




Best Web Hosting Provider In India 2024

‘ఒక ఐఏఎస్ ఇలా అనడం దుర్మార్గం’ – ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియోను విడుదల చేశారు. శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులను విద్యార్థులతో చేయించటం నేరమన్నారు. బాధ్యత లేకుండా మాట్లాడిన ఐఏఎస్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులను పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కవిత ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం…. స్వీపింగ్ మరియు శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయించింది. నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్ గా చేసుకోవాలని అధికారులు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల నెలకొని ఉంది” అని కవిత విమర్శించారు.
అలా చేయించటం నేరం….
“రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా… పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయాల్సి వస్తుంది. శ్రమను గౌరవించడం, నేర్పడం వేరు… విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరం” అని కవిత తన పోస్టులో ప్రస్తావించారు.
ఒక ఐఏఎస్ ఇలా అనడం దుర్మార్గం – కవిత
“ఇక్కడ ఆడియోలో వర్షిని(ఎస్సీ గురుకులాల కార్యదర్శి) గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం… టాయిలెట్ కడగడం ఒకటి కాదు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా…? అది కూడా రెగ్యులర్ గా…? సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా పాష్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడమేంటి..? ఎందుకు ఇలాంటి పనులు చేయరు…? చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుంచి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష మరియు శ్రమ దోపిడీ మాత్రమే” అని కవిత దుయ్యబట్టారు.
ఉద్యోగులను తొలగించటం అన్యాయం – కవిత
“గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖి చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతే కానీ పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్ మరియు శానిటేషన్ వర్కర్స్ చేయించే పని చేయించడం కరెక్ట్ కాదు. నలుగురు శానిటేషన్ వర్కర్స్ ఒక వార్డెన్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయం. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడం తప్పు” అని కవిత చెప్పారు.
“అందరూ పిల్లలు సమాజం దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ఆ అధికారిని తప్పించాలి. నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలి. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలి” అని కవిత డిమాండ్ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్