


Best Web Hosting Provider In India 2024
కాళేశ్వరంపై విచారణకు హాజరైన హరీష్.. ఆధారాలతో సహా సమాధానాలు ఇచ్చానన్న మాజీ మంత్రి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ అడిగిన 20 ప్రధాన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలన్నింటికీ హరీష్ రావు పూర్తి ఆధారాలతో సహా సమాధానాలు సమర్పించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ విచారణలో కమిషన్ ఛైర్మన్ అడిగిన 20 ప్రధాన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలన్నింటికీ హరీష్ రావు పూర్తి ఆధారాలతో సహా సమాధానాలు సమర్పించారు. హరీష్ రావు ఇచ్చిన వివరణలకు కమిషన్ ఛైర్మన్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విచారణలో కీలకాంశాలు, హరీష్ రావు వివరణలు:
1. తమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ మార్పుపై:
కమిషన్ అడిగిన మొదటి ముఖ్యమైన ప్రశ్న తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని ఎందుకు మార్చారనే దానిపైనే ఎక్కువసేపు చర్చ జరిగింది. దీనిపై హరీష్ రావు సమగ్ర వివరణ ఇచ్చారు.
“తెలంగాణ కొత్తగా ఏర్పడిన తర్వాత, తమ్మిడిహట్టి వద్దే ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును 7 ప్యాకేజీలు, 27 భాగాలుగా టెండర్లు పిలిచి, తల పనులు మొదలుపెట్టకుండా తోక పనులను తవ్వింది” అని హరీశ్ రావు కమిషన్కు తెలిపారు.
“తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే నేను మహారాష్ట్ర కాంగ్రెస్ నీటిపారుదల శాఖ మంత్రి హసన్ ముష్రఫ్ గారిని కలిసి, తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరాను. అయితే, హసన్ ముష్రఫ్ ‘చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసనలు చేస్తున్నారు. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మేం ఒప్పుకోం’ అని తేల్చి చెప్పారు. ఇదే విషయాన్ని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ కూడా ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం.” అని కమిషన్ ముందు వివరించినట్టు హరీష్ రావు చెప్పారు.
తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఐదారు సమావేశాలు జరిగాయని హరీష్ రావు వివరించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చాక కూడా, అప్పటి నీటిపారుదల మంత్రిని కలిసి తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కేసీఆర్ కోరారని తెలిపారు. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర వచ్చి, అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ను కలిసినప్పటికీ ఫలితం లేకపోయిందని హరీష్ రావు వివరించారు.
“ఏడేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా సాధించలేదు. ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదు. తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు” అని హరీష్ రావు విమర్శించారు.
2. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనలు:
సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసిందని హరీష్ రావు కమిషన్కు చూపారు. అదేవిధంగా, CWC తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదని, సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసిందని తెలిపారు.
ఈ క్రమంలోనే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్ను బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని ఎంపిక చేయాలని కేసీఆర్ కోరారని, వాప్కోస్ లాడార్ సర్వే చేసి, పరిశీలించి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉందని, అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపిందని హరీష్ రావు వివరించారు. వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచనల మేరకే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందని, దీనికి అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడాల్సి వస్తుందని ఆయన గుర్తు చేశారు. “నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్టు ప్రతిపాదిస్తే, నీళ్లు ఉన్నచోట బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిపాదించింది” అని హరీష్ రావు అన్నారు. ఈ అంశాలకు సంబంధించిన అన్ని ఆధారాలు – మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు – అన్నీ కమిషన్కు సమర్పించినట్లు చెప్పారు.
3. కాళేశ్వరం కార్పొరేషన్ అనుమతిపై:
కాళేశ్వరం కార్పొరేషన్కు స్పష్టమైన అనుమతి ఉందని అన్ని ఆధారాలతో కమిషన్కు సమర్పించినట్లు హరీష్ రావు తెలిపారు.
4. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోకేషన్ మార్పులపై:
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోకేషన్ మార్పు పూర్తిగా సాంకేతిక నిర్ణయమని, ఇంజనీర్ల సమగ్ర సర్వే ఆధారంగానే బ్యారేజ్ లోకేషన్ మారిందని హరీష్ రావు వివరించారు. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయమని, దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుందని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్కు సమర్పించినట్లు చెప్పారు.
5. ప్రాజెక్టులో రిజర్వాయర్ల కెపాసిటీపై:
ప్రాజెక్టులో 141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించామని హరీష్ రావు తెలిపారు.
కాళేశ్వరంపై దుష్ప్రచారం: హరీష్ రావు స్పష్టీకరణ
కాళేశ్వరంపై “పిచ్చికూతలు కూస్తూ కూలేశ్వరం” అని మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయని, అవన్నీ చెక్కుచెదరలేదని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో:
3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం… ఇవన్నీ పూర్తిగా చెక్కుచెదరలేదని హరీష్ రావు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఈ ప్రాజెక్టుకు నీళ్లు మల్లన్నసాగర్ నుంచే పోతాయని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమని నొక్కి చెప్పారు. హైదరాబాద్ మూసీ సుందరీకరణకు మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తరలిస్తామని చెబుతున్నారని, హైదరాబాద్కు తాగునీటిని మల్లన్నసాగర్ నుంచే ఇస్తామంటున్నారని, అదంతా కాళేశ్వరంలో భాగం కాదా అని ప్రశ్నించారు. “మల్లన్నసాగర్పై ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేస్తారు. మరో పక్క కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తారు” అని హరీష్ రావు మండిపడ్డారు.
“కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది” అని ఆయన అన్నారు. కమిషన్ ముందు తాను ఏదీ నోటి మాటగా చెప్పలేదని, అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించినట్లు, క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు.
మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు:
బీఆర్కే భవన్ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. “ఈరోజు కాళేశ్వరం కమిషన్ విచారణలో భాగంగా నన్ను పిలిచారు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెపా్పను. ఆధారాలతో సమాధానాలను కమిషన్కు అందించాం. కమిషన్ విచారణకు హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదు. రాజకీయాలు ఏమైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం తప్పు అవుతుంది” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
టాపిక్