





Best Web Hosting Provider In India 2024

రజినీకాంత్ నుంచి దాని కోసం 22ఏళ్లు ఎదురుచూశా.. ఇచ్చేశారు: మంచు విష్ణు
సూపర్ స్టార్ రజినీకాంత్కు కన్నప్ప చిత్రాన్ని చూపించారు మంచు విష్ణు. ఆ తర్వాత రజినీ రెస్పాన్స్ గురించి వెల్లడించారు. మరిన్ని విషయాలను ట్వీట్ చేశారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించిన కన్నప్ప చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. ప్రమోషన్లను మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. శివుడి పరమ భక్తుడు కన్నప్పగా ఈ చిత్రంలో విష్ణు నటించారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ కన్నప్ప చిత్రాన్ని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్కు మంచు విష్ణు ప్రత్యేకంగా చూపించారు.
22ఏళ్లుగా ఎదురుచూశా
గత రాత్రి రజినీకాంత్ తమ కన్నప్ప చిత్రం చూసి తనను గట్టిగా హత్తుకున్నారని, ఆయన నుంచి ఆ హగ్ కోసం తాను 22ఏళ్లుగా ఎదురుచూశానని మంచు విష్ణు నేడు (జూన్ 16) ట్వీట్ చేశారు. రజినీని తాను, తన తండ్రి మోహన్ బాబు కలిసిన ఫొటోలను పోస్ట్ చేశారు.
కన్నప్ప చిత్రం రజినీకాంత్కు చాలా నచ్చిందని విష్ణు రాసుకొచ్చారు. “గత రాత్రి రజినీకాంత్ అంకుల్ కన్నప్ప చిత్రం చూశారు. సినిమా అయిపోయాక నాకు టైట్ హగ్ ఇచ్చారు. తనకు సినిమా నచ్చిందని చెప్పారు. ఆ హగ్ కోసం నటుడిగా 22 ఏళ్లుగా ఎదురుచూశా. ఇది నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కన్నప్ప జూన్ 27న రానుంది. శివుడి లీలలను ఈ ప్రపంచం ఫీల్ అవడం చూసేందుకు ఎదురుచూడలేకున్నా” అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
మోహన్ బాబు, రజికాంత్లకు దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉంది. పెదరాయుడు సినిమాలో రజినీ, మోహన్ బాబు నటించారు. ఈ చిత్రం భారీ బ్లాక్బస్టర్ అవడంతో పాటు ఐకానిక్గా నిలిచింది.
హిందీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫిక్స్
కన్నప్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో వచ్చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దీంతో దేశంలోని పలు చోట్ల ప్రమోషన్లను మూవీ టీమ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో హిందీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజస్థాన్లోని నత్ద్వారాలో జూన్ 17న జరగనుంది. స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్గా పిలిచే శివుడి భారీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం సాగనుంది. తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ను కాళహస్తిలో నిర్వహించేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
కన్నప్ప చిత్రంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలకపాత్ర పోషించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, మధూ, బ్రహ్మాజీ, కరుణాస్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీకి స్టీఫెన్ దేవాసీ సంగీతం అందించారు. మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాకు దాదాపు రూ.150కోట్ల బడ్జెట్ అయినట్టు అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం