కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆర్బీఐ డివిడెండ్.. ఎన్ని లక్షల కోట్లు అంటే?

Best Web Hosting Provider In India 2024


కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆర్బీఐ డివిడెండ్.. ఎన్ని లక్షల కోట్లు అంటే?

Anand Sai HT Telugu

కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. రికార్డు స్థాయిలో డివిడెండ్ చెల్లించేందుకు నిర్ణయించింది.

కేంద్రానికి ఆర్బీఐ డివిడెండ్ (PTI)

ిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రూ.2.1 లక్షల కోట్ల కంటే ఎక్కువ. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెల్లింపులు రూ.87,416 కోట్లుగా ఉన్నాయి.

రూ.2.69 లక్షల కోట్లు

ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్ 2024-మార్చి 2025 మధ్య రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై చర్చించిన బోర్డు 2024-25 సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను ఆమోదించింది. దీంతో పాటు రూ.2.69 లక్షల కోట్ల మిగులును కేంద్ర ప్రభుత్వానికి బదలాయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

సీఆర్బీ పెంచాలని నిర్ణయం

సవరించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్‌వర్క్(ఈసీఎఫ్) కింద కంటింజెన్సీ రిస్క్ బఫర్(సీఆర్బీ)ను 6.5 శాతం నుంచి 7.5 శాతానికి పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 5.5 శాతం సీఆర్బీని కొనసాగించింది. ఇది గత రెండేళ్లలో వరుసగా 6 శాతం, 6.5 శాతానికి పెరిగింది.

మిగులు నిధులు

ఆర్థిక మూలధన నిర్మాణం(ఈసీఎఫ్) ఆధారంగా ఆర్బీఐ ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లిస్తుంది. అంటే ఏటా మిగులు నిధులను కేంద్రానికి డివిడెండ్ రూపంలో అందిస్తుంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా 2019 ఆగస్టులో ఈ ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి తెచ్చారు. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో 5.5-6.5 శాతాన్ని కంటింజెన్సీ రిస్క్ బఫర్(సీఆర్బీ)గా ఉంచాలని జలాన్ కమిటీ సిఫారసు చేసింది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి పెంచనున్నారు. గతవారం ఆర్బీఐ బోర్డు ఈసీఎఫ్‌ను సమీక్షించింది. దీని ఆధారంగా మిగులును ప్రభుత్వానికి బదలాయిస్తారు.

ఆర్బీఐ ఆదాయం, వ్యయాలు

దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు-కమీషన్లు, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్బీఐకు ఆదాయం వస్తుంది. అయితే వ్యయాలు కూడా చాలానే. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్స్-రుణాలపై వడ్డీ చెల్లింపు, జీతాలు-ఫించన్లు, నిర్వహణ ఖర్చులు వంటివి ఉంటాయి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link