వారెవా శార్దూల్.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో ఊచకోత.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు టెస్టు టీమ్ లోకి వచ్చేనా?

Best Web Hosting Provider In India 2024


వారెవా శార్దూల్.. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో ఊచకోత.. ఇంగ్లాండ్ తో సిరీస్ కు టెస్టు టీమ్ లోకి వచ్చేనా?

బెకెన్హామ్ వేదికగా ఇండియా-ఎ, ఇండియా జట్ల మధ్య జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ఊచకోత కోశాడు. 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం టీమిండియాలో చోటు దిశగా సాగుతున్నాడు.

శార్దూల్ ఠాకూర్ (BCCI Twitter)

ఇండియా, ఇండియా-ఎ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. అజేయంగా 122 పరుగులు సాధించాడు. ఈ బ్యాటింగ్ విధ్వంసంతో ఆల్ రౌండర్ శార్దూల్.. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోసం టీమిండియాలో చోటు దక్కించుకునే అవకాశాలను మెరుగుపర్చుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్ తో కూడిన బౌలింగ్ ఎటాక్ ను ఎదుర్కొన్నాడు శార్దూల్.

బౌలింగ్ లోనూ అదుర్స్

అంతకుముందు కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి వారిని ఇబ్బంది పెట్టిన శార్దూల్ ఇండియా-ఎ జట్టుకు బౌలింగ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. అంతకుముందు సర్ఫరాజ్ ఖాన్ 76 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. రెండో రోజు ఆటలో శార్దూల్ క్రీజులో అజేయంగా నిలిచాడు. మూడో రోజు బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ లలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మేనేజ్ మెంట్ కు ఇప్పుడు అసలు తలనొప్పిగా మారింది.

ఆ ట్రోఫీలో వేటు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం శార్దూల్ కు టీమిండియా జట్టులో చోటు దక్కకపోగా, నితీష్ కుమార్ రెడ్డి మొత్తం ఐదు టెస్టులు ఆడాడు. మెల్బోర్న్ టెస్టులో సెంచరీ కూడా సాధించాడు. అయితే, బంతితో అతను రాణించలేకపోయాడు. మరోవైపు జట్టు కష్ట సమయాల్లో ఆదుకునే ఆటగాడిగా శార్దూల్ కు పేరుంది. లార్డ్ శార్దూల్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ తో తొలి టెస్టు కు అతనికి ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కుతుందో లేదో చూడాలి.

రంజీల్లో నిలకడ

రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించిన శార్దూల్ దేశవాళీ సీజన్లో ముంబై తరఫున మెరిశాడు. ఈ ప్రదర్శనతోనే ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఆల్ రౌండర్ చివరిసారిగా 2023 డిసెంబర్లో సెంచూరియన్లో దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 331 పరుగులు చేసి, 31 వికెట్లు పడగొట్టాడు.

మధ్యలోనే స్టాప్

ఇక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ను టీమ్ మేనేజ్ మెంట్ మూడో రోజు ఆట మధ్యలోనే ముగించింది. జూన్ 16 (సోమవారం)వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే రెండున్నర రోజుల తర్వాత మ్యాచ్ ను యాజమాన్యం నిలిపివేసింది. దాదాపు ఎనిమిది సెషన్లు జరిగాయి. భారత్ తరఫున కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ బ్యాట్ తో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో భారత్ 469 పరుగులు చేసింది. భారత్-ఎ జట్టులో సర్ఫరాజ్ 76 బంతుల్లో 101 పరుగులు చేశాడు.

రెండో రోజు ఆటలో జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీయగా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఒక వికెట్ దక్కింది. ఈ నెల 17వ తేదీ మంగళవారం భారత జట్టు హెడింగ్లీకి బయలుదేరనుంది. తొలి టెస్టు జూన్ 20 నుంచి హెడింగ్లీలో ప్రారంభం కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link