



Best Web Hosting Provider In India 2024

గులాబీ సైన్యంలో ‘కవిత’ ధిక్కార స్వరం..! ప్రశ్నాస్త్రాలు ఎవరిపై…?
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ బీఆర్ఎస్ లో చిచ్చు రేపుతున్నాయి. బీజేపీలో BRSను కలిపే కుట్ర చేస్తున్నారంటూ మాట్లాడుతున్న మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్విట్టర్ లో పోస్టులు చేస్తే సరిపోతుందా..? నిరసనలకు ఎందుకు పిలుపునివ్వలేదంటూ పార్టీ నాయకత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించారు.
బీఆర్ఎస్ పార్టీలో కవిత వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన సూటి ప్రశ్నలతో నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇదే సమయంలో తనది బీఆర్ఎస్ పార్టీ అని… మా నాయకుడు కేసీఆర్ అంటూ క్లియర్ కట్ గా చెప్పేస్తున్నారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన లక్ష్యమని చెప్పుకొస్తున్నారు. కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో… అసలు ఆమె ఎవర్నీ టార్గెట్ చేస్తున్నారు..? ఆమె టార్గెట్ ఏంటన్న ప్రశ్నల చుట్టు జోరుగా చర్చ జరుగుతోంది.
గురువారం బంజారాహిల్స్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత గురువారం మీడియాతో పలు అంశాలపై చిట్ చాట్ చేశారు. అధినాయకత్వాన్ని ఉద్దేశించి కొన్ని కీలక ప్రశ్నలను సంధించారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులిస్తే.. పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకుందని ప్రశ్నించారు. రాష్ట్రస్థాయిలో నిరసనలు చేపట్టవద్దా…? ట్విట్టర్ వేదికగా మేసేజ్ లు పెట్టి చేతులు దులుపుకొంటే బాగుంటుందా? అంటూ సూటిగా నిలదీశారు. అదే మరో నాయకుడికి నోటీసులొస్తే ఎందుకు అంత హంగామా చేశారు..? కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా కార్యకర్తలతో ఇంటి ఆడబిడ్డ మీద ఎటుపడితే అటు మాట్లాడిస్తే అది మర్యాదనా..? అని ప్రస్తావించారు.
మరోవైపు సోషల్ మీడియాలో తనపై వస్తున్న తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించలేదు…? అని కూడా కవిత ప్రశ్నించారు. పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో నన్ను టార్గెట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీ అధినేతకు రాసిన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలి..? అని డిమాండ్ చేశారు.
ఈ ప్రశ్నాస్త్రాలు ఎవరికి..?
కవిత లేఖ లీక్ ఎపిసోడ్ నుంచి తాజాగా జరుగుతున్న పరిణామాల వరకు… కవిత పార్టీ అధినాయకత్వాన్ని ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఎక్కడ కూడా పార్టీ అధినేత కేసీఆర్ ను విమర్శించలేదు. పైగా మా నాయకుడు కేసీఆర్ అని… ఆయనే తనకు బాస్ అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. అంటే కేసీఆర్ కాకుండా… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నారు. చాలా రోజులుగా అన్నీ తానై నడిపిస్తున్నారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియా వ్యవహారాలన్నీ కూడా ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నాయి. హరీశ్ రావు కూడా పార్టీలో కీలక నేతగా ఉన్నప్పటికీ…. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా ఆయనే డిసైడ్ చేస్తున్నారు.
ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే…. పార్టీ కార్యక్రమ వ్యవహారాలన్నీ చూస్తున్న కేటీఆర్ లక్ష్యంగానే కవిత పరోక్షంగా ప్రశ్నాస్త్రాలను సంధిస్తున్నారనే విశ్లేషణలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ కూడా పార్టీలోని కీలక నేతల పేర్లను కవిత ప్రస్తావించటం లేదు. కేవలం పార్టీ నాయకత్వమంటూ మాట్లాడుతున్నారు. పైగా కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించని కవిత… పార్టీ వ్యవహారాలను చూస్తున్న నేతలను సూటిగానే ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మరోవైపు కవిత పర్యటనల్లో ఎక్కడ లేకుండా బీఆర్ఎస్ జెండాలు దర్శనం ఇవ్వటం లేదు. ముఖ్య నేతలు కూడా ఆమె పర్యటనల్లో కనిపించటం లేదు. తాజాగా మంచిర్యాల జిల్లాలో పర్యటనలోనూ ఇవే సీన్లు రిపీట్ అయ్యాయి. మరోవైపు కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి ఎలాంటి యాక్షన్ కానీ… రియాక్షన్ కానీ లేదు. మొత్తంగా కవిత లేఖ లీక్ ఎపిసోడ్ తో పాటు ఆమె చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో…. కారు పార్టీలో కలహాలు తారాస్థాయికి చేరాయనే డిస్కషన్ జోరుగా జరుగుతోంది…!
సంబంధిత కథనం
టాపిక్