





Best Web Hosting Provider In India 2024

పవన్ కల్యాణ్ చెప్పినట్లే చేద్దాం.. ఆ రేట్లు తగ్గిస్తే మంచిది.. ఓటీటీ రిలీజ్లపై నిర్ణయం తీసుకుందాం: నిర్మాత దిల్ రాజు
ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు తీసుకురావడానికి పవన్ కల్యాణ్ చేసిన సూచనలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆహ్వానించాడు. అంతేకాదు ఓటీటీ రిలీజ్లను మరింత ఆలస్యం చేసే దిశగా నిర్ణయం తీసుకోవాలని కూడా అతడు అభిప్రాయపడ్డాడు.
పవన్ కల్యాణ్ కామెంట్స్ తో దిల్ రాజు ఏకీభవించాడు. సగటు సినిమా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ఇచ్చిన సలహాలను అతడు స్వాగతించాడు. ఈ మేరకు అతడు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అందులో కొన్ని కీలకమైన అంశాలపై స్పందించాడు.
థియేటర్లలో వాటి రేట్లు తగ్గించాలి
సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తిరిగి రప్పించడానికి పవన్ చేసిన సూచనల్లో ఒకటి థియేటర్లో తినుబండారాలు, పానీయాల ధరలను తగ్గించడం. ఈ సలహాతో దిల్ రాజు కూడా ఏకీభవించాడు. ఈ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ నిర్ణయం అభినందనీయం అని అన్నాడు. దీనిని స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు.
ఓటీటీ రిలీజ్లపై నిర్ణయం
ఇక ప్రేక్షకుల థియేటర్లకు రావడం తగ్గిపోవడానికి మరో ప్రధాన కారణం.. కొత్త మూవీస్ చాలా త్వరగానే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం. దీంతో దీనిపైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని దిల్ రాజు అభిప్రాయపడ్డాడు. ఓటీటీలోకి ఎంతకాలం తర్వాత సినిమా వెళ్లాలో అందరం కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. అంతేకాదు ప్రేక్షకుడికి థియేటర్లలో సినిమా చూసే అనుభూతి ఎలాంటిదో అర్థవంతంగా తెలియజేయాలని కూడా స్పష్టం చేశాడు.
పైరసీ భూతాన్ని కూడా తరమాలి
పైరసీ అంశాన్ని కూడా ఈ సందర్భంగా దిల్ రాజు ప్రస్తావించాడు. థియేటర్లకు జనం రాకపోవడానికి పైరసీ కూడా ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. అందరం కలిసికట్టుగా దీనిపై పోరాడితేనే మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలుగుతామని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. ఈ మధ్యే తన సినిమాల పైరసీ వల్ల తానెంత నష్టపోయిందీ అతడు చెప్పిన విషయం తెలిసిందే.
ఫిలిం ఛాంబర్ ద్వారానే కలుద్దాం
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఎవరికి వారు వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే కలవాలని కూడా పవన్ స్పష్టం చేశాడు. తన సినిమా టికెట్ల ధర విషయం అయినా సరే సరైన ప్రక్రియ ద్వారానే ముందుకెళ్లాలని అతడు అన్నాడు. దీనిని కూడా దిల్ రాజు స్వాగతించాడు. ఇది పరిశ్రమకు శాశ్వత దిశను ఇస్తుందని అన్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకెళ్లాలని, ఆ దిశగా తొలి అడుగు వేసిన పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలని దిల్ రాజు అన్నాడు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన ఈ సలహాలను తాము తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతామని దిల్ రాజు హామీ ఇచ్చాడు. తద్వారా తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి తోడ్పడుతుందని స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం