




Best Web Hosting Provider In India 2024

మణిరత్నం నేరుగా తెలుగులో తీసిన ఏకైక సినిమా ఇదే.. బాక్సాఫీస్ బ్లాక్బస్టర్.. అవార్డుల పంట.. నాగార్జున రెమ్యునరేషన్ ఇదీ
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దేశం మెచ్చే ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు తీశాడు. కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క మూవీ మాత్రమే చేయడం విశేషం. అతడు తీసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో డబ్ అయినా.. నేరుగా తెలుగులో తీసింది మాత్రం ఒక్కటే.
మణిరత్నం ఒక్క తమిళులే కాదు మొత్తం దేశం మెచ్చిన డైరెక్టర్. అతని కెరీర్లో రోజా, బాంబే, దళపతి, నాయకుడులాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే అంతటి గొప్ప దర్శకుడు తెలుగులో మాత్రం ఒకే ఒక్క మూవీ చేశాడు. ఆ సినిమా పేరు గీతాంజలి. అక్కినేని నాగార్జున కెరీర్లో ఇప్పటికీ ఓ మైలురాయిగా నిలిచిపోయిన సినిమా అది.
గీతాంజలి.. ఓ బ్లాక్బస్టర్
మణిరత్నం డైరెక్ట్ చేసిన గీతాంజలి మూవీ మే 12, 1989లో రిలీజైంది. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్న నాగార్జునకు ఓ బ్లాక్బస్టర్ అందించాడు. ఈ రొమాంటిక్ డ్రామా అప్పట్లో ఓ పెను సంచలనం. ఈ సినిమాలోని పాటలు మరో లెవెల్. ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఈ సినిమాలో నాగార్జున సరసన గిరిజ నటించింది.
తమ ప్రాణాలు ఎప్పుడు పోతాయో తెలియని ఓ యువ జంట ప్రేమలో పడటం అనే ఓ భిన్నమైన స్టోరీ లైన్ తో మణిరత్నం తన మార్క్ మూవీ అందించాడు. నిజానికి ఇదో శాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ. కానీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో 100 రోజులకుపైగా ఆడింది. కేవలం 60 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయడం విశేషం.
గీతాంజలి సినిమాకు అవార్డులు వెల్లువలా వచ్చాయి. బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డుతోపాటు ఆరు నంది అవార్డులు కూడా రావడం విశేషం. నాగార్జునను యువతలో ఓ రొమాంటిక్ స్టార్ ను చేసిన మూవీ ఇదే అని చెప్పొచ్చు. అతని కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పేసింది.
నాగార్జున రెమ్యునరేషన్ ఇదీ
1988లో గీతాంజలి షూటింగ్ జరిగింది. అప్పట్లో ఈ సినిమా బడ్జెట్ రూ.1.2 కోట్లు. అందులో నాగార్జున అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రూ.7.5 లక్షలు. అతని కంటే దర్శకుడైన మణిరత్నమే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం. అతనికి రూ.10 లక్షలు ఇచ్చారు. మణిరత్నం కెరీర్లో అప్పటికే మౌనరాగం, నాయకుడులాంటి పెద్ద హిట్ సినిమాలు ఉన్నాయి.
ఇక నాగార్జున కూడా విక్రమ్, మజ్ను, ఆఖరి పోరాటం, విక్కీదాదాలాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ ఏకైక తెలుగు మూవీ ఇప్పటికీ నాగార్జున కెరీర్లోని అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
గీతాంజలి మూవీ గురించి..
గీతాంజలి సినిమాలో ప్రకాశ్ అనే పాత్రలో నాగార్జున నటించాడు. ఇక గీతాంజలి పాత్రలో గిరిజ నటించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ప్రకాశ్ కు ఓ ప్రమాదం జరుగుతుంది. అది చిన్నదే అయినా ఆ తర్వాత చేసిన పరీక్షల్లో అతనికి క్యాన్సర్ ఉందని, కొన్ని నెలలకు మించి బతకడని తేలుతుంది. ఇలాంటి సమయంలో ఆ బాధను మరచిపోవడానికి అతన్ని కుటుంబ సభ్యులు ఊటీ పంపిస్తారు.
అక్కడే అతనికి గీతాంజలి పరిచయం అవుతుంది. ఆమె కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా.. అవేమీ పట్టనట్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆమె ప్రేమలో పడిన తర్వాత ఇద్దరికీ ఒకరి వ్యాధి గురించి మరొకరికి తెలుస్తుంది. తాము చనిపోతున్నామని తెలిసినా.. తుది శ్వాస విడిచే వరకూ కలిసే ఉండాలని నిర్ణయించుకుంటారు. వీళ్ల ప్రేమ కథ ఎంత వరకూ వెళ్లింది? చివరికి వీళ్లు ఒక్కటవుతారా అన్నదే గీతాంజలి మూవీ కథ.
హీరోయిన్ ఎంపిక అలా..
ఈ సినిమా నాగార్జున పక్కన గిరిజలాంటి నటిని ఎంపిక చేసుకోవడం, ఆమెతో అద్భుతంగా నటింపజేయడం మణిరత్నంకే చెల్లింది. నిజానికి ఆమెను తన పెళ్లిలోనే అతడు చూశాడు. ఈ సినిమాకు కొన్ని రోజుల ముందే సుహాసినితో మణిరత్నం పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి అప్పటి టీమిండియా స్టార్ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సోదరి కూడా వెళ్లింది.
ఆమెతోపాటే ఈ గిరిజ కూడా వెళ్లడం, పెళ్లిలో ఆమెను చూసిన మణిరత్నం హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం జరిగిపోయాయి. అసలు నటన అనుభవం లేకపోవడంతో షూటింగ్ కు ముందు రెండు నెలల పాటు ఓ అసోసియేట్ డైరెక్టర్ తో ఆమెకు శిక్షణ కూడా ఇప్పిండచం విశేషం. ఇక సినిమాలో ఆమెకు నటి రోహిణి డబ్బింగ్ చెప్పింది.
సంబంధిత కథనం