Best Web Hosting Provider In India 2024

విశాఖ: మేము ఎప్పటికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాటకి, పార్టీకి కట్టుబడి ఉంటామని, పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుమారుడు దేవన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ వైవీ సుబ్బారెడ్డిని వారి నివాసంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఆయన కుమారుడు గాజువాక మాజీ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ.. నేను గాని, నా కుమారులు కానీ ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి నమ్మకస్తులుగా ఉంటాం. పార్టీ కి విధేయులుగా ఉంటాం. వైయస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ శ్రేయస్సు కోసం కంకణబద్ధులై ఉంటాం. వైయస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అదే మాకు ముఖ్యం అన్నారు.
దేవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న నేను నా వ్యక్తిగత పనులు మీద బయటకి వెళ్ళాను, వెళ్లేముందు మా ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడి వెళ్ళాను. అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. నిన్న నేను మళ్ళీ సిటీ కి వచ్చే లోపు నామీద చాలా పుకార్లు లేపారు. అయినా మా నాన్న ఎమ్మెల్యే గా ఉండగా నేనెందుకు పార్టీకి రాజీనామా చేస్తాను. నేను పార్టీతోనే వున్నానని స్పష్టం చేశారు. మాపై వచ్చిన పుకార్లపై వివరణ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డిని కలిశామని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని దేవన్ రెడ్డి ఉద్ఘాటించారు.