



Best Web Hosting Provider In India 2024

ఒక శానిటరీ నాప్కిన్, ఒక టాయిలెట్, ఒక భవిష్యత్తు – తెలుగు రాష్ట్రాల్లోని బడుల్లో బాలికలకు ఇప్పుడు అత్యవసరం
రుతు పరిశుభ్రత దినం 2025: రుతుచక్రం మొదలయ్యాక కౌమార బాలికలు బడి మానేయకుండా ఉండడానికి, వారు చదువు కొనసాగించేలా చూడడానికి.. పాఠశాలల్లోని వాతావరణం, అక్కడ లభించే మద్దతు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి.
తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో నివసించే నిత్యకు రుతుస్రావం మొదలైనపుడు ఏం జరుగుతోందో అర్థంకాక చాలా గాభరా పడింది. నలుగురిలో మసలుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలు. స్త్రీకి సహజ శారీరక ప్రక్రియ అయిన రుతుచక్రం గురించి తమ కూతురుకు వివరంగా చెప్పేంత చైతన్యం వారికి లేదు.
సిరిది ఆంధ్రప్రదేశ్ లోని మచ్చర గ్రామం. ఆ బాలిక కూడా రుతుక్రమం మొదలైనపుడు ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది. రుతుచక్రం గురించి, ఈ విషయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి తెలుసుకునే అవకాశాలు ఆమెకు లేకుండా పోయాయి. ఎందుకంటే ఈ విషయం గురించి ఇంట్లో అయినా, బయట అయినా బాహాటంగా మాట్లాడడం చాలా అరుదు. మన సమాజంలో బహిష్టు చుట్టూ ఇప్పటికీ మౌనం, అసౌకర్యం అలముకునే ఉన్నాయి.
కౌమార బాలికల చదువును, వారి ఆరోగ్యాన్ని, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాల్లో వారి రుతు ఆరోగ్యం ఒకటి. బాలికలు చాలా మందికి వారు పాఠశాలలో చదువుకునే వయసులో అంటే 10-11 ఏళ్ల నుండి 14-15 ఏళ్ల వరకూ రుతుస్రావం ప్రారంభమవుతుంది.
ఈ రుతుచక్రం మొదలయ్యాక కౌమార బాలికలు బడి మానేయకుండా ఉండడానికి, వారు చదువు కొనసాగించేలా చూడడానికి.. పాఠశాలల్లోని వాతావరణం, అక్కడ లభించే మద్దతు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షితమైన శానిటరీ ఉత్పత్తులు, అవగాహనా కార్యక్రమాలను అందించే పాఠశాలలు.. బాలికలు తమ శారీరక పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని గౌరవప్రదంగా చక్కబెట్టుకోవడానికి సహాయపడతాయి. తద్వారా వారు నిరాఘాటంగా చదువు కొనసాగించడానికి తోడ్పడతాయి.
ప్రస్తుతం భారతదేశంలోని 97.5% కంటే ఎక్కువ పాఠశాల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టుకు చెప్పింది. అలాగే, దేశంలో రుతు పరిశుభ్రత పద్ధతులు, పరిస్థితులు కొంత మెరుగు పడ్డట్లు గణాంకాలు చెప్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ప్రకారం.. శానిటరీ నాప్కిన్ల వాడకం 2015–16 (NFHS-4) లో 42% గా ఉండగా.. 2019–21 (NFHS-5) నాటికి 64% కి పెరిగింది.
అయితే, 15 నుండి 19 ఏళ్ల మధ్య వయసున్న కౌమార బాలికలలో దాదాపు సగం మంది ఇప్పటికీ పాత గుడ్డలు వాడడం వంటి అనారోగ్యకరమైన పద్ధతులనే పాటిస్తున్నారని NFHS-5 నివేదిక చెప్తోంది. స్థానికంగా సొంతంగా తయారుచేసుకునే నాప్కిన్లు కూడా “పరిశుభ్రమైన పద్ధతుల” విభాగంలో ఉన్నప్పటికీ, వాటిని సక్రమంగా శుభ్రం చేయడం, నిర్వహించడం వంటివి లేకపోతే వస్త్రాల వినియోగం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
బాలికల రుతు పరిశుభ్రత విషయంలో పట్టణ – గ్రామీణ పరిస్థితుల్లో స్పష్టమైన విభజన ఉన్నట్లు కూడా అదే NFHS-5 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో 90% కౌమార బాలికలు పరిశుభ్రమైన పద్ధతులను ఉపయోగిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 73% మాత్రమే అటువంటి పరిశుభ్రమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారు. బాలికల చదువు స్థాయి, ఆర్థిక శక్తి కూడా ఈ అంశంపై బలంగా ప్రభావం చూపుతున్నాయి.
అసలు చదువు లేని వారితో పోలిస్తే, సెకండరీ విద్య లేదా అంతకంటే ఎక్కువ చదువు పూర్తి చేసిన బాలికలు శానిటరీ నాప్కిన్లను ఉపయోగించే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది. అదేవిధంగా, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన బాలికలు, తక్కువ ఆదాయ వర్గంలో ఉన్నవారిలో శానిటరీ నాప్కిన్ల వాడకం చాలా తక్కువగా ఉంటోంది.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు…
రుతు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. కౌమార బాలికలలో అవగాహన పెంపొందించడం, వారికి నాణ్యమైన శానిటరీ నాప్కిన్లు అందేలా చూడడం లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2011 నుండి రుతు పరిశుభ్రత పథకాన్ని (మెనస్ట్రువల్ హైజీన్ స్కీమ్) అమలు చేస్తోంది. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద 2021-22లో దాదాపు 35 లక్షల మంది కౌమార బాలికలకు ప్రతి నెలా శానిటరీ న్యాప్కిన్ ప్యాక్ లు అందించినట్లు ప్రభుత్వ సమాచారం చెప్తోంది. అలాగే, దాదాపు 9,000 జన్ ఔషధి కేంద్రాలలో ‘సువిధ’ బ్రాండ్ పేరుతో కేవలం ఒక్క రూపాయి ధరకే శానిటరీ ప్యాడ్ లు అందుబాటులో ఉంచారు.
స్వచ్ఛ భారత్ అభియాన్, సమగ్ర శిక్ష వంటి ఇతర కార్యక్రమాల ద్వారా రుతు పరిశుభ్రతకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, విద్య అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచడానికి తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ రుతు పరిశుభ్రతపై జాతీయ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రాల్లో నిర్దిష్టంగా పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలకు సమగ్ర శిక్ష పథకం మద్దతు ఇస్తోంది.
ఈ పథకాలు అమలవుతున్నప్పటికీ, 2020 గణాంకాలను విశ్లేషించినపుడు.. మొదటి రుతుస్రావానికి ముందే రుతుచక్రం గురించి తెలుసుకున్న బాలికల సంఖ్య సంగం కంటే తక్కువేనని తేలుతోంది. బడికి వెళ్లే బాలికలకు రుతుచక్రం గురించి అవగాహన కల్పించగల ఉత్తమ వనరులు ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు. అయితే, వారి నుంచి బాలికలకు ఈ సమాచారం, అవగాహన అవసరమైనంత స్థాయిలో లభించడం లేదని విశ్లేషణ చెప్తోంది.
పాఠశాలలో మౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం కూడా సమస్యను జటిలం చేస్తోంది. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ 2023 డిసెంబర్ లో విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం.. పాఠశాల మరుగుదొడ్లలో నీరు, సబ్బు, చెత్త డబ్బాలతో పాటు.. తలుపులు లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు ఆ మరుగుదొడ్లను ఉపయోగించలేకపోతున్నారు. ఫలితంగా ఆ బాలికలు సంవత్సరానికి 60 రోజుల వరకు బడి మానేస్తున్నారని ఆ నివేదిక వెల్లడించింది.
ఈ నేపథ్యంలో, పాఠశాలలకు వెళ్లే బాలికల కోసం సమగ్ర రుతు పరిశుభ్రత విధానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం 2024 నవంబర్ లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. పాఠశాలల్లో రుతు విద్యను సమగ్రంగా రూపొందించి అమలు చేయడం, సంబంధిత ఉత్పత్తుల అందుబాటును మెరుగుపరచడం, ఉపయోగించిన ఉత్పత్తులను సురక్షితంగా పర్యావరణ హితంగా పారవేయడాన్ని ప్రోత్సహించడంపై ఈ జాతీయ విధానం దృష్టి పెడుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రెండూ పాఠశాలల్లో బాలికలు ఎదుర్కొంటున్న రుతు పరిశుభ్రతను పరిష్కరించడానికి పలు చర్యలు తీసుకున్నాయి. కానీ సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రుతు పరిశుభ్రత పథకం పరిధి క్రమంగా విస్తరించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2019–20 నుంచి 2023–24 మధ్య, రాష్ట్రంలో ఈ పథకం కింద సానిటరీ నాప్కిన్లు అందుకున్న బాలికల సంఖ్య సంవత్సరానికి 1.3 లక్షల నుండి 11.5 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 లక్షల మంది బాలికలకు ప్రతి నెలా 10 ఉచిత శానిటరీ నాప్కిన్లను అందించడానికి రాష్ట్రం 2021లో ’స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఆ ఏడాది తర్వాత ఈ పథకం సమర్థవంతంగా అమలు కాలేదని తెలుస్తోంది.
తెలంగాణ కూడా ఇలాంటి చర్యలు చేపట్టింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రభుత్వ విద్యా సంస్థలలో శానిటరీ నాప్కిన్లను పంపిణీ చేయడానికి 2022లో రూ. 69.5 కోట్లు కేటాయించారు. అలాగే 11 లక్షల మంది కౌమార బాలికలకు హెల్త్ కిట్లు పంపిణీ చేశారు. మరుసటి సంవత్సరానికి మరో 22 లక్షల కిట్లు పంపిణీ చేయడానికి ప్రణాళిక రచించారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV లు) కూడా రుతు పరిశుభ్రత కిట్లు, వాడినవాటిని పారవేయడానికి సరైన వ్యవస్థలు ఉన్నాయి.
కొనసాగుతున్న అంతరాలు
ప్రభుత్వ విధానాలు ప్రోత్సహకరంగా ఉన్నప్పటికీ, వాటి అమలు సక్రమంగా సాగడం లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చాటుతున్నాయి. పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్న క్రై – చైల్డ్ రైట్స్ అండ్ యు, ఆంధ్రప్రదేశ్ (అన్నమయ్య, తిరుపతి, కృష్ణ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు), తెలంగాణ (మేడ్చల్, ఖమ్మం జిల్లాలు) రాష్ట్రల్లో తన ప్రాజెక్టుల పరిధిలోని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో రుతు పరిశుభ్రత నిర్వహణను పరిశీలించింది. క్రై క్షేత్రస్థాయి భాగస్వామ్య సంస్థలతో కలిసి చేసిన ఈ పరిశీలనలో.. పాఠశాలల్లో రుతు పరిశుభ్రత విషయంలో చాలా లోటుపాట్లు కొనసాగుతున్నట్లు గుర్తించింది.
ఈ అధ్యయనం 109 పాఠశాలలు, హాస్టళ్లను పరిశీలించింది. వాటిలో 10 నుండి 18 సంవత్సరాల వయస్సు గల 18,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నప్పటికీ, వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగపడుతున్నాయని ఈ పరిశీలనలో వెల్లడైంది. ప్రత్యేకంగా బాలికల కోసం కేటాయించిన మరుగుదొడ్లు 370 ఉండగా.. నిర్వహణ సమస్యల కారణంగా 108 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. ఈ మరుగుదొడ్లను శుభ్రం చేసే కాలక్రమంలో కూడా చాలా తేడాలున్నాయి.
కొన్ని మరుగుదొడ్లను ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటే.. మరికొన్నిటిని వారానికొకసారి శుభ్రం చేస్తున్నారు. ఒక పాఠశాలలో మరుగుదొడ్లను అసలు ఎప్పుడూ శుభ్రం చేయలేదు. కేవలం 43 పాఠశాలల్లో మాత్రమే శానిటరీ న్యాప్కిన్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా 66 పాఠశాలల్లో ఎటువంటి న్యాప్కిన్లూ అందుబాటులో లేవు. చాలా పాఠశాల్లో ఇంతవరకూ శానిటరీ నాప్కిన్లను అందుబాటులోకే తీసుకురాలేదు. చాలా కొద్ది పాఠశాలలు అయితే నెలకోసారి లేదంటే వారానికోసారి ప్రాతిపదికన న్యాప్కిన్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఫలితంగా, చాలా మంది బాలికలు అపరిశుభ్రమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాల్సి రావడమో, లేదంటే రుతుస్రావం సమయంలో పూర్తిగా బడి మానేయాల్సి రావడమో జరుగుతోంది.
అవగాహన లేమి.. అవమాన భారం
రుతు పరిశుభ్రత సౌకర్యాల లోపం బాలికల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. వారి చదువును కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది. క్రై 2023 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, రుతుస్రావంలో ఉన్న ప్రతి ముగ్గురు బాలికలలో ఒకరు.. పాఠశాలలో సరైన మద్దతు లభించకపోవడం వల్ల ప్రతి నెలా ఒకటి నుండి నాలుగు రోజుల వరకు బడి మానేస్తున్నట్లు వెల్లడైంది. ఈ గైర్హాజర్లు ప్రతి నెలా పునరావృతం అవడం వల్ల.. వారి చదువు, నాణ్యత ప్రభావితమవుతున్నాయి. ఫలితంగా అటువంటి బాలికలు అసలు మొత్తానికే చదువు ఆపేయడం – డ్రాపవుట్ రేట్లు పెరుగుతాయి.
రుతుస్రావానికి సంబంధించి ఒక అవమానకరమైన భావన మరొక ప్రధాన అడ్డంకిగా కొనసాగుతూ ఉంది. క్రై అధ్యనంలో సర్వే చేసిన బాలికల్లో సగం మందికి పైగా బాలికలకు.. రుతుస్రావం ప్రారంభమవడానికి ముందుగా దాని గురించి ఏమీ తెలియదు. చాలా మంది బాలికలకు రుతుచక్రం గురించి మొదటి సమాచారం వారి తల్లులు, అక్కలు, లేదా స్నేహితుల ద్వారా తెలిసింది.
ఉపాధ్యాయుల నుండి లేదా ఆరోగ్య కార్యకర్తల నుండి ఈ సమాచారం మొదట తెలుసుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు. రుతుస్రావం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో కానీ, నలుగురు కలిసే దగ్గర కానీ ఉండడం ఇబ్బందికరంగా, అవమానకారంగా అనిపిస్తోందని 60% మంది బాలికలు చెప్పారు. ఈ అప్రకటిత మౌనం రుతుచక్రం గురించిన హానికరమైన అపోహలను బలోపేతం చేస్తుంది. బాలికలు సహాయం కోరకుండా ఉండేలా నిరోధిస్తుంది.
సామూహిక కృషి అవసరం
కౌమార బాలికలలో రుతుస్రావం గురించి, రుతు ఆరోగ్యం గురించి అవగాహన పెంచాల్సిన తక్షణ అవసరాన్ని ఈ అధ్యయనం చాటిచెప్తోంది. ఈ నేపథ్యంలో, CRY, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తన భాగస్వామ్య సంస్థల ద్వారా ఈ సవాళ్ల మీద దృష్టి సారించింది. వివిధ గ్రామాలలో కౌమార బాలికల సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా రుతు పరిశుభ్రత గురించి వారికి అవగాహన కల్పిస్తూ సాధికారం చేయడానికి కృషి చేస్తోంది. ఈ సంఘాలు బాలికలు రుతుస్రావం గురించి బహిరంగంగా చర్చించడానికి, సరైన మార్గదర్శకత్వం పొందడానికి, అవసరమైన ఆరోగ్య మద్దతును పొందడానికి సురక్షితమైన వేదికలుగా నిలుస్తాయి.
బాలికలు తమ శరీరాల గురించి తెలుసుకోవడానికి, అనుభవాలను పంచుకోవడానికి, మెరుగైన సదుపాయాలను కోరడానికి ఈ సంఘాలు ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు తన మొదటి రుతుచక్రంతో గందరగోళానికి గురైన నిత్య, కిశోర బాలికా సంఘంలో చేరింది. సరైన రుతు పరిశుభ్రత గురించి తెలుసుకుంది. తన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నదని గుర్తించి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, ఆరోగ్య సహాయం పొందింది.
ఇప్పుడు నిత్య తన గ్రామంలోని ఇతర బాలికలతో రుతుస్రావం, రుతు ఆరోగ్యం గురించి చర్చిస్తూ.. ఈ అంశం చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్న సిరి కూడా కిశోర బాలిక సంఘం ద్వారా తన సహచరులలో రుతు పరిశుభ్రత అవగాహనను పెంపొందిస్తోంది.
రుతుస్రావం అనేది కేవలం ‘మహిళలు లేదా బాలికల సమస్య’ అనే ఆలోచనా తీరు కూడా మారాలి. పురుషులు, బాలురు కూడా ఈ సంభాషణలో పాల్గొనాలి. ప్రణాళికా బద్ధంగా నిర్దిష్ట లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడం ద్వారా.. కౌమారదశలో ఉన్న బాలికల జీవితాలలో స్పష్టమైన సానుకూల మార్పు లభిస్తుందని క్రై క్షేత్రస్థాయి అనుభవాలు చెప్తున్నాయి. రుతు పరిశుభ్రత నిర్వహణలో సంక్లిష్టమైన అంతరాలను పరిష్కరించడంతో పాటు.. రుతుస్రావం చుట్టూ నెలకొన్న నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టడం.. బాలికలు సగౌరవంగా పాఠశాలకు హాజరు కావడానికి ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.
పాఠశాలలు, స్థానిక ప్రభుత్వాలు, పౌర సమాజాలు రుతు పరిశుభ్రత నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం, శానిటరీ న్యాప్కిన్లను క్రమం తప్పకుండా అందించడం, రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడుకునే సంస్కృతిని పెంపొందించడం ద్వారా.. నిత్య, సిరి వంటి బాలికలు వెనుకబడిపోకుండా చూసుకోవచ్చు.
రచయిత: జాన్ రాబర్ట్స్, రీజినల్ డైరెక్టర్,
క్రై – చైల్డ్ రైట్స్ అండ్ యు, సౌత్ రీజియన్