




Best Web Hosting Provider In India 2024

నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు, ఇవిగో వివరాలు
నేతన్నలకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేనేత, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి సవిత వివరాలను వెల్లడించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వేలాది మంది నేతన్నలకు లబ్దిచేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు.
రాష్ట్రంలో దాదాపుగా 1,036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89 వేల మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచడం జరిగిందన్నారు. ఏపీసీవోకు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు మరియు ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు.
పెంపు వివరాలు…
బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు రూ.129 నుంచి రూ.148లకు (15%), డైయింగ్ ఛార్జీలు బండిల్కు రూ.362 నుంచి రూ.434లకు (20%) పెంచారు. ఇక బెడ్షీట్ నేత మజూరి రూ.83 నుంచి రూ.100లకు (20%) మరియు టవల్ నేత మజూరి రూ.31 నుంచి రూ.40లకు (30%) పెంచడం జరిగిందని మంత్రి వివరించారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా రూ.3 వేల ఆదాయం రానున్నదన్నారు.
దేశంలోనూ, రాష్ట్రంలోనూ గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారని మంత్రి సవిత గుర్తు చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్ద పీఠ వేయడం జరిగిందన్నారు. అధికారంలోకి రాగానే నేతన్నలకు చేదోడుగా ఉండేందుకై ఎగ్జిబిషన్లు, విక్రయదారులు, కొనుగోలు దారుల సమావేశాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఆధునిక డిజైన్లపై నేతన్నలకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే ఫించను ఇస్తామని ఇచ్చిన హామీని నిలపెట్టుకోవడం జరిగిందన్నారు. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున దాదాపు 92,274 మంది నేతన్నలకు ఫించను అందజేస్తున్నట్లు తెలిపారు. నేతన్న మగ్గాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. గృహ నిర్మాణ పథకం కింద కూడా నేతన్నలకు రూ.50 వేలు అదనంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
చేనేత, హస్తకళల నూతన డిజైన్ల పోటీలు – మంత్రి సవిత
రాష్ట్రంలోని నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆంధ్రప్రదేశ్ (NID-AP) సహకారంతో ఆప్కో, లేపాక్షి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్లను కళాకారుల నుంచి స్వీకరిస్తున్నామన్నారు. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నామని మంత్రి లిపారు.
ఆప్కో, లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, విశాఖపట్నం (IIM)తో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఆప్కో, లేపాక్షిలో జవాబుదారీతనం, పారదర్శకతను బలోపేతం చేయడం, లాభాల బాటలో పయనించేలా చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అన్నారు.
టాపిక్