




Best Web Hosting Provider In India 2024

మాచర్ల టీడీపీ నాయకుల హత్య ఘటనలో ఊహించని ట్విస్ట్.. పిన్నెల్లి బ్రదర్స్పై కేసు నమోదు!
పల్నాడు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకుల హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, అతని సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడు జంట హత్యల ఘటనలో.. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరులపై కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఎ-1గా జవిశెట్టి శ్రీను, ఎ-2గా తోట వెంకట్రావు, ఎ-3గా తోట గురవయ్య, ఎ-4గా నాగరాజు, ఎ-5గా తోట వెంకటేశ్వర్లు, ఎ-6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎ-7గా పిన్నెల్లి వెంకట్రామి రెడ్డిని చేర్చారు.
జూలకంటి ఆరోపణలతో..
శనివారం సాయంత్రం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును.. అదే పార్టీకి చెందిన కొందరు హత్య చేశారు. అయితే ఈ హత్యల వెనుక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల హస్తం ఉందని.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. చిన్న చిన్న వివాదాలను పిన్నెల్లి సోదరులు పెద్దవిగా చేసి.. హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా.. నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
కారుతో ఢీకొట్టి.. రాయితో మోది..
గుండ్లపాడు గ్రామానికి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ మొద్దయ్య.. అతని సోదరుడు జవిశెట్టి కోటేశ్వరరావు శనివారం తెలంగాణలో ఒక వివాహానికి హాజరై బైక్పై గ్రామానికి తిరిగివెళుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వెల్దుర్తి మండలం బొదిలవీడు వద్దకు వచ్చాక.. ఓ స్కార్పియో వాహనం వీరి బైక్ను వేగంగా ఢీకొట్టింది. కొంచెం దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. ఆ తర్వాత కారులోంచి దిగిన నిందితులు.. ఇద్దరూ చనిపోయారా లేదా అని పరిశీలించారు. కొన ఊపిరితో ఉన్న కోటేశ్వరరావును రాయితో మోది చంపారు. ఆ తర్వాత వాహనాన్ని ఆక్కడే వదిలేసి పరారయ్యారు.
నివురుగప్పిన నిప్పులా వర్గపోరు..
గుండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్పై వెళుతూ.. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు హంతకులకు తెలియజేశారు. ఈ సమాచారం ఆధారంగా.. తొలుత రెండు ద్విచక్ర వాహనాలు వెళ్లిన తర్వాత.. మూడో బైక్పై వస్తున్న అన్నదమ్ములిద్దరిని కారుతో గుద్ది చంపేశారు. గుండ్లపాడు గ్రామంలో ఏప్రిల్లో ఫ్లెక్సీ వివాదం రాజుకుంది. అప్పటినుంచీ శాంతిభద్రతలు అదుపులో లేవనే టాక్ వినిపిస్తోంది. వర్గపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరి హత్య జరిగింది.
వైసీపీ వెర్షన్ ఇదే..
ఇద్దరు టీడీపీ నాయకులను ఆ పార్టీ వారే చంపారని.. ఈ హత్యలతో తమకేంటి సంబంధం అని.. మాచర్ల వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును ఢీకొన్ని వాహనంపై జేబీఆర్ (జూలకంటి బ్రహ్మారెడ్డి) అని ఉందని చెబుతున్నారు. వారి పార్టీ నాయకులను వారు చంపుకున్నా.. ఆ నింద తమపైనే వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలకు ఇది ఉదాహరణ అని విమర్శిస్తున్నారు. అయితే.. దీనిపై పిన్నెల్లి బ్రదర్స్ మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. అతని అనుచరులే మాట్లాడుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్