





Best Web Hosting Provider In India 2024

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్..! కడప మహానాడులో కీలక బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధం…
తెలుగు దేశం పార్టీలో నారా లోకేష్కు కొత్త బాధ్యతలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. పదేళ్లకు పైగా తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్కు మరిన్ని బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని మహానాడులో అప్పగించనున్నారు.
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కడప వేదిక కానుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పురిటిగడ్డపై జరుగుతున్న మహానాడుపై భారీ అంచనాలు ఉన్నాయి. కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులకు బలమైన సంకేతాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. టీడీపీ మహానాడులో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ యువనాయకుడు మంత్రి నారా లోకేష్కు పార్టీలో మరిన్ని బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే మహానాడులో లోకేష్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించేందుకు కసరత్తు జరుగుతోంది.
నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడం ప్రారంభించి దశాబ్ద కాలం దాటింది. 2009-14 మధ్య కాలంలో టీడీపీలో లోకేష్ ప్రస్థానం మొదలైంది. స్టాన్ఫోర్డ్లో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కుటుంబ వ్యాపారాలతో పాటు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం మొదలైంది.
2014 ఎన్నికలకు ముందే అప్పటికి పదేళ్లకు పైగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు లోకేష్ కసరత్తు చేశారు. పార్టీలో తెర వెనుక ఉంటూ టీడీపీని గెలిపించేందుకు పార్టీ కార్యక్రమాలకు సాంకేతికతను జోడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో సోషల్ మీడియా ప్రచారాన్ని జోడించడంలో లోకేష్ టీమ్ కీలకంగా వ్యవహరించింది.
2014లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకు మంత్రి వర్గంలో నారాలోకేష్కు చోటు దక్కింది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా అనుభవాన్ని గడించారు. రాష్ట్రానికి పెట్టుబడుల్ని, భారీ పరిశ్రమల్ని ఆకర్షించడంలో కీలకంగా వ్యవహరించారు.
2019లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత కూడా పార్టీని యాక్టివ్గా ఉంచడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్రతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఉపయోగపడింది.
వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు..?
టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ను కడప మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంటట్ నియమించనున్ట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో జరిగే సమావేశాలకు హాజరవడంతో పాటు పాలనా వ్యవహారాలను సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో ముఖ్యమంత్రి బిజీగా ఉంటున్నారు. చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అప్పగించే క్రమంలో నారా లోకేష్కు టీడీపీలో మరిన్ని బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేశ్కు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్ఠానంపై చాలారోజులుగా ఒత్తిడి వస్తోంది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపై కేంద్రీకరించడంతో కావడంతో పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించ లేకపోవడంతోనే 2019లో ఓటమి పాలయ్యారని సీనియర్లు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు రాజకీయ వారసుడిగా పార్టీలో లోకేష్ స్థానాన్ని బలపరచాలని డిమాండ్ కూడా టీడీపీ నేతల్లో ఉంది. ఆయన్ని డిప్యూటీ సీఎం చేయాలని పలువురు నేతలు గతంలో డిమాండ్ చేశారు. చంద్రబాబు తర్వాత పార్టీని నడిపించాల్సిన లోకేష్కు తగిన సమయంలో బాధ్యతల్ని అప్పగించాలని నేతల సూచనలతో మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
కడపలో తొలిసారి నిర్వహణ
కడప వేదికగా టీడీపీ మహానాడు మంగళవారం ప్రారంభం అవుతోంది. తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సోమవారం సాయంత్రం కడప చేరుకుంటారు. సోమవారం మధ్యాహ్నానికి పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కుప్పం నుంచి కడప చేరుకుంటారు.
కడప నగర శివా ర్లలో ఉన్న కమలాపురం నియోజకవర్గం పబ్బాపురం సమీపంలోని 150 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు నిర్వ హిస్తున్నారు. మంత్రులు, కీలక నేతలు కడపలో అది వారం మహానాడు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
మహానాడులో రాయలసీమ డిక్లరేషన్…
రాయలసీమ ప్రజల ఆకాంక్షలను తీర్చేలా కడపలో మహానాడు నిర్వహిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నా యుడు తెలిపారు. మహానాడులో రాయలసీమ డిక్లరేషన్పై ప్రధానంగా చర్చించనున్నట్లు అచ్చెన్నాయుడు వివరించారు. మహానాడులో చివరి రోజు 29న జరిగే బహిరంగ సభకు 5 లక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
గతంలో జరిగిన మహానాడుకు భిన్నంగా కడప మహానాడు ఉంటుందని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రాంగణంలో ఏర్పాట్లను వివిధ కమిటీల సభ్యులైన మంత్రి అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, నారాయణ, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు తదితరులు సమీక్షించారు.
మంగళవారం కార్యక్రమాలు ఇలా…
మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం అవుతుంది. అనంతరం పార్టీ చరిత్రను వివరించే ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాల్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. ఉదయం 10. 45కు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళితో మహానాడు ప్రారంభం కానుంది. అనంతరం ఇటీవల మరణించిన నాయకులు, కార్యకర్తలకు సంతాపం ప్రకటిస్తారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక, ఉదయం 11. 30కి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగత ప్రసంగం, పార్టీ జమా ఖర్చులపై కోశాధికారి నివేదిక ఉంటాయి. ఉదయం 11. 50కి పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు స్వాగతోపన్యాసం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్