక రైతులకు చెల్లించిన అడ్వాన్సులు కూడా వదిలేసుకున్నారు. విజయవాడ-గుంటూరు మధ్య సహజంగా జరగాల్సిన అభివృద్ధి కూడా జగన్ హయంలో మందగించిందనే విమర్శలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజక వర్గంలో వైసీపీ ఓటమికి ఇదే కారణమైంది.
2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో ఉన్న నియోజక వర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అమరావతిపై వైసీపీ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో 2024 నాటికి పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు మళ్లీ జగన్ అమరావతిని కాదని విజయవాడ – గుంటూరు ప్రాంతంపై అభిమానం ప్రదర్శించడం వెనుక ఇంకేదో స్కెచ్ ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పటికీ వైసీపీ వైఖరిని అధికారంగా వెల్లడించలేదు. ఇప్పుడు రాజధానిపై జగన్ చేస్తున్న కామెంట్ల వెనుక వ్యూహం ఏమిటనేది తేలాల్సి ఉంది.
సంబంధిత కథనం
టాపిక్