యూఎస్​ స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత- అంతర్జాతీయ విద్యార్థులపై పగపట్టేసిన ట్రంప్​!

Best Web Hosting Provider In India 2024


యూఎస్​ స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత- అంతర్జాతీయ విద్యార్థులపై పగపట్టేసిన ట్రంప్​!

Sharath Chitturi HT Telugu

అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు మరో షాక్​ తగిలింది! యూఎస్​ స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంబసీలను అమెరికా ఆదేశించింది.

యూఎస్​ స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు రద్దు!

అమెరికాలోని యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న డొనాల్డ్​ ట్రంప్​ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది! స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదేశించారు. విద్యార్థుల సోషల్​ మీడియా ప్రొఫైల్స్​ని ట్రంప్​ ప్రభుత్వం అత్యంత కఠినంగా పరిశీలిస్తున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం.

యూఎస్​ స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత..

అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్​ ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఇదే విషయంపై యూనివర్సిటీలతో కూడా ట్రంప్​నకు గొడవ నడుస్తోంది. ఇక ఇప్పుడు స్టూడెంట్​ వీసా ఇంటర్వ్యూలు నిలిపివేయడం అనేది వైట్ హౌస్, విశ్వవిద్యాలయాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రమాదాన్ని పెంచుతుంది. పరిస్థితి మొదట్లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం వంటి ఉన్నత పాఠశాలలపై కేంద్రీకృతమైనప్పటికీ, ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది.

“తక్షణం, అవసరమైన సోషల్ మీడియా స్క్రీనింగ్- పరిశీలన విస్తరణకు సన్నాహకంగా, తదుపరి మార్గదర్శకాలు జారీ చేసే వరకు కాన్సులర్ విభాగాలు అడిషనల్​ స్టూడెంట్​ లేదా ఎక్స్​ఛేంజ్​ విజిటర్ (ఎఫ్, ఎం, జే) వీసా అపాయింట్​మెంట్​ సామర్థ్యాన్ని జోడించకూడదు,” అని రుబియో ఎంబసీలకు పంపినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై రానున్న రోజుల్లో మార్గదర్శకాలు లభిస్తాయని ఆయన చెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూలు కొనసాగుతాయని తెలుస్తోంది.

స్టేట్ డిపార్ట్​మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ రుబియో ఉత్తర్వుపై నేరుగా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

“కంట్రీలోకి ఎవరు రావడానికి ప్రయత్నిస్తున్నారు, వారు ఎందుకు రావాలనుకుంటున్నారు, వారు ఎవరు అని తెలుసుకునే హక్కు ప్రతి సార్వభౌమ దేశానికి ఉంది. వారు అక్కడ ఏమి చేస్తున్నారో తెలిస్తే, ఇక్కడ ఉన్నప్పుడు ఏమి చేస్తారో అర్థం చేసుకోవచ్చు,” అని బ్రూస్ అన్నారు. “ఇదేం కొత్త కాదు. ఇక్కడకు వస్తున్నది విద్యార్థులా కాదా అని అంచనా వేయడానికి మేము చేయగలిగిన ప్రతి సాధనాన్ని ఉపయోగించడం కొనసాగిస్తాము,” అని తెలిపరు.

ట్రంప్ పరిపాలన చర్య అంతర్జాతీయ విద్యార్థులకు, వారిపై ఆధారపడిన యూఎస్ విశ్వవిద్యాలయాలకు “వినాశకరమైనది” అని క్లీవ్​ల్యాండ్​కి చెందిన ఇమ్మిగ్రేషన్ అటార్నీ డేవిడ్ లియోపోల్డ్ అన్నారు. “ఆర్థిక ప్రభావాలు- సాంస్కృతిక ప్రభావాలు భారీగా ఉంటాయి,” అని చెప్పారు.

వీసా దరఖాస్తులను నిలిపివేయడం లేదా మందగించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం పడుతుందని, విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించడం ద్వారా తమ ర్యాంకులను పెంచుకునే అమెరికాలోని అనేక విద్యాసంస్థలు ఇప్పుడు ప్రభావితమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మొత్తం 19 మిలియన్ల అమెరికా ఉన్నత విద్యా జనాభాలో అంతర్జాతీయ విద్యార్థులు 5.9% ఉన్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో, 1.1 మిలియన్లకు పైగా విదేశీ విద్యార్థులు అమెరికాకు వచ్చారు. భారతదేశమే అత్యధికంగా విద్యార్థులను పంపింది. తర్వాతి స్థానంలో చైనా ఉంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ లేదా మ్యాథమెటిక్స్ చదువుతారు. 25 శాతం మంది గణితం, కంప్యూటర్ సైన్స్​లో ఉండగా, ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంజినీరింగ్​ని ఎంచుకున్నారు. స్టేట్ డిపార్ట్​మెంట్ స్పాన్సర్ చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. 21,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులతో న్యూయార్క్ విశ్వవిద్యాలయం, నార్త్​ఈస్టెర్న్​ విశ్వవిద్యాలయం, కొలంబియా వర్సిటీలు అత్యధిక విదేశీ విద్యార్థులను కలిగి ఉన్నాయి.

వాస్తవానికి విదేశీ విద్యార్థులు చెల్లించే పూర్తి ట్యూషన్ ఫీజుతోనే వర్సిటీలు యూఎస్​ పౌరులకు మరింత ఆర్థిక సహాయం అందించగలుగుతున్నాయి.

వీసాల కోసం విదేశీ విద్యార్థులను తనిఖీ చేయడం ఇప్పటికే కఠినమైన ప్రక్రియగా ఉంది. దరఖాస్తుదారులు బలమైన విద్యార్హతలు, ఆర్థిక వనరులు, వారి సొంత దేశంతో సంబంధాలు, గ్రాడ్యుయేషన్ తర్వాత స్వదేశానికి తిరిగి వెళతారా? లేదా? అనే ఉద్దేశాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link