





Best Web Hosting Provider In India 2024

బక్రీద్ 2025: హజ్ యాత్ర ఎప్పుడు? దాని చరిత్ర, ప్రాముఖ్యత, ఆచారాలు తెలుసుకోండి
బక్రీద్ 2025: ఇస్లామిక్ క్యాలెండర్లో ఎంతో ముఖ్యమైన ధుల్ హిజ్జా నెల ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో చంద్రుడిని చూసిన తర్వాత అధికారికంగా ఈ నెల మొదలైంది. దీంతో హజ్ యాత్ర, ఈద్-ఉల్-అధా (బక్రీద్) తేదీలను కూడా ఖరారు చేశారు.
ఈద్-ఉల్-అధా 2025: ఇస్లామిక్ క్యాలెండర్లో ఎంతో ముఖ్యమైన ధుల్ హిజ్జా నెల ప్రారంభమైంది. సౌదీ అరేబియాలో చంద్రుడిని చూసిన తర్వాత అధికారికంగా ఈ నెల మొదలైంది. దీంతో హజ్ యాత్ర, ఈద్-ఉల్-అధా (బక్రీద్) తేదీలను కూడా ఖరారు చేశారు. ఈద్-ఉల్-అధాను బక్రా ఈద్, బక్రీద్, బఖ్రైడ్, ఈద్-ఉల్-జుహా, ఈద్ ఖుర్బాన్, ఖుర్బాన్ బయామి, లేదా త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇస్లాం మతం చెప్పే ఐదు స్తంభాలలో హజ్ ఒకటి. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఉన్న “అల్లాహ్ ఇల్లు”గా పిలిచే కాబాను సందర్శించడం ఈ హజ్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం.
శారీరకంగా, ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం మతం చెబుతుంది. హజ్ సమయంలో, ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింలు మక్కాలో గుమిగూడుతారు. ప్రవక్త ముహమ్మద్, ప్రవక్త ఇబ్రహీం (అబ్రహం) చేసిన త్యాగాలను స్మరించుకుంటూ కొన్ని ఆచారాలు పాటిస్తారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ముస్లింలందరికీ తమను తాము సమీక్షించుకోవడానికి, పశ్చాత్తాపపడటానికి, కులం, మతం, రంగుతో సంబంధం లేకుండా ఐక్యంగా ఉండటానికి ఒక అవకాశం.
హజ్ 2025 తేదీలు:
హజ్ యాత్ర ఇస్లామిక్ క్యాలెండర్లోని చివరి నెల అయిన ధుల్ హిజ్జాలో జరుగుతుంది. ముఖ్యంగా ధుల్ హిజ్జాలో 8వ రోజు నుండి 12వ రోజు వరకు ఈ యాత్ర ఉంటుంది. ఈ సంవత్సరం, హజ్ యాత్ర జూన్ 04, 2025 న మొదలవుతుంది. హజ్ యాత్రలో అత్యంత కీలకమైన ‘అరఫా దినం’ గురువారం, జూన్ 05, 2025 న వస్తుంది. ఆ తర్వాత, శుక్రవారం, జూన్ 06, 2025 న ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగ జరుపుకుంటారు.
చరిత్ర:
మక్కాలోని పవిత్ర కాబాను సందర్శించడంలో అద్భుతమైన చరిత్ర ఉంది. ఇది ప్రవక్త ఇబ్రహీం (అబ్రహం)తో మొదలైంది. అల్లాహ్ యొక్క ప్రియమైన స్నేహితుడు, ప్రవక్తల తండ్రి అయిన ఇబ్రహీంను తన భార్య హాజర్, కొడుకు ఇస్మాయిల్ను మక్కా ఎడారిలో వదిలివేయమని అల్లాహ్ ఆదేశించాడు.
ఇబ్రహీం తన కుటుంబాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, కాలక్రమేణా వారికి కష్టాలు ఎదురయ్యాయి. ఒక సందర్భంలో, హాజర్ సఫా, మార్వా కొండల మధ్య ఏడుసార్లు తిరిగినా నీటి జాడ దొరకలేదు. అయితే, ఆమె చిన్న కొడుకు ఇస్మాయిల్ తన కాలుతో నేలను రుద్దినప్పుడు, ఆ ప్రదేశంలో ఒక నీటి ఊట ఉద్భవించింది. ఆ స్థలాన్ని పవిత్రమైనదిగా గుర్తించారు. అల్లాహ్ ఇబ్రహీంను ఆ ప్రదేశంలో కాబాను నిర్మించమని, ప్రజలను అక్కడకు తీర్థయాత్రకు ఆహ్వానించమని ఆదేశించాడు.
అందుకే, కాబాను ఇస్లాంలో అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇది హజ్ యాత్రకు కేంద్ర బిందువు. హజ్ యొక్క మూలాలు ఇబ్రహీం యొక్క అచంచలమైన విశ్వాసం, అల్లాహ్ ఆదేశాలకు లొంగడానికి ఆయన సంసిద్ధతతో ముడిపడి ఉన్నాయి.
ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయిల్తో కలిసి కాబా పునాదులను నిర్మించారు. అల్లాహ్ను ఆరాధించడానికి ఒక ప్రదేశంగా దీన్ని నిర్మించారు. ఇబ్రహీం, ఇస్మాయిల్ ఆదేశించినట్లుగానే చేశారు. దేవదూత గాబ్రియేల్ నల్ల రాయిని (అది మొదట తెల్లగా ఉండేది, కానీ వేలాది మంది యాత్రికులు ముద్దుపెట్టుకొని, తాకడం ద్వారా అది నల్లగా మారింది) స్వర్గం నుండి కాబాకు అటాచ్ చేయడానికి తీసుకువచ్చాడని ఖురాన్ కూడా వివరిస్తుంది.
కాలక్రమేణా, ఈ యాత్ర అరేబియా ద్వీపకల్పంలోని అరబ్ తెగల ముఖ్యమైన వార్షిక సమావేశంగా మారింది. అయితే, హజ్తో అనుబంధం ఉన్న ఆచారాలను 7వ శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ సంస్కరించి, పునరుద్ధరించారు. ముహమ్మద్ కాలంలో, ఇస్లాం పూర్వ హజ్తో సంబంధం ఉన్న అన్యమత ఆచారాలు, విగ్రహారాధన తొలగించారు. ఈ తీర్థయాత్రను దాని అసలు ఏకదైవ ప్రయోజనానికి తిరిగి పునరుద్ధరించారు.
ఇస్లాం పూర్వ అరేబియా “జాహిలియ్య” కాలంలో, కాబా చుట్టూ కొన్ని అన్యమత విగ్రహాలను ఉంచారు. కానీ క్రీ.శ. 630 లో, ప్రవక్త ముహమ్మద్ (PBUH) మదీనా నుండి మక్కాకు విశ్వాసులను నడిపించి, అన్ని అన్యమత విగ్రహాలను తొలగించారు. ఆయనను ఇస్లాంలో చివరి ప్రవక్తగా పరిగణిస్తారు. కాబాను శుద్ధి చేసిన తర్వాత, ఆయన ఆ భవనాన్ని అల్లాహ్కు తిరిగి పవిత్రం చేశారు.
ముహమ్మద్ క్రీ.శ. 632 లో హజ్ తీర్థయాత్ర చేశారు. అరఫా మైదానంలో గుమిగూడిన వేలాది మంది ముస్లింలకు తన ప్రసిద్ధ వీడ్కోలు ఉపన్యాసం ఇచ్చారు. అలా హజ్ ఇస్లాం ఐదు స్తంభాలలో ఒకటిగా మారింది. ముహమ్మద్ ఉదాహరణను అనుసరించి, హజ్ యొక్క ఆచారాలు ప్రమాణీకరించారు. అది ముస్లింలు అందరికి తప్పనిసరి ఆరాధన చర్యగా మారింది.
హజ్ ప్రాముఖ్యత:
హజ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలను కులం, సంస్కృతి, రంగుతో సంబంధం లేకుండా ఐక్యత, సోదరభావంతో ఒకచోట చేర్చడానికి సహాయపడుతుంది. ఇది సమానత్వానికి గొప్ప నిదర్శనం. హజ్ ఆచారాలను నిజంగా, స్వచ్ఛతతో ఎవరు పాటిస్తారో, వారు తమ జీవితకాల పాపాలను కడుక్కుని ఇంటికి తిరిగి వస్తారని నమ్ముతారు.
ఈ వార్షిక తీర్థయాత్ర సమానత్వాన్ని మాత్రమే కాకుండా, నిబద్ధతలను సరిగ్గా పాటిస్తే, మరణానంతరం యాత్రికులకు స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇది దయ, సానుకూలతకు ప్రతీక. ప్రవక్త ఇబ్రహీం అల్లాహ్కు చేసిన త్యాగాలు, విధేయతను మళ్ళీ గుర్తు చేసుకోవడం ద్వారా ఇది అత్యున్నత గౌరవాన్ని పొందుతుంది. ఈ యాత్ర విశ్వాసం, భక్తి, ఐక్యత యొక్క వివిధ అంశాలను సూచించే వరుసగా నిర్దేశించిన చర్యలు, ఆచారాలను కలిగి ఉంటుంది. చరిత్ర అంతటా, హజ్ తీర్థయాత్రలో యాత్రికుల సంఖ్య, నిర్వహణ స్థాయిలో హెచ్చుతగ్గులు కనిపించాయి.
అరేబియా ద్వీపకల్పం వెలుపల ఇస్లాం విస్తరించడం వల్ల ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ముస్లింలు హజ్లో పాల్గొంటున్నారు. విభిన్న నేపథ్యాలు, దేశాల నుండి లక్షలాది మంది ముస్లింలు ప్రతి సంవత్సరం హజ్ తీర్థయాత్రను చేస్తారు.
సౌదీ అరేబియా ప్రభుత్వం, మత అధికారులు సహకారంతో, యాత్రికుల భద్రత, సౌకర్యం, శ్రేయస్సు కోసం తీర్థయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. సందర్శనను సులభతరం చేస్తుంది. హజ్ ముస్లింలకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రయాణంగా మిగిలిపోయింది. ఇది ఐక్యత, వినయం, అల్లాహ్పై భక్తిని ప్రోత్సహిస్తుంది.
ముస్లింలు ప్రవక్త ఇబ్రహీం, ఇస్లాం సూత్రాలపై తమ నిబద్ధతతో పంచుకున్న వారసత్వం, సాధారణ బంధం యొక్క లోతైన జ్ఞాపకంగా ఇది పనిచేస్తుంది.
హజ్ ఆచారాలు
ఇహ్రామ్: యాత్రికులు ఇహ్రామ్ అనే పవిత్ర స్థితిలోకి ప్రవేశిస్తారు. వారు సాధారణ తెల్లటి వస్త్రాలను ధరిస్తారు. ఇది సమానత్వం, ప్రాపంచిక విషయాలను త్యజించడాన్ని సూచిస్తుంది.
తవాఫ్: యాత్రికులు మస్జిద్ అల్-హరామ్ మధ్యలో ఉన్న పవిత్ర నల్లటి నిర్మాణం అయిన కాబా చుట్టూ వరుసగా ప్రదక్షిణలు చేస్తారు. ఈ చర్య ముస్లింల ఐక్యత, అల్లాహ్పై వారి భక్తిని సూచిస్తుంది.
సా’యి: యాత్రికులు సఫా, మార్వా కొండల మధ్య నడుస్తారు, ఇబ్రహీం భార్య హాజర్ (హాగర్) తన కొడుకు ఇస్మాయిల్ (ఇష్మాయిల్) కోసం నీళ్లను వెతికిన మార్గాన్ని అనుసరిస్తారు. ఇది పట్టుదల, అల్లాహ్ అనుగ్రహంపై నమ్మకాన్ని సూచిస్తుంది.
అరఫా: యాత్రికులు అరఫా మైదానంలో గుమిగూడి, ప్రార్థన, అభ్యర్థన, ధ్యానంలో నిమగ్నమవుతారు. దీనిని హజ్లో అత్యంత కీలకమైన రోజుగా పరిగణిస్తారు. దీనిని అరఫా దినం అని పిలుస్తారు.
ముజ్దలిఫా, మినా: యాత్రికులు ముజ్దలిఫాలో రాత్రి గడుపుతారు. తదుపరి ఆచారం కోసం గులకరాళ్లను సేకరిస్తారు. వారు మినాకు వెళతారు. అక్కడ మూడు రాతి స్తంభాలపై గులకరాళ్లను విసిరి దెయ్యాన్ని రాళ్లతో కొట్టడం అనే ప్రతీకాత్మక చర్యను చేస్తారు.
ఈద్ అల్-అధా: హజ్ యొక్క పరాకాష్ట ఈద్ అల్-అధా, త్యాగాల పండుగ వేడుకతో గుర్తిస్తారు. యాత్రికులు ఒక జంతువును, సాధారణంగా గొర్రె లేదా మేకను బలి ఇస్తారు. ఇది ఇబ్రహీం తన కొడుకును త్యాగం చేయడానికి సంసిద్ధతను సూచిస్తుంది.
విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు, భాషల నుండి ముస్లింలను ఏకం చేస్తూ, హజ్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సమానత్వం, వినయం, అల్లాహ్పై భక్తి సూత్రాలను బలపరుస్తుంది. యాత్రికులు క్షమాపణ, ఆధ్యాత్మిక శుద్ధీకరణ, తమ విశ్వాసంతో లోతైన సంబంధాన్ని కోరుకుంటారు. ఇది జీవితకాల అనుభవం. దీనిని చేసే వారి హృదయాలు, మనస్సులపై ఇది శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది.