





Best Web Hosting Provider In India 2024

అనకాపల్లిలో కాల్ సెంటర్… అమెరికాలో మోసాలు.. భారీ సైబర్ క్రైం గుట్టు రట్టు చేసిన ఏపీ పోలీసులు
ఆమెజాన్ ఆర్డర్ల పేరుతో అమెరికా పౌరుల్ని మోసం చేస్తున్న ముఠా గుట్టును అనకాపల్లి పోలీసులు చేధించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతతో అనకాపల్లి కేంద్రంగా నడుస్తోన్న భారీ సైబర్ స్కామ్ను పోలీసులు చేధించారు. ఇందులో పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్జాతీయ సైబర్ క్రైం గుట్టును జిల్లా పోలీసులు చేధించారు. నిత్యం రూ.15-20 కోట్ల రుపాయల్ని అమెరికా పౌరుల ఖాతాల నుంచి కాజేస్తున్న ముఠా కార్యకలాపాలకు బ్రేకులు వేశారు. ఈ సైబర్ క్రైమ్ మూలాల్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో రెండ్రోజుల క్రితం అచ్యుతాపురంలో కార్డన్ సెర్చ్లు నిర్వహించారు. ఇందులో ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించారు. పోలీసుల తనిఖీలు గమనించి కొందరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
అచ్యుతాపురం గ్రామంలోని అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న ఈశాన్య రాష్ట్రాల యువతీయువకులు టెలికాలర్లుగా పనిచేస్తూ అమెరికా పౌరుల్ని మోసం చేస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. వీర్వో ఫిర్యాదుతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు నిజం బయట పడింది.
నిందితులు అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని, అమెజాన్ కస్టమర్ సపోర్ట్ గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.ఈ ఘటనలో మొత్తం 33 మందిని అరెస్ట్ చేశారు. కార్డన్ సెర్చ్లో ఒకేసారి భారీ స్కామ్ వెలుగు చూడటంతో పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. నిందితుల నుంచి కంప్యూటర్లు, నెట్వర్క్ పరికరాలు, డిజిటల్ సదుపాయాలు, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మోసాలకు పాల్పడుతున్నారు ఇలా…
అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేసుకుని నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ వివరించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు.
ఈ ముఠా అమెరికా, యూరోప్ దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అందించిన సమాచారంతో అచ్యుతాపురం భోగాపురం వీధిలోని పవన్ రెసిడెన్సీతో పాటు మరో రెండు అపార్టుమెంట్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
అపార్ట్మెంట్లలో మేఘాలయ,సిక్కం తదితర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 33 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించారు. వారి వద్ద నుంచి 3 లక్షలు నగదు, 32 హార్డ్ డిస్క్లు, 32 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముంబై, రాజస్థాన్కు చెందిన పునీత్గోస్వామి, అవిహంత్ దాగా ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. సైబర్ మోసాల ద్వారా రోజుకు 15 కోట్ల నుంచి 20కోట్ల వరకు కాజేస్తున్నారు.
సైబర్ ముఠా వీఓఐపీ కాల్స్ ఉపయోగించుకుని అమెరికాలోని అమెజాన్ కస్టమర్లకు మెసేజ్లు పంపుతారు. కాల్స్ చేసిన ఏదైనా వస్తువు కొన్నారా..? అని మెసేజ్ పంపుతారు. కస్టమర్ స్పందించి… కొనలేదని సమాధానం ఇస్తే.. మీ బ్యాంకు అకౌంట్ వాడుకొని ఎవరో వస్తువులు కొనుగోలు చేసినట్టు నమ్మిస్తారు. అకౌంట్ నుంచి డబ్బు పోకుండా ఉండటానికి తాము పంపే కోడ్ను ఎంటర్ చేయాలని సూచిస్తారని, వారి మాటలు నమ్మి కోడ్ ఎంటర్ చేస్తే బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పగానే వాటి నుంచి డబ్బులు కాజేస్తున్నట్టు ఎస్పీ వివరించారు.
సంబంధిత కథనం
టాపిక్