




Best Web Hosting Provider In India 2024

‘యోగాంధ్ర’కు విశేష స్పందన…! కోటి మందికిపైగా పేర్లు నమోదు, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జూన్ 21 నాటికి 2 కోట్ల మంది భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టగా… ఇప్పటికే 1.13 కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారు. జూన్ 21వ తేదీన విశాఖ వేదికగా ప్రధాన కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రధాని మోదీ పాల్గొంటారు.
యోగాంధ్ర కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. భాగస్వాములయ్యేందుకు నమోదు చేసుకునే వారి సంఖ్య కోటికిపైగా దాటింది. నమోదు ప్రారంభించిన పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగానికి పైగా దాటినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
టార్గెట్ 2 కోట్లు…!
ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శుక్రవారం నాటికే ఇందులో పాల్గొనేందుకు కోటిమందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
కోటి దాటిన రిజిస్ట్రేషన్లు…
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజల నుంచి రోజురోజుకూ పెరుగుతున్న స్పందనతో మొదటి 10 రోజుల్లో కోటి మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్రలో 2 కోట్ల రిజిస్ట్రేషన్ల లక్ష్యానికి గాను…. శుక్రవారం రాత్రి నాటికి 1,13,47,935 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యోగాంధ్ర రాష్ట్ర నోడల్ అధికారి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం రాత్రి… మంత్రుల కమిటీకి నివేదించారు.
మే 21 నుంచి మే 30 వరకు మొదటి 10 రోజులకు 69,92,478 నమోదు చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్ణయించున్నారు. కానీ 162 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని కృష్ణబాబు నివేదించారు. ఈ కాలంలో మాస్టర్ ట్రైనర్ల నమోదు 408 శాతంగా ఉందన్నారు. శిక్షకుల నమోదు 113 శాతం మేర జరిగిందని వివరించారు. జిల్లా స్థాయిలో అధికారిక యంత్రాంగం ఎంతో కృషి చేస్తోందని… దీనికితోడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
జూన్ 21న మోదీ రాక…
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జరిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి:
యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా https://yogandhra.ap.gov.in/#/home/yoga-registration వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఇక్కడ ఫామ్ అందుబాటులో ఉంటుంది. మీ వివరాలను నమోదు చేయాలి. జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో ఎక్కడ పాల్గొంటారనేది సెలెక్ట్ చేయాలి. ఓటీపీ ప్రాసెస్ తర్వాత… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
టాపిక్