Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ – దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ల మార్పు..! ఎక్కడ తీసుకోవాలంటే..?
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్యదర్శన టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 6వ తేదీ నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. శ్రీవారి మెట్టువద్ద నుండి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా నిలిపివేసింది. శ్రీవారి మెట్టు వద్ద నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కి మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నూతన కౌంటర్లు శుక్రవారం సాయంత్రం నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది.
ఇదే అంశానికి సంబంధించి టీటీడీ ఈవో జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం అధికారులతో సమీక్షించారు. భక్తుల ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి….
- శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన వెళ్లే దివ్య దర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం భూదేవి కాంప్లెక్స లో తాత్కాలికంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
- జూన్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి టోకెన్లు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- టోకెన్ల లభ్యత మేరకు ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రారంభం కానుంది.
- ఆధార్ చూపించి దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని 1200వ మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలి.
- శనివారం శ్రీవారి దర్శనం నిమిత్తం శుక్రవారం సాయంత్రం దివ్య దర్శనం టోకెన్లు మంజూరు చేస్తారు.
- మరోపక్క ఎస్ ఎస్ డి టోకెన్లను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో వాటి కొరకు నిర్దేశించిన కౌంటర్లలో అందిస్తారు.
- భక్తుల రద్దీ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా టీటీడీ విజిలెన్స్ మరియు సెక్యూరిటీ, జిల్లా పోలీసులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.
పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలి – ఈవో ఆదేశాలు
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్ల జారీ ప్రక్రియ సజావుగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించడానికి అధికారుల బృందాన్ని నియమించనున్నారు. టోకెన్ కౌంటర్ల దగ్గర ఇబ్బంది లేని వాతావరణం ఉండేలా చూసుకోవాలని ఈవో ఆదేశించారు. టోకెన్ కౌంటర్ల తాత్కాలిక మార్పు అంశంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు . భక్తుల సౌకర్యార్థం పటిష్ట క్యూలైన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భక్తులకు అందించే అన్నప్రసాదాలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయా విభాగాధిపతులను టీటీడీ ఈవో సూచించారు. శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.