




Best Web Hosting Provider In India 2024

బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది..! ఇదేనా పార్టీని నడిపించడం…? ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు
పార్టీ అధినేత కేసీఆర్ కు తాను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె… పార్టీలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు తనపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. సొంత పార్టీ వాళ్లే ఓడించారని ఆరోపించారు. గురువారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె…. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదేనా పార్టీని నడిపించడం…?
“సొంత బిడ్డపై మీ ప్రతాపం ఏంటి…? బయట వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు..? ఇదేనా పార్టీని నడిపించడం…? సభను సక్సెస్ చేసింది కేసీఆర్ మాత్రమే. ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. గంపగుత్తగా బీజేపీకి అంట గట్టేలాగా వ్యవహారం చేస్తున్నారు. బీజేపీ కోవర్ట్లు మనదాంట్లో ఎవరు ఉన్నారు మరీ…?” అని కవిత ప్రశ్నించారు.
“నేను పదవి అడగలేదు… పైసలు అడగలేదు. వెన్నుపోటు రాజకీయం చేయను , చేయలేదు. ఎంపీగా పోటీ చేసినప్పుడు నాపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జాగృతిని సొంత డబ్బుతో నడిపిస్తున్నాను. వాళ్ళ డబ్బులు తీసుకోలేదు. నన్ను విమర్శించేవాళ్ళు కొందరు పెయిడ్ ఆర్టిస్ట్ లతో మాట్లాడిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవు..? ఇంకో నేతకు నోటీసులు వస్తే ఎందుకు హంగామా చేశారు..? లీక్ వీరులను బయట పెట్టకుండా గ్రీక్ వీరులలాగా ఎగిరిపడుతున్నారు. నేను వందల లెటర్స్ రాశా… అందులో తప్పేముంది…?” అని కవిత కామెంట్స్ చేశారు.
విలీనం చేయవద్దని చెప్పాను – కవిత
“ కొందరు కేసీఆర్ కింద ఉన్నవాళ్లు సరిగ్గా పనిచేయడం లేదు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని చూశారు… విలీనం చేయొద్దని చెప్పాను. మన పార్టీ నేతల కాలేజీలు కూలగొడుతుంటే ఏం చేస్తున్నారు ఈ నేతలు. దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుంటాం…. నీ మీద దాడులు చేస్తాం అంటే ఎలా..? అ తెలివి ప్రతిపక్ష పార్టీల పై చూపించండి. నా జోలికి వస్తే బాగుండదు. కేసిఆర్ ను మేమే నడిపిస్తున్నాం అని కార్టూన్లు వేసుకొని చెప్పుకుంటున్నారు. కెసిఆర్ నడిపించేంత పెద్దవాళ్ళ మీరు” అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు ఖండించలేదు…?
బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని కవిత ఆరోపించారు. “నేను జైలులో ఉన్నప్పుడు ఇదే జరిగింది.దూతలను పంపి రాయబారాలు పంపిస్తే ఏం లాభం…? నాపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు…? పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారు. నా డిమాండ్ ఒక్కటే… నా లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలి..?” అని కవిత స్పష్టం చేశారు.
“నన్ను పార్టీ నుంచి బయటకు పంపేంత సీన్ ఎవరికీ లేదు. మా నాయకుడు కేసీఆర్ మాత్రమే. బీఆర్ఎస్ అనేది నా పార్టీ. నేను ఇంకో 30 ఏళ్లు రాజకీయాల్లోనే ఉంటా. నేను అసలే మంచిదాన్ని కాదు… నేను నోరు తెరిస్తే బాగోదు” అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుంటే బీజేపీ ఇన్నిసార్లు గెలవదని కవిత వ్యాఖ్యానించారు. వాళ్ళ పరిస్థితే బాలేదన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా కవిత సమాధానాలిచ్చారు. కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు తారా స్థాయికి చేరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్