యుద్ధంలో మరణించిన 1212 మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ కు తిరిగి అప్పగించిన రష్యా

Best Web Hosting Provider In India 2024


యుద్ధంలో మరణించిన 1212 మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ కు తిరిగి అప్పగించిన రష్యా

Sudarshan V HT Telugu

యుద్ధంలో చనిపోయిన సైనికుల మృతదేహాలను తిరిగి అప్పగించడానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత వారం ఒక ఒప్పందం కుదిరింది. అనంతరం, రష్యాతో యుద్ధంలో మరణించిన తమ సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ స్వదేశానికి తీసుకువెళ్లింది.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం (AFP/ Coordinating Headquarters for the Treatment of Prisoners of War)

యుద్ధంలో చనిపోయిన సైనికుల మృతదేహాలను తిరిగి అప్పగించడానికి సంబంధించి రష్యా, ఉక్రెయిన్ ల మధ్య గత వారం కుదిరిన ఒక ఒప్పందం నేపథ్యంలో.. రష్యాతో జరిగిన యుద్ధంలో మరణించిన 1,212 మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ స్వదేశానికి తీసుకువెళ్లింది.

రెడ్ క్రాస్ కమిటీ సమన్వయంతో

“ఒప్పందం ప్రకారం మరణించిన 1,212 మంది సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ కు తిరిగి అప్పగించాం” అని ఖైదీల మార్పిడి సమన్వయ కమిటీ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో తెలిపింది. అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ (ఐసీఆర్ సీ) సిబ్బంది అజ్ఞాత ప్రదేశంలో ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్న రిఫ్రిజిరేటెడ్ ట్రక్కులను దాటుకుంటూ నడుస్తున్న ఫొటోలను కమిటీ విడుదల చేసింది. కొన్ని ట్రక్కులపై “ఆన్ ది షీల్డ్” అనే ఉక్రేనియన్ సంస్థ యొక్క చిహ్నాలు ఉన్నాయి.

6,000 మృతదేహాలు

యుద్ధంలో మరణించిన సైనికుల మృతదేహాలను పరస్పరం అప్పగించుకోవడంపై కీవ్, మాస్కోలు ఏకాభిప్రాయానికి వచ్చాయి, అయితే ఈ ఒప్పందం అమలుపై తర్జనభర్జనలు జరిగాయి. రష్యా 6,000 మృతదేహాలను తిరిగి ఉక్రెయిన్ కు తరలించాలని అనుకుంటోందని, కానీ వాటిలో 15% మాత్రమే గుర్తించబడ్డాయని జూన్ 2 న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. “వారు మా సైనికుల మృతదేహాలను మాకు అప్పగించినప్పుడు, అలాగే, మరణించిన రష్యన్ సైనికుల మృతదేహాలను మేం వారికి అప్పగిస్తాము” అని జెలెన్స్కీ ఒక సమావేశంలో చెప్పారు.

రష్యా ఆధీనంలో ఉక్రెయిన్ భూభాగాలు

1,212 మృతదేహాలను ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ నిపుణులు, చట్ట అమలు సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బదిలీ చేస్తామని, వారు వీలైనంత త్వరగా వారి గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తారని ఖైదీల మార్పిడి సమన్వయ సంస్థ తెలిపింది. ఉక్రెయిన్ తూర్పు-మధ్య ప్రాంతమైన డ్నిప్రోపెట్రోవ్స్క్లో సహా మరిన్ని భూభాగాలను తమ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని రష్యా సోమవారం ప్రకటించింది. యుద్ధంలో అతిపెద్ద డ్రోన్ దాడిని మాస్కో ప్రారంభించిందని కీవ్ ప్రకటించడంతో ఘర్షణలు కొనసాగుతున్నాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link