యాంటీ కమ్యూనల్ ఫోర్స్.. మతపరమైన ఘర్షణలు జరగకుండా ఈ ప్రభుత్వంలో కొత్త వింగ్

Best Web Hosting Provider In India 2024


యాంటీ కమ్యూనల్ ఫోర్స్.. మతపరమైన ఘర్షణలు జరగకుండా ఈ ప్రభుత్వంలో కొత్త వింగ్

Anand Sai HT Telugu

కర్ణాటకలో ఇటీవల మతపరమైన ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతమైన మంగళూరులో ఇటీవలి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కొత్తగా యాంటీ కమ్యూనల్ ఫోర్స్‌ను ప్రారంభించింది.

కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర

కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గలో పెరుగుతున్న మత ఉద్రిక్తతలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం యాంటీ కమ్యూనల్ ఫోర్స్‌ను ప్రారంభించింది. పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొనే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా యాంటీ కమ్యూనల్ ఫోర్స్ అని పిలిచే ఒక కొత్త ప్రత్యేక కార్యాచరణ వింగ్ ప్రారంభించింది. ఇది దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గ అనే మూడు మతపరమైన సున్నితమైన జిల్లాల్లో పనిచేస్తుంది.

కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తక్షణమే ఈ వింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ యూనిట్ మొదట ఎంపిక చేసిన జిల్లాల్లో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. అవసరమైతే మరింత విస్తరించడానికి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.

‘యాంటీ కమ్యూనల్ ఫోర్స్ నిర్మాణం, నాయకత్వం, కార్యాచరణ అధికారాలపై సమగ్రంగా చర్చించాం. ఇప్పుడు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయింది. పోలీసు డైరెక్టర్ జనరల్ అవసరమైన చర్యలను అమలు చేస్తారు.’ అని పరమేశ్వర చెప్పారు.

ప్రత్యేక ఫోర్స్

విద్వేషపూరిత హింసకు హాట్ స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో మతపరమైన సంఘటనలను పర్యవేక్షించడానికి, నిరోధించడానికి, ప్రతిస్పందించడానికి ప్రత్యేకంగా రూపొందించిన స్పెషల్ యాక్షన్ ఫోర్స్.. యాంటీ కమ్యూనల్ ఫోర్స్. ప్రత్యేక ఇంటెలిజెన్స్ వింగ్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్, సర్వైలెన్స్ యూనిట్లతో సహా టెక్నాలజీని ఈ టీమ్ కలిగి ఉంటుంది.

ఈ వింగ్ బాధ్యతలు

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విద్వేష ప్రసంగం, మతపరమైన అల్లర్లను రెచ్చగొట్టే కంటెంట్‌ను ట్రాక్ చేయడం. మతఘర్షణలను నివారించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు. రాడికలైజేషన్‌ను పర్యవేక్షించడం. బలహీన వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా చర్యలు తీసుకోవడం. మత ఘర్షణలు జరిగితే త్వరితగతిన బలగాల మోహరింపు

సిబ్బంది కేటాయింపు

ప్రస్తుతం ఉన్న యాంటీ నక్సల్ ఫోర్స్(ఏఎన్ఎఫ్) నుంచి కొత్త బలగాలను ఏర్పాటు చేసినట్లు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏఎన్‌ఎఫ్‌లో మంజూరైన 656 పోస్టుల్లో డీఐజీ ర్యాంకు అధికారి, డీఎస్పీ(సివిల్), అసిస్టెంట్ కమాండెంట్ సహా 248 మంది సిబ్బందిని ఈ కొత్త విభాగానికి కేటాయించారు. ఈ యూనిట్‌లో నలుగురు ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు, ఇతర సహాయక ర్యాంకుల అధికారులు ఉంటారు. ఉడిపి, శివమొగ్గ, దక్షిణ కన్నడలో ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.

సున్నితమైన ప్రాంతాలు

ఇటీవల మంగళూరులో హిందూ ఉద్యమకారుడు సుహాస్ శెట్టి హత్యతో చెలరేగిన మతపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో మతకల్లోలాలను అణచివేసేందుకు యాంటీ కమ్యూనలర్ ఫోర్స్ దళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గ, పరిసర ప్రాంతాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, తరచూ మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి పరమేశ్వర పేర్కొన్నారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link