విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పాల్గొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నంలో స్వయంగా పర్యవేక్షించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

విశాఖపట్నం: ఈనెల 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ (International Yoga Day) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏర్పాట్లను వేగవంతం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా పాల్గొంటున్న ఈ భారీ కార్యక్రమ ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నంలో స్వయంగా పర్యవేక్షించారు.

భారీ జన సమీకరణ, పకడ్బందీ ప్రణాళిక:

విశాఖలోని ఆర్కే బీచ్‌ను ప్రధాన వేదికగా ఐదు లక్షల మంది యోగాడేకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. యోగాంధ్ర 2025 నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరెంథిర ప్రసాద్‌లు బీచ్ రోడ్డు వెంబడి, ఇతర వేదికల్లో చేసిన ఏర్పాట్లను సీఎంకు వివరంగా వివరించారు.

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు:

ఈ యోగాడే కార్యక్రమంలో పాల్గొంటున్న వారిని సమన్వయం చేసేందుకు 607 సచివాలయాల సిబ్బందిని వినియోగిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ సౌకర్యవంతంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మాక్ యోగా, ట్రాఫిక్ నియంత్రణ:

యోగా డే కార్యక్రమానికి ముందు పాల్గొనే వారితో మాక్ యోగా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఉదయం 06:30 నుంచి 08 గంటల వరకు ఈ మాక్ యోగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ప్రధాని సహా ముఖ్యులు పాల్గొంటున్న నేపథ్యంలో భద్రతాపరంగా చేసిన ఏర్పాట్లను అధికారులు సీఎంకు వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి యోగాడే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేవారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు ఎలా చేశారని అడిగి తెలుసుకున్నారు. ఆర్కే బీచ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.

ముగిసిన సమీక్ష, సీఎం దిశానిర్దేశం:

అంతర్జాతీయ యోగా-డే కార్యక్రమ నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ప్రధాని సూచనలు, రాష్ట్ర లక్ష్యం:

“ఏపీ కేంద్రంగా ఈసారి అంతర్జాతీయ యోగా డే చేస్తే బాగుంటుందని ప్రధాని మోదీ సూచించారు. తాము నిర్వహించి సక్సెస్ చేస్తామని ప్రధానికి మాటిచ్చాను” అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం ఆదేశించారు.

లోటుపాట్లు లేని పకడ్బందీ నిర్వహణ:

“యోగా-డే కార్యక్రమ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు.. పొరపాట్లు దొర్లకూడదు” అని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. యోగా డే కార్యక్రమంలో పాల్గొనే వారికి ముందుగానే అన్ని రకాలుగా మార్గనిర్దేశం చేయాలని సూచించారు. విశాఖకు వచ్చే వారిని బస్సు ఎక్కడానికి ముందు నుంచి, కార్యక్రమం ముగిసి తిరిగి వెళ్లేంత వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. యోగా డే కార్యక్రమానికి హాజరయ్యేవారిని వీలైనంత దగ్గరగా బస్సుల్లో తీసుకురావాలని, ఉదయం 06:00-06:30 గంటల మధ్యలో అందరూ వారి వారి స్థానాలకు చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

‘యోగా జీవన విధానంగా మారాలి’:

అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఒక ‘డిక్లరేషన్’ చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. యోగా అనేది దైనందిన జీవితంలో ఒక జీవన విధానంగా మారేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ యోగా డే కార్యక్రమ నిర్వహణలో ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పరిపూర్ణత్వంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. యోగా డేలో పాల్గొనే వారిని తీసుకొచ్చే ప్రతి బస్సులోనూ ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చూసుకోవాలని, వారిని నిర్దేశిత ప్రదేశానికి ముందుగా చేరుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.

HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

టాపిక్

YogaChandrababu NaiduVisakhapatnam
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024