





Best Web Hosting Provider In India 2024

గుడ్ న్యూస్.. వారం ముందుగానే ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ నాలుగో సీజన్.. కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదే
అమెజాన్ ప్రైమ్ వీడియోలోని సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ నాలుగో సీజన్ అనుకున్నదాని కంటే వారం ముందుగానే వచ్చేస్తోంది. తాజాగా బుధవారం (జూన్ 11) ట్రైలర్ రిలీజ్ చేస్తూ కొత్త స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేసింది.
ఇండియన్ ఓటీటీలో అత్యుత్తమ వెబ్ సిరీస్ లలో ఒకటి పంచాయత్ (Panchayat). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ ఈ నెలలోనే వచ్చేస్తోంది. మొదట జులై 2 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు వెల్లడించిన ప్రైమ్ వీడియో.. ప్రేక్షకుల వేసిన ఓట్ల మేరకు వారం ముందుగానే తీసుకురానుండటం విశేషం.
పంచాయత్ సీజన్ 4 ఓటీటీ రిలీజ్ డేట్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పంచాయత్‘ సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ వీడియోలో తిరిగి రాబోతోంది. ఈ కొత్త సీజన్ లో మంజు దేవి (నీనా గుప్తా), క్రాంతి దేవి (సునీత రాజ్వర్) మధ్య ఎన్నికల పోరు జరగబోతోంది. ఈ సరికొత్త సీజన్ జూన్ 24 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రైమ్ వీడియో తెలిపింది. కొత్త స్ట్రీమింగ్ తేదీతోపాటు ట్రైలర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
కొన్ని రోజుల కిందట తమకు ఓటు వేస్తే సీజన్ 4ను జులై 2 కంటే ముందే తీసుకొస్తామని మంజు దేవి, క్రాంతి దేవి ఓ ఫన్నీ వీడియో ద్వారా చెప్పినట్లే.. ఇప్పుడు చేశారు. జులై 2న కాదు జూన్ 24నే వస్తుందని తెలిపారు.
ఫన్నీగా ట్రైలర్
పంచాయత్ సీజన్ 4 ట్రైలర్ కూడా చాలా ఫన్నీగా సాగిపోయింది. ఈ కొత్త సీజన్ మొత్తం ఎన్నికల సమరం సాగనుంది. ఫులేరా ఊరికి కొత్త సర్పంచ్ వచ్చే సమయం దగ్గర పడింది. మంజు దేవి మరోసారి సర్పంచ్ కావాలని చూస్తుండగా.. ఆమె ప్రత్యర్థి క్రాంతి దేవి కూడా గట్టిగానే ప్రచారం చేయడం ఇందులో చూడొచ్చు. ఓటర్లను ఆకర్షించడానికి ఈ ఇరు వర్గాలు ఎన్నో ప్రయత్నాలు చేయడం, ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంలాంటివి కూడా ఈ కొత్త సీజన్లో ఉండబోతున్నాయి. వాళ్ల మధ్య పంచాయతీ కార్యదర్శిగా ఉన్న అభిషేక్ త్రిపాఠీ (జితేంద్ర కుమార్) భవిష్యత్తు ఏం కాబోతుందన్నది కూడా ఈ కొత్త సీజన్లోనే తేలనుంది.
ఈ 4వ సీజన్ నటీనటులలో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్, గ్రామ ప్రధాన్ మంజు దేవిగా నీనా గుప్తా, ప్రధాన్ భర్తగా రఘుబీర్ యాదవ్, ప్రహ్లాద్చంద్ “ప్రహ్లాద్” పాండేగా ఫైసల్ మాలిక్, వికాస్గా చందన్ రాయ్, రింకీగా సన్వికా, భూషణ్గా దుర్గేష్ కుమార్, క్రాంతి దేవిగా సునీత రాజ్వర్, ఎమ్మెల్యే చంద్ర కిషోర్ సింగ్గా పంకజ్ ఝా నటిస్తున్నారు.
ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) నిర్మించిన ‘పంచాయత్’ సీజన్ 4ను దీపక్ కుమార్ మిశ్రా, చందన్ కుమార్ క్రియేట్ చేశారు. దీనికి చందన్ కుమార్ రచన, దీపక్ కుమార్ మిశ్రా, అక్షత్ విజయ్వర్గియా దర్శకత్వం వహించారు. 2019లో మొదలైన ఈ పంచాయత్ వెబ్ సిరీస్ గతేడాది వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. జూన్ 24 నుంచి ప్రైమ్ వీడియోలో నాలుగో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం