





Best Web Hosting Provider In India 2024

వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు షాక్.. వైద్య ఆరోగ్య శాఖలో మూడేళ్లు ఒకే చోట పనిచేస్తే బదిలీ.. పనితీరు ఆధారంగా బదిలీలు..
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఆంక్షలు సడలించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలకు ప్రత్యేక వెసులుబాటుకు సీఎం అనుమతించారు. పనితీరు ఆధారంగా ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లను బదిలీ చేస్తారు.
ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి చెక్ పెట్టడంతో పాటు ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచేలా బదిలీలు చేపట్టనున్నారు. మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వైద్య ఆరోగ్య శాఖ సహాయక సిబ్బంది బదిలీ చేస్తారు. పనితీరు ఆధారంగా ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్ల స్ధానాలను మార్చేందుకు ఆరోగ్య శాఖకు ప్రత్యేక వెసులుబాటు ముఖ్యమంత్రి కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన సాధారణ బదిలీ ప్రక్రియను అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు అత్యున్నత వైద్యుల పనితీరు మెరుగుపరిచే దిశగా వినియోగించడానికి వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. బదిలీలకు సంబంధించి కొన్ని వైద్య ఆరోగ్య శాఖకు ప్రత్యేక సడలింపులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
శాఖ ప్రత్యేక అవసరాలు
వైద్యారోగ్య శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండటంతో కొన్ని క్లిష్టమైన అంశాలు, వైద్య శాఖకు సంబంధించిన ప్రత్యేక అవసరాల నేపథ్యంలో ఆర్థిక శాఖ జారీ చేసిన విధివిధానాల్లో శాఖ అవసరాల మేరకు 10 సడలింపులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతిపాదించగా ముఖ్యమంత్రి వాటిని ఆమోదించారు.
వైద్యశాఖ విభాగాధిపతులతో బదిలీలకు సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ సడలింపుల ప్రతిపాదన చేశారు. రెండేళ్ల క్రితం సాధారణ బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం విడుదల చేసిన విధివిధానాల్ని సమగ్రంగా సమీక్షించి ఆశించిన లక్ష్యాల్ని సాధించే దిశగా ప్రస్తుత బదిలీల విషయంలో వినూత్న చర్యల్ని మంత్రిత్వ శాఖ చేపట్టనుంది.
మూడేళ్ల పనిచేస్తే బదిలీ తప్పనిసరి..
క్షేత్ర స్థాయిలో రీజనల్ డైరెక్టర్లు, డిఎంహెచ్వోలు, డిసిహెచ్యస్ల కార్యాలయాలతో పాటు ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్ల కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కింది స్థాయి పాలనా సిబ్బందిపై పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ప్రధానమైన నిర్ణయాన్ని తీసుకుంది.
ఆర్థిక శాఖ విధానాల ప్రకారం ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలన్న నిబంధనను సడలిస్తూ ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన పాలనా సిబ్బందిని బదిలీ చేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ రకమైన చర్య చేపట్టడం ఇదే మొదటిసారి అని ఉన్నతాధికారులు తెలిపారు.
అవినీతి ఆరోపణలపై సీరియస్
వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, మేనేజర్లు వంటి పాలనా సహాయక సిబ్బంది స్థాన బలిమితో పలు సంవత్సరాలుగా పలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
నియమాల మేరకు వారు పనిచేయడంలేదని, సిబ్బంది అలసత్వంతో పలు పాలనాపరమైన సమస్యలెదురవుతున్నాయని, ప్రతి పనికీ ధరను నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారని, ప్రధానమైన కోర్టు వ్యవహరాల్లో కూడ నిర్లక్ష్యంతో వ్యవహరించి ఇబ్బందికర పరిస్థితుల్ని కల్పిస్తున్నారని, సీనియర్ల ఆదేశాల్ని సైతం పట్టించుకోవడం లేదని, ఉన్నతాధికారుల్ని పలు విషయాల్లో తప్పుదోవ పట్టిస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారిని బదిలీ చేయాలని నిర్ణయించారు. అక్రమాలతో పాలనా సామర్ధ్యం కుంటుపడడంతో పాటు మంత్రిత్వ శాఖ ప్రతిష్ట మసకబారే అవకాశమున్నందున ఈ చర్యను చేపట్టారు.
ఉద్యోగ సంఘాలకు అదే రూల్..
వివిధ ఉద్యోగ సంఘాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సిబ్బందిని అదే స్టేషన్లోనే మరొక కార్యాలయానికి బదిలీ చేస్తారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, అనుబంధ బోధానాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రభుత్వ స్పెషాలిటీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో కలిపి 37 మంది సీనియర్ డాక్టర్లు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఎడిఎంఇ) స్థాయిలో కీలక బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. వీరంతా సమర్ధత, సమన్వయాలతో పనిచేస్తూ మంచి ఫలితాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. వీరిలో పలువురి పనితీరు ఆశించిన మేరకు లేదు. ఈ నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తికానున్నప్పటికీ పనితీరు ఆధారంగా పాలనా అవసరాల మేరకు వారి బదిలీలు జరుగుతాయి.
ఇతర సడలింపులు
వైద్యారోగ్య శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఆమోదించిన ఇతర సడలింపుల ప్రకారం….ఒకే చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే బదిలీలను కోరవచ్చు. ఆర్థిక శాఖ విధానాల ప్రకారం సర్వీసు కాలంతో సంబంధంలేకుండా ఎవరైనా బదిలీ కోరవచ్చు. కానీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక అవసరాల మేరకు ఈ రెండేళ్ల కనీస సర్వీసు నిబంధనను పొందుపర్చారు.
డిఎంఇ అధీనంలో ఉండే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో జాతీయ వైద్య సంఘం(ఎన్ఎంసి) నిబంధనల మేరకు ఉన్న ఖాళీలనే ప్రకటించి ప్రస్తుత బదిలీల ద్వారా వాటిని భర్తీ చేస్తారు. డెప్యుటేషన్ పై పనిచేస్తున్న వారి సీనియారిటీని వారు ఏ కార్యాలయాల నుంచి జీతభత్యాలు తీసుకుంటున్నారో అక్కడ పనిచేసినప్పట్నించి పరిగణలోకి తీసుకుంటారు.
వైద్యుల్ని మిస్ మ్యాచ్ పోస్టుల్లో పనిచేయడానికి అనుమతినివ్వరు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగీ బదిలీ కోరుతూ మూడు స్థానాల్ని ప్రాధాన్యతా క్రమంలో సూచించాలి. ఒకే పోస్టును ఒకరి కంటే ఎక్కువ మంది కోరితే సీనియారిటీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఇతర కేటగిరీలకు సంబంధించి ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేస్తారు.మంగళవారం నుంచి 20 రోజుల్లోగా వైద్యారోగ్య శాఖ బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తారు.
సంబంధిత కథనం
టాపిక్