




Best Web Hosting Provider In India 2024
మేఘాలయలో దంపతుల మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్- హనీమూన్లో భర్తను చంపించిన భార్య..
మేఘాలయలో హనీమూన్కి వెళ్లి అదృశ్యమైన దంపతుల కేసులో పెద్ద ట్విస్ట్! భర్తను భార్యే చంపించిందని తాజాగా తేలింది. ఈ మేరకు కిల్లర్లతో పాటు ఆ మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయలో దంపతుల మిస్సింగ్ కేసు పెద్ద యూ- టర్న్ తీసుకుంది! మధ్యప్రదేశ్ నుంచి దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారని ఇంతకాలం భావించగా.. భర్యే భర్తను చంపించిందని తాజాగా తేలింది. ఈ మేరకు ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్ల చేత భర్తను చంపించిన మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది..
రాజ రఘువంశి, అతని భార్య సోనమ్లు మే నెలలో హనీమూన్కి వెళ్లారు. కానీ వారిద్దరు చివరిసారిగా మే 23న కనిపించారు. ఆ తర్వాత మాయమైపోయారు. అదృశ్యమైన దంపతుల కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ దాదాపు వారం రోజుల పాటు వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో జూన్ 2న రాజ మృతదేహం చిరాపుంజికి సమీపంలోని ఒక లోయలో కనిపించింది. సోనమ్ జాడను మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు.
కాగా సోనమ్ కిడ్నాప్ అయ్యుండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
కానీ ఈ కేసు గత శనివారం కీలక మలుపు తిరిగింది. సోహ్రా ప్రాంతంలో రాజ రఘువంశి, అతని భార్య సోనమ్లను కొందరు పురుషులతో చూసినట్టు ఓ టూరిస్ట్ గైడ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మే 23 ఉదయం 10 గంటల సమయంలో ఆ ఐదుగురు నాన్గ్రియట్ నుంచి మాల్వఖైట్కి వెళుతున్నప్పుడు చూశానని వివరించాడు.
“నలుగురు పురుషులు ముందుకు నడుస్తుండగా, సోనమ్ వెనక ఉండటాన్ని నేను చూశాను. ఆ నలుగురు హిందీలో మాట్లాడుకుంటున్నారు. కానీ వారు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు. ఆ ముందు రోజే నేను వారికి టూరిస్ట్ సేవలను అందించడానికి సంప్రదించాను. అందుకే వారు నాకు బాగా గుర్తున్నారు,” అని ఆ టూరిస్ట్ చెప్పుకొచ్చాడు.
ఈ మేరకు ఆ గైడ్ పోలీసుల వద్ద తన స్టేట్మెంట్ని ఇచ్చాడు.
గైడ్ ఇచ్చిన వివరాలతో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ముగ్గురు కిల్లర్లను (ఒకరిని యూపీ నుంచి, ఇద్దరిని ఇండోర్ నుంచి) అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.
“రాజ రఘువంశీ భార్య సోనమ్.. అతడిని చంపేందుకు మాకు డబ్బులు ఇచ్చింది,” అని కిల్లర్లు చెప్పారు.
ఆ తర్వాత.. సోనమ్ స్వచ్ఛందంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. మరో కిల్లర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
భర్తను ఆ మహిళ ఎందుకు చంపాలని భావించింది? వంటి వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.
‘సీబీఐ దర్యాప్తు కావాలి..’
రాజ రఘువంశి హత్యలో భార్య సోనమ్ పాత్ర వెలుగులోకి రాకముందు.. ఈ పూర్తి వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని రాజా రఘువంశి కుటుంబసభ్యులు ఇటీవలే పరధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
“ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ప్రధాని మోదీకి లేఖ రాశాము. ప్రధానితో పాటు సీఎం మాకు మద్దతివ్వాలని కోరుకుంటున్నాము. సీబీఐ దర్యాప్తును కోరుకుంటున్నాము. అప్పుడే రాజకు న్యాయం జరుగుతుంది,” అని రాజ సోదరుడు మీడియాకు చెప్పాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link