



Best Web Hosting Provider In India 2024

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వ బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని ఆయన బుధవారం తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు.
త్వరలో పరిష్కారం, క్యాబినెట్కు నివేదిక:
ఉద్యోగుల సమస్యలపై త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ కమిటీకి సూచించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన త్రీమెన్ కమిటీ ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమై వారి విజ్ఞప్తులను స్వీకరించిందని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిల వల్ల అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించడం సాధ్యం కాదని, అయితే ఇకపై ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకుండా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ప్రభుత్వ ఆలోచన అని భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాలకు వివరించారు.
ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యం:
గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశానికి ముందు, అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించిందని డిప్యూటీ సీఎం అన్నారు. ఉద్యోగులను ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములుగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు చేయాల్సిన పనులు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలు వంటి అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు.
ప్రజలకు, ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా, అందరితో కలిసి కూర్చుని చర్చించి ముందుకు పోవాలనే ఉద్దేశ్యంతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో భేటీ అయినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నా ఉద్యోగులకు మేలు:
గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఉద్యోగులకు సాధ్యమైనంత మేర మేలు చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని తమ ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం రాగానే మొదటి తేదీనే జీతాలు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, కొత్త పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. వీటికి తోడు ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలనే తపనతో ప్రజా ప్రభుత్వం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
సంక్షేమం కోసం ఆర్థిక కసరత్తు:
ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం కూడా పడకుండా వనరులు సమకూర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని, అదే సమయంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ కసరత్తు విజయవంతం కావాలని “మనసున్న ప్రభుత్వం” కోరుకుంటుందని అన్నారు. ఉద్యోగులకు మంచి చేయాలనే ఆలోచనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ:
ప్రభుత్వ ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకొని, ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలంగా ఉన్నారని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రి ఖర్చులకు సంబంధించిన సమస్యలపై తమ క్యాబినెట్ సహచరులు అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నారని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే అంశంపై ఎవరికీ భిన్నాభిప్రాయం లేదని తెలిపారు.
రేపు క్యాబినెట్ భేటీలో కీలక నివేదిక:
గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో, ఉద్యోగ సంఘాల సమస్యలపై ఏర్పాటు చేసిన అధికారుల త్రీ మెన్ కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందించి క్యాబినెట్కు సమర్పిస్తామని, పరిష్కారం కనుగొంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు.
ఈ సమావేశంలో అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్, సందీప్ కుమార్ సుల్తానియా, మహేష్ దత్ ఎక్కా తదితరులు పాల్గొన్నారు.
టాపిక్