‘వెన్నుపోటు దినం’ విజయవంతం: కూటమి పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది – సజ్జల

Best Web Hosting Provider In India 2024

‘వెన్నుపోటు దినం’ విజయవంతం: కూటమి పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది – సజ్జల

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైందని వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి

ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను మోసం చేసిందని, దీనిని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ఇచ్చిన ‘వెన్నుపోటు దినం’ పిలుపునకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ఈ శాంతియుత ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని, పలువురు పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్‌ల పేరుతో వేధించిందని ఆయన మండిపడ్డారు. ఏడాది పాలనపై ప్రజల్లోని తీవ్ర వ్యతిరేకతను ఈ ‘వెన్నుపోటు దినం’ చాటిందని సజ్జల స్పష్టం చేశారు.

చంద్రబాబుపై సజ్జల విమర్శలు:

చంద్రబాబు మూడు పార్టీలను కూడగట్టుకుని, అమలు చేయలేని హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చారని సజ్జల విమర్శించారు. ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టుకుందని, దీనికి ఈ నిరసన ర్యాలీలే నిదర్శనమని ఆయన అన్నారు. 2019లో టీడీపీ ఇదే పరిస్థితిని ఎదుర్కొందని, అప్పుడు వైఎస్సార్‌సీపీ ఒంటరిగా పోటీ చేసి 151 సీట్లు గెలుచుకుందని గుర్తు చేశారు.

ప్రజల్లోనే వైఎస్సార్‌సీపీ:

2024 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ, వైఎస్సార్‌సీపీ ప్రజలకు దూరం కాలేదని సజ్జల అన్నారు. ఓటమి నుంచి బయటపడి ప్రజల పక్షాన బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిలబడిందని, ఈ తేడాను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ స్థాపించినప్పటి నుంచి ప్రజల్లోనే ఉందని, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసిందని, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పని చేసిందని, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు దూరం కాలేదని అందుకే ఈ ‘వెన్నుపోటు దినం’కు ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చిందని ఆయన అన్నారు.

హామీలను గాలికి వదిలేశారు:

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసిందని సజ్జల ఆరోపించారు. బాండ్ పేపర్‌పై రాసి, సంతకాలు చేసి ప్రతి ఇంటికీ పంచిన హామీలను, బకాయిలతో సహా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి, లక్షలాది మంది రైతులకు, పెన్షనర్లకు, విద్యార్థులకు ఇస్తామన్న పథకాలను చేరువ చేయాలని కోరారు. ఇప్పటికే ఏడాదిలోనే నాలుగు లక్షల పెన్షన్లు రద్దు చేశారని, మిగిలిన పథకాల అమలు ఎప్పుడో తెలియదని విమర్శించారు.

అప్పులపై లెక్కలు లేవు:

చంద్రబాబు ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లు అప్పులు చేసిందని, ఈ సొమ్మును ఏం చేస్తున్నారో తెలియదని సజ్జల ప్రశ్నించారు. వై.ఎస్. జగన్ హయాంలో తెచ్చిన అప్పులు ఏ పథకాల కింద ప్రజలకు ఎలా పంపిణీ అయ్యాయో స్పష్టమైన లెక్కలు ఉన్నాయని, కానీ చంద్రబాబు హయాంలో అలాంటి లెక్కలు లేవని విమర్శించారు. ఈ విషయంపై కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.

నిరసనలపై ప్రభుత్వ ఆంక్షలు:

శాంతియుత నిరసనలకు కూడా కూటమి ప్రభుత్వం అనేక ఆటంకాలు కల్పించిందని సజ్జల దుయ్యబట్టారు. ర్యాలీలు ఎలా చేయాలి, ఎక్కడి నుంచి చేయాలో కూడా పోలీసులే నిర్దేశిస్తున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును ఇంట్లోంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకుని దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని, దానిని అడ్డుకునే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

పండగ చేసుకునే పరిస్థితి లేదు:

సంక్రాంతి, ఉగాది, దీపావళిని కలిపి ఈ రోజు జరుపుకోవాల్సిన సందర్భం ఇది అని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని, ప్రజలు అంత సంతోషంగా ఉంటే ప్రజల్లోకి వెళ్లి సంబరాలు జరుపుకోవాలని సజ్జల సవాలు విసిరారు. రేషన్ షాపుల వద్దకు వెళ్ళి చూస్తే వృద్ధులు, వికలాంగులు నిత్యావసర వస్తువుల కోసం ఎలా క్యూలైన్లలో నిలబడి ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, పేదలు ఉండే ప్రాంతాల వద్దకు వెళ్లి పండుగ జరుపుకుందామని పిలుపు ఇవ్వాలని, ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారో తెలుస్తుందని ఆయన కూటమి పార్టీలకు సూచించారు. పండుగ చేసుకునే పరిస్థితి లేదని కూటమి పార్టీలకు కూడా తెలుసని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలు దానిని ఆమోదించడం చూసి జీర్ణించుకోలేకపోతున్నారని సజ్జల అన్నారు.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

టాపిక్

Sajjala Ramakrishna ReddyYsrcp
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024