Best Web Hosting Provider In India 2024

తెలంగాణ సర్కార్ మరో కొత్త స్కీమ్ – ‘నేతన్నకు భరోసా’ మార్గదర్శకాలివే
‘తెలంగాణ నేతన్నకు భరోసా” పథకం మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం అందిస్తారు. గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 జమ చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త స్కీమ్ అమలుకు సిద్ధమైంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
ఈ స్కీమ్ అమలు కోసం 48.00 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సంవత్సరానికి 2 విడతలుగా నేత మరియు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందనుంది. ఈ స్కీమ్ కింద 40 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఈ స్కీమ్ కు సంబంధించి వివరాలను రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జూన్ 2వ తేదీన జారీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఇందుకోసం రూ.48.00 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.
మార్గదర్శకాలివే:
- ఈ పథకం ద్వారా జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం అందిస్తారు.
- గరిష్టంగా సంవత్సరానికి నేత కార్మికులకు రూ.18,000 మరియు అనుబంధ కార్మికులకు రూ.6,000 అందించడం జరుగుతుంది.
- ఈ స్కీమ్ కింద దాదాపు 40,000 మంది చేనేత మరియు అనుబంధ కార్మికులు లబ్ధి పొందుతారని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.
- చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు ప్రత్యేకంగా తయారుచేయబడిన యూనిక్ లోగోను జతచేయడం జరుగుతుందని వివరించారు. తద్వారా చేనేత ఉత్పత్తుల నాణ్యత ప్రమాణాలను మరియు నేత కార్మికుని వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చన్నారు.
- ఈ పథకం నేత మరియు అనుబంధ కార్మికులందరికీ వర్తిస్తుంది.
- 18 సంవత్సరాలు నిండి జియో ట్యాగ్ చేయబడిన మరమగ్గాలపై పనిచేసే కార్మికులు మరియు ప్రీలూమ్, ప్రిపరేటరి పనులైన డైయింగ్, టైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్ మొదలైన అనుబంధ పనులు చేసే కార్మికులు, చేనేత వృత్తి ద్వారా వారి వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం పొందుతున్నవారు అర్హులవుతారు.
- జియో ట్యాగ్ చేయబడిన మగ్గాల ద్వారా వార్పులలో కనీసం 50 శాతం కంటే ఎక్కువ పూర్తి చేసిన నేత మరియు అనుబంధ కార్మికులకు నేరుగా లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలోకి వేతన ప్రోత్సాహకాన్ని జమ చేస్తారు.
- సంవత్సరానికి రెండు విడతలుగా (ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మరియు అక్టోబర్ నుండి మార్చి) నేత కార్మికునికి రూ.9,000, అనుబంధ కార్మికునికి రూ.3,000 జమ చేస్తారు.
- మొదటి విడతలో 50 శాతం వార్పులు పూర్తి చేయనివారు, రెండో విడతలో పూర్తి చేసినట్లైతే… మొత్తం ప్రోత్సాహకం సంవత్సరాంతంలో అందిస్తారని మంత్రి తుమ్మల వివరించారు.